ETV Bharat / bharat

సుప్రీంలో సంచలనం.. కొలీజియంలో తొలిసారి అలా.. కొత్త సీజేఐ వచ్చాకే ఏదైనా..

author img

By

Published : Oct 10, 2022, 8:21 PM IST

sc collegium latest recommendation
sc collegium latest recommendation

సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. న్యాయమూర్తుల నియామకానికి అనుసరించిన పద్ధతిపై ఇద్దరు జడ్జిలు అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల బ్రేక్ పడింది. అయితే, తొలిసారి అభ్యంతరాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తుల పేర్లను వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.

దేశంలోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. కొలీజియంలో ఉన్న ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు.. హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేసినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొలీజియం తరపున విడుదల చేసిన ప్రకటనలో సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, తొలిసారి కొలీజియంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తుల పేర్లను వెల్లడించడం చర్చకు దారితీసింది. న్యాయమూర్తుల నియామకానికి అనుసరించిన పద్ధతే అభ్యంతరాలకు కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు అక్టోబర్​ 9న కీలక ప్రకటనను విడుదల చేసింది. కొలీజియం సమావేశానికి జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ ఎస్​ అబ్దుల్​ నజీర్​ హాజరు కాలేదు. దీంతో సభ్యులు అభిప్రాయాలు సేకరించేందుకు తొలిసారిగా ఉపయోగించిన సర్కులేషన్​ పద్ధతిని ఇద్దరు న్యాయమూర్తులు వ్యతిరేకించారని తెలిపింది.

సాధారణంగా న్యాయమూర్తులు నియామకానికి కొలీజియం భౌతికంగా సమావేశం అవుతుంది. కానీ సెప్టెంబర్​ 30న జరిగిన సమావేశానికి ఇద్దరు న్యాయమూర్తులు భౌతికంగా హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్​ సర్కులేషన్​ పద్ధతిని అనుసరించారు. ఇది తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీంతో కొలీజియంలోని సభ్యులు న్యాయమూర్తులు నియామక ప్రక్రియకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం వెనక జరిగిన పరిణామాలపై కొలీజీయం ప్రకటనను విడుదల చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్​ నేతృత్వంలోని కొలీజియంలో జస్టిస్ డీవై చంద్రచూడ్​, సంజయ్​ కిషన్ కౌల్​, ఎస్ అబ్దుల్​ నజీర్​, కేఎం జోసెఫ్​ సభ్యులుగా ఉన్నారు. న్యాయమూర్తుల నియామకాల కోసం మొదట సెప్టెంబర్​ 26న కొలీజియం సమావేశమైంది. ఈ క్రమంలోనే 11 మంది జడ్జిల పేర్లు పరిశీలించగా.. అందులో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్​ దత్తాపై ఏకాభిప్రాయం వచ్చింది. మిగిలిన వారిపై చర్చించేందుకు సెప్టెంబర్​ 30న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్​ 30న జరిగిన సమావేశానికి జస్టిస్ డీవై చంద్రచూడ్​ హాజరు కాలేదు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యుయు లలిత్​ సర్కులేషన్​ పద్ధతిలో కొలీజియంలో ఉన్న సభ్యులకు లేఖ రాశారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్​, జస్టిస్ అబ్దుల్ నజీర్​ వేర్వేరు లేఖల్లో తమ అభ్యంతరాలను తెలిపారు. సాధారణంగా అభ్యంతరాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తుల పేర్లను వెల్లడించరు. కానీ, ఈసారి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్లను కొలీజియం ప్రకటించడం గమనార్హం.

ఈ క్రమంలోనే తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును ప్రతిపాదించాలంటూ కేంద్ర న్యాయశాఖమంత్రి కిరణ్​ రిజుజు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియను ముగించినట్లు సుప్రీంకోర్టు కొలీజియం ప్రకటనలో తెలిపింది. ఇక తర్వాతి సీజేఐ వచ్చిన తర్వాతే కొలీజియం భేటీ కానుంది. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యుయు లలిత్​ నవంబర్​ 8న పదవీ విరమణ పొందనున్నారు. సీనియారిటీ పద్ధతి ప్రకారం తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్​ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో కలిపి మొత్తం 29 మంది ఉన్నారు.

ఇవీ చదవండి : 'జాతీయ జంతువుగా ఆవు' పిటిషన్​ తిరస్కరణ.. కొలీజియం నియామకాలకు బ్రేక్

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.