ETV Bharat / bharat

Kodikatthi case: కోడికత్తి కేసు.. జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన ఎన్‌ఐఏ కోర్టు

author img

By

Published : Jul 25, 2023, 4:51 PM IST

Updated : Jul 25, 2023, 6:53 PM IST

Kodikatthi case
Kodikatthi case

16:48 July 25

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అంశంపై వచ్చే నెల 1న విచారణ

Kodikatthi case updates: విశాఖపట్నం జిల్లా విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై జరిగిన కోడికత్తి ఘటనకు సంబంధించి.. విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. కోడికత్తి కేసులో జగన్ వేసిన పిటిషన్‌ను ఎన్‌ఐఏ కోర్టు కొట్టివేసింది. కుట్ర కోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని గతంలో జగన్ వేసిన పిటిషన్లపై మంగళవారం ఎన్‌ఐఏ కోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అంశంపై వచ్చే నెల 1న విచారణ చేపడతామని పేర్కొంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న శ్రీనివాస్‌ బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా వచ్చే నెల 1కి వాయిదా వేసింది. అనంతరం రెగ్యులర్ విచారణ వేళ నిందితుడు శ్రీనివాస్‌ను విజయవాడ జైలులో ఉంచాలని న్యాయవాది సూచించగా.. విజయవాడ జైలులో రద్దీ వల్ల రెగ్యులర్‌ విచారణ సాధ్యం కాదని అధికారులు న్యాయమూర్తికి తెలియజేశారు.

కోడికత్తి కేసుపై జగన్ పిటిషన్లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్‌‌పై జరిగిన కోడికత్తి ఘటన సంచలనం సృష్టించింది. ఆ కేసుకు సంబంధించి విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో సీఎం జగన్ ఇటీవలే రెండు పిటిషన్‌లు వేశారు. మొదటి పిటిషన్‌లో.. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని.. కోర్టుకు వస్తే ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. తాను కోర్టుకు హాజరైతే.. అధికారిక కార్యక్రమాల షెడ్యూల్‌ కూడా దెబ్బతింటుందని, సంక్షేమ పథకాల అమలుకు ఆటంకం ఏర్పడుతుందని వివరించారు. కాబట్టి తన తరుఫున ఓ అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించి.. కోడికత్తి కేసులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తన సాక్ష్యాన్ని నమోదు చేయాలని సీఎం జగన్ ఎన్‌ఐఏ న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తూ..మొదటి పిటిషన్‌ దాఖలు చేశారు.

విచారణ కొనసాగిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుంది.. రెండవ పిటిషన్‌లో విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం వెనుక దాగి ఉన్న కుట్ర, అందులో ప్రమేయమున్న వ్యక్తుల గురించి లోతైన దర్యాప్తు నిర్వహించకుండా.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభియోగపత్రం దాఖలు చేసిందని జగన్ పేర్కొన్నారు. ఇలాగే కోర్టులో కోడికత్తి ఘటనపై విచారణ కొనసాగిస్తే.. కేసులో బాధితుడిగా ఉన్న తనకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కావున కుట్ర కోణాన్ని వెలికితీసేలా.. మరింత దర్యాప్తు జరిపేలా.. ఎన్‌ఐఏ కోర్టు అధికారులకు ఆదేశాలివ్వాలని రెండవ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ రెండు పిటిషన్లపై పలుమార్లు విచారించిన విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టు.. విచారణను వాయిదా వేస్తూ వచ్చింది. అయితే, నాలుగేళ్ల కిందట 2019 జనవరి 17న ఎన్‌ఐఏకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలనే సీఎం జగన్‌ మరోమారు ఆ రెండు పిటిషన్‌లలో పిటిషన్‌లో ప్రస్తావించారు.

న్యాయస్థానానికి వస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది.. కోడికత్తి కేసులో బాధితుడైన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. సాక్ష్యం చెప్పటానికి కోర్టుకు రావాలంటూ న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. కానీ, సీఎం జగన్ విచారణకు హాజరుకాలేదు. తాను న్యాయస్థానానికి వస్తే కార్యక్రమాల షెడ్యూల్‌ దెబ్బతింటుందని, ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతాయని.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సాక్ష్యం నమోదు చేయాలని కోర్టును అభ్యర్థించారు. వీటిపై ఎన్‌ఐఏ, నిందితుడు జె.శ్రీనివాసరావు తరఫున కౌంటర్లు దాఖలు చేసేందుకు, వాదనలు వినిపించేందుకు కోర్టు ఆదేశాలిచ్చింది.

జగన్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు.. ఈ క్రమంలో కోడికత్తి ఘటనకు సంబంధించి..ముఖ్యమంత్రి జగన్ వేసిన రెండు పిటిషన్‌లపై ఈరోజు విజయవాడలో ఉన్న ఎన్‌ఐఏ కోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా తనపై (జగన్) జరిగిన హత్యాయత్నం వెనుక దాగి ఉన్న కుట్ర, అందులో ప్రమేయమున్న వ్యక్తుల గురించి లోతైన దర్యాప్తు నిర్వహించాలన్న జగన్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అంశంపై వచ్చే నెల 1న విచారణ చేపడతామని తెలియజేస్తూ.. ఈ కేసులో నిందితుడుగా ఉన్న శ్రీనివాస్‌ బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా వచ్చే నెల 1కి వాయిదా వేసింది.

Last Updated :Jul 25, 2023, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.