ETV Bharat / bharat

'ఆ ఆంక్షలు ఎత్తేయండి!'.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన

author img

By

Published : Feb 16, 2022, 7:27 PM IST

COVID-19 restrictions: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున కేంద్రం కీలక సూచనలు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. కొవిడ్​ పరిస్థితులను సమీక్షించి ఆంక్షలను ఎత్తివేయాలని లేదా సడలించాలని నిర్దేశించింది.

Govt asks states to review, amend additional COVID-19 restrictions
Govt asks states to review, amend additional COVID-19 restrictions

COVID-19 restrictions: అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. ఆయా ప్రాంతాల్లో కొవిడ్​ పరిస్థితులపై సమీక్షించి.. ఆంక్షలను సడలించాలని లేదా ఉపసంహరించుకోవాలని పేర్కొంది. రోజువారీ కరోనా కేసులు, పాజిటివిటీ రేటును పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర పాలితప్రాంతాల ముఖ్య పాలనాధికారులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్​ భూషణ్​ లేఖ రాశారు. జనవరి 21 నుంచి దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

కొద్దిరోజుల క్రితం కరోనా విజృంభించిన కారణంగా.. చాలా రాష్ట్రాలు సరిహద్దులు, విమానాశ్రయాల్లో అదనపు ఆంక్షలు విధించినట్లు భూషణ్​ తెలిపారు. ఈ నేపథ్యంలో.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని, వారి ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం కలిగించకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. అయితే.. టెస్ట్​, ట్రాక్​, ట్రీట్​ సహా వ్యాక్సినేషన్​, కొవిడ్​ నిబంధనలకు కట్టుబడి ఉండటం తప్పనిసరిగా చేయాలని ఉద్ఘాటించారు.

International Passengers Quarantine: అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలను సడలించిన విషయాన్ని కూడా భూషణ్​ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కొవిడ్​ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను కేంద్రం ఇటీవలే సడలించింది. ప్రయాణికులు ఇకపై ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్​లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ స్థానంలో ప్రయాణికులు 14 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణ చేసుకుంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఈనెల 14న అమలులోకి రానున్నట్లు వెల్లడించింది.

ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

భారత్​లో గత వారం సగటున రోజుకు 50 వేల 476 కేసులు నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు దేశంలో 30,615 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. కొవిడ్​ ధాటికి మరో 514 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 82,988 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

New Recombinant Variants of Covid: మరోవైపు.. కొవిడ్​ రీకాంబినెంట్​ వేరియంట్ల గురించి ప్రస్తుతానికి ఆందోళన అనవసరమని ప్రముఖ వైరాలజిస్ట్​ వినోద్​ సెరియా తెలిపారు. ఇటీవల యూకే, ఇండియాలో XA, అమెరికాలో XB, జపాన్​లో XC (ఆల్ఫా+డెల్టా) రీకాంబినెంట్​ వేరియంట్లు కనిపించాయని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న డెల్టా- ఒమిక్రాన్​ రీకాంబినెంట్​ వేరియంట్​ సంకేతాలు కనిపించాయని బ్రిటన్​ ప్రకటించింది.

Goa Vaccination: గోవాలో వ్యాక్సినేషన్​ నూరు శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని అర్హత కలిగిన 11.66 లక్షల జనాభాకు కరోనా టీకా రెండు డోసులు అందించినట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కొవిడ్​-19 వ్యాక్సినేషన్​ కేంద్రాలను మూసివేయనున్నట్లు రాష్ట్ర వైద్య సేవల విభాగం వెల్లడించింది. ఇకపై ఇతర సాధారణ టీకా పంపిణీ కార్యక్రమాల్లోనే.. కరోనా వ్యాక్సిన్​ను భాగం చేయనున్నట్లు స్పష్టం చేశారు.

Kerala Corona cases: కేరళలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం మరో 12,233 మందికి వైరస్​ సోకింది. 25 మరణాలు నమోదయ్యాయి.

ముంబయిలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 255 కొత్త కేసులు వెలుగుచూడగా.. ఒక్కరూ మరణించలేదని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: పంజాబ్ చతుర్ముఖ పోరులో గెలిచేదెవరు? కింగ్​ మేకర్​గా ఆ పార్టీ?

India Covid cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.