ETV Bharat / bharat

ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు- వ్యాన్​ ఢీ.. 8 మంది మృతి

author img

By

Published : Jul 8, 2023, 3:11 PM IST

Updated : Jul 8, 2023, 4:35 PM IST

Haryana Road Accident : హరియాణాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డరు. మరో ఘటనలో ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులు మృతిచెందారు. ఈ విషాదం ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

haryana road accident
హరియాణ రోడ్డు ప్రమాదం

Haryana Road Accident : హరియాణాలో ఆర్టీసీ బస్సు - వ్యాన్​ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బీబీపుర్ గ్రామ సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగింది ఇలా..
హరియణాలోని జింద్​ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 9 గంటలకు జింద్ బస్టాండ్​ నుంచి బయళ్దేరిన ఆర్టీసీ బస్సు.. బీబీపుర్ గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన క్రూయిజర్ (తుపాన్ ప్యాసింజర్ వాహనం)ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా వ్యాన్​ ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలను క్రుయిజర్​లో గుర్తించినట్లు సమాచారం. కాగా మృతులు అందరూ క్రుయిజర్​లో ప్రయాణిస్తున్న వారే. బస్సు డ్రైవర్​ సైతం ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. ఘటనా స్థలికి వెంటనే ఆరు అంబులెన్స్​లు చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించాయి.

గాయపడిన వారిలో ఆరుగురు రోహ్​తక్​లోని పీజీఐఎంఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో ఇద్దరికి జింద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కాగా మృతుల్లో ఒక మహిళ ఉన్నట్లు గుర్తించామని స్థానిక పోలీసులు తెలిపారు.

ఈతకు వెళ్లిన చిన్నారులు మృత్యువు ఒడికి..
ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులు చెరువులో నీటమునిగి మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

up crime
చిన్నారుల మరణ వార్తతో విషాదంలో మునిగిపోయిన గ్రామస్థులు

ఇదీ జరిగింది..
రాయ్​బరేలి జిల్లాలోని గదగంజ్​ పోలీస్​స్టేషన్​ పరిధి.. మంగతక పూర్వ గ్రామానికి చెందిన ఎనిమిది మంది చిన్నారులు సమీపంలోని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. నీటి లోతు తెలియని పిల్లలు ఈత కొట్టేందుకు చెరువులో దూకారు. దీంతో నీటిలో మునిగిపోతున్న చిన్నారులు బిగ్గరగా అరవడం వల్ల చుట్టు పక్కల వారు వచ్చి వారిని బయటకు తీశారు.

కానీ అప్పటికే ఐదుగురు మృతిచెందారు. విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతి చెందిన వారిలో ఇద్దరు సొంత అక్కాచెల్లెళ్లు (వైశాలీ, రూపాలీ), ఓ అక్కాతమ్ముడు (అమిత్​, సోనమ్), మరో చిన్నారి (రితూ) ఉన్నారు. వీరంతా మూడు కుటుంబాలకు చెందిన వారే. ఈతకు వెళ్లిన చిన్నారులు నిర్జీవంగా మారడం వల్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Last Updated :Jul 8, 2023, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.