ETV Bharat / bharat

కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్​.. కాంగ్రెస్​ గూటికి మాజీ సీఎం శెట్టర్​

author img

By

Published : Apr 17, 2023, 9:43 AM IST

Updated : Apr 17, 2023, 10:48 AM IST

కర్ణాటకలో కాషాయ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం జగదీశ్ శెట్టర్​ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. తాను నిర్మించిన పార్టీ నుంచి తననే బలవంతంగా గెంటేశారని శెట్టర్ విమర్శించారు.

karnataka election 2023
karnataka election 2023

కర్ణాటకలో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత జగదీశ్ శెట్టర్​ కాంగ్రెస్​లో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జగదీశ్ శెట్టర్​ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్​, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ ఇంఛార్జ్ రణ్​దీప్ సుర్జేవాలా పాల్గొన్నారు. ఆదివారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి జగదీశ్ షెట్టర్​ రాజీనామా చేశారు. అసెంబ్లీ సీటు నిరాకరించడం వల్ల శెట్టర్​ బీజేపీని వీడారు.

కాంగ్రెస్​లో చేరిన అనంతరం జగదీశ్ శెట్టర్​ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీని బలపరిచేందుకు పార్టీ కార్యకర్తగా నిరంతరం శ్రమించానని అన్నారు. మనస్పూర్తిగానే కాంగ్రెస్​లో చేరుతున్నానని తెలిపారు. బీజేపీ ప్రస్తుతం కొందరి నియంత్రణలో ఉందని విమర్శించారు. తాను నిర్మించిన పార్టీ నుంచి తననే బలవంతంగా గెంటేశారని శెట్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

karnataka election 2023
కాంగ్రెస్​లో చేరిన జగదీశ్ శెట్టర్

'ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన తాను కాంగ్రెస్​ చేరడం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీ నాకు ప్రతి పదవి ఇచ్చింది. పార్టీ కార్యకర్తగా బీజేపీ ఎదుగులదలకు నిరంతరం శ్రమించా. పార్టీ సీనియర్​ నాయకుడినైన నాకు టికెట్​ వస్తుందని ఆశించా. కానీ బీజేపీ అధిష్ఠానం టికెట్ నిరాకరించింది. ఒక్కసారి షాక్​కు గురయ్యాను. నాతో పార్టీ పెద్దలు కనీసం కనీసం చర్చలు కూడా జరపలేదు. మనస్పూర్తిగా కాంగ్రెస్‌లో చేరుతున్నాను. కేపీసీసీ చీఫ్​ డీకే శివకుమార్, కాంగ్రెస్ కర్ణాటక ఇంఛార్జ్​ రణదీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య , ఎంబీ పాటిల్ సహా పలువురు నేతలు నన్ను సంప్రదించారు. కాంగ్రెస్​లో చేరాలని ఆహ్వానించారు. అందుకే కాంగ్రెస్​ పార్టీలో చేరాను.'
--జగదీశ్ శెట్టర్, మాజీ ముఖ్యమంత్రి

జగదీశ్ శెట్టర్ చేరిక కాంగ్రెస్​లో మరింత ఉత్సాహాన్ని పెంచుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. శెట్టర్​.. తాను గెలవడమే కాకుండా.. మరికొందరిని గెలిపించగల సామర్థ్యం ఉన్న నేత అని కొనియాడారు. మరోవైపు.. జగదీశ్ శెట్టర్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ అగ్రనేత సిద్ధరామయ్య అన్నారు. రాష్ట్రంలో శెట్టర్​కు మంచి రాజకీయ నాయకుడిగా పేరుందని అన్నారు. 'ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తి అయినప్పటికీ సెక్యులర్‌ భావాలు ఉన్న వ్యక్తి శెట్టర్​. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శెట్టర్​ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ సమయంలో ఆయనతో కలిసి పనిచేశా. శెట్టర్​.. బీజేపీలో నిజాయతీ గల వ్యక్తి. ఆ పార్టీకి ఎల్లప్పుడూ అండగా నిలిచారు. జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్​లో చేరడం వల్ల 150కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తాం. రాష్ట్రంలో లింగాయత్​ కమ్యూనిటీకి చెందిన నాయకులను బీజేపీ అవమానిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు. ఆ సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు మరో నేత జగదీశ్ శెట్టర్​కు టికెట్ కేటాయించకుండా ఇబ్బంది పెట్టారు' అని సిద్ధరామయ్య అన్నారు.

karnataka election 2023
కాంగ్రెస్​లో చేరిన జగదీశ్ శెట్టర్

భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన జగదీశ్‌ శెట్టర్‌.. హుబ్బళ్లి-ధార్వాడ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉత్తర కర్ణాటకలో ఆయన బలమైన నేత. బీజేపీ అధిష్ఠానం ఆయన వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన సోమవారం కాంగ్రెస్ గూటికి చేరారు. హుబ్బళ్లి-ధార్వాడ టికెట్​ను జగదీశ్ శెట్టర్​కు కాంగ్రెస్ కేటాయించింది. పార్టీలో చేరిన వెంటనే కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్​.. జగదీశ్ శెట్టర్​కు బీ ఫామ్ అందించారు.

karnataka election 2023
జగదీశ్ శెట్టర్​కు బీ ఫామ్ ఇస్తున్న కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్

కర్ణాటకలో 224 శాసనసభ స్థానాలకుగానూ ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 10న పోలింగ్ జరగనుండగా.. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నువ్వా-నేనా అన్న రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

Last Updated :Apr 17, 2023, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.