ETV Bharat / bharat

ఇకపై మాస్క్​ తప్పనిసరి కాదా? కొత్త రూల్స్​ ఏం చెబుతున్నాయి?

author img

By

Published : Mar 31, 2022, 7:20 PM IST

Updated : Apr 1, 2022, 11:56 AM IST

mask-mandatory
మాస్క్​

Mask mandatory rules: కరోనా మహమ్మారి విజృంభణతో మాస్క్​ ధరించటం తప్పనిసరి చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా తగ్గిపోయిన క్రమంలో దాదాపు రెండేళ్ల తర్వాత ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి పలు రాష్ట్రాలు. తాజా నిర్ణయంతో ఆయా ప్రాంతాల్లో మాస్క్​ ధరించటం అవసరం లేదా? కొత్త నిబంధనలు చెబుతున్నవేంటి?

Mask mandatory rules: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కొత్త కేసులు అత్యల్పంగా నమోదవుతున్నందున పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొవిడ్​ ఆంక్షలను సడలిస్తూ అటు కేంద్రంతో పాటు ఇటు పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి. కరోనా వ్యాప్తి చెందిన రెండేళ్ల తర్వాత మాస్క్​ తప్పనిసరి సహా అన్ని ఆంక్షలను ఏప్రిల్​ 1 నుంచి ఎత్తివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

  • విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం కరోనా కట్టడికి విధించిన అన్ని ఆంక్షల తొలగింపు. 2022, ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి. అన్ని జిల్లా విపత్తు నిర్వహణ అధికారులకు పలు సూచనలు జారీ.
  • రాష్ట్ర ప్రజలు, వ్యాపార సముదాయాలు, సంస్థల్లో మాస్క్​ ధరించటం, భౌతిక దూరం పాటించటం వంటి కొవిడ్​ నియమాలు పాటించాలని సూచన. మరోవైపు.. కొత్త కేసులు, మరణాలు, వ్యాప్తి వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని డీడీఎంఏలకు ఆదేశం.

మాస్క్​పై జరిమానాలు బంద్​: ఏప్రిల్​ 1 నుంచి మాస్క్​పై జరిమానాలు ఎత్తివేస్తున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు. మరోవైపు.. ప్రజలు స్వచ్ఛందంగా మాస్క్​ ధరించాలని కోరింది బృహాన్​ ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​. ఏప్రిల్​ 2 నుంచి అన్ని కొవిడ్​ ఆంక్షలను ఎత్తివేయనున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలో సోమవారం మంత్రివర్గం సమావేశమై కొవిడ్ ఆంక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్​ తోపే తెలిపారు. 'గుడి పడ్వా(మహారాష్ట్ర నూతన సంవత్సరం) నుంచి కొవిడ్​-19 సంబంధించిన ఆంక్షలను తొలగిస్తున్నాం.' అని పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో మాస్క్​ ధరించటం తప్పనిసరి కాదు.

'నో మాస్క్' ఫైన్​ తొలగింపు: కరోనా వైరస్​ కేసులు భారీగా తగ్గిన క్రమంలో గురువారం కీలక నిర్ణయం తీసుకుంది దిల్లీ విపత్తు నిర్వహణ విభాగం(డీడీఎంఏ). బహిరంగ ప్రదేశాల్లో మాస్క్​ ధరించని వారికి ఇకపై జరిమానా విధించబోమని అధికారవర్గాలు తెలిపాయి. అయితే, రద్దీ ప్రాంతాల్లో మాస్క్​ ధరించాలని సూచిస్తూ అడ్వైజరీ విడుదల చేయనున్నారని, లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్​ బైజల్​ నేతృత్వంలో సమావేశమైన డీడీఎంఏ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ​బహిరంగ ప్రదేశాల్లో మాస్క్​ లేని వారికి రూ.500 జరిమానా విధిస్తోంది దిల్లీ ప్రభుత్వం.

బంగాల్​లో కొవిడ్​ ఆంక్షల ఎత్తివేత: బంగాల్​లో కొవిడ్​ పరిస్థితులు మెరుగుపడుతున్న క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి నుంచి కొవిడ్​-19 సంబంధిత అన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. 2020, మార్చిలో కరోనా వ్యాప్తి చెందిన దాదాపు రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో ఆంక్షలు తొలగించారు. అయితే, మాస్క్​లు ధరించటం, పరిశుభ్రత చర్యలు ప్రజలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.

ఇదీ చూడండి: ట'మాట'కు వృద్ధుడి ప్రాణం బలి- భార్యను టీజ్ చేశాడనుకుని కొట్టి చంపిన పక్కింటి వ్యక్తి!

Last Updated :Apr 1, 2022, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.