Suicide Attempt: అప్పులిచ్చిన వారి వేధింపులు.. భరించలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
A Couple Suicide Attempt: తమకు తెలియకుండా కుమారుడికి అప్పులిచ్చి.. అధిక వడ్డీలతో పీడిస్తున్న వారి వేధింపులు తాళలేక నడిరోడ్డుపై దంపతులు పెట్రోల్ పోసుకుని, ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. తిరుమలగిరికి చెందిన ఎడ్ల వెంకన్న, రమాదేవి దంపతుల కుమారుడు సాయికుమార్.. జలాలురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ వద్ద తల్లిదండ్రులకు తెలియకుండా రూ.2లక్షలు అప్పు తీసుకున్నాడు.
దీనికి 30రూపాయల వడ్డీ చొప్పున కొన్నాళ్ల పాటు సాయికుమార్ చెల్లిస్తూ వచ్చాడు. గత మూడు నెలలుగా సదరు యువకుడు వడ్డీ చెల్లించకపోవటంతో శ్రీనివాస్.. అతని తల్లిదండ్రులకు వద్దకు వెళ్లాడు. అప్పటి నుంచి ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే సాయికుమార్ ఇంట్లో నుంచి హైదరాబాద్కు వెళ్లిపోయాడు. దీంతో అప్పులిచ్చిన వ్యక్తి.. వెంకన్న ఇంటి వద్దకు వచ్చి డబ్బులివ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు చేసేదేమిలేక.. తిరుమలగిరిలోని తెలంగాణ చౌరస్తాలో దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు వారిని అడ్డుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.