తీవ్ర అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేర్చిన తన తండ్రిని ప్రాణపాయ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు ఆ కుమారుడు. దీంతో ఒక్కసారిగా ఆస్పత్రిలోనే కుప్పకూలి మరణించాడు. అనంతరం తన కుమారుడి మరణవార్త తెలుసుకున్న ఆ తండ్రి కూడా షాక్కు గురై ఆస్పత్రి బెడ్పైనే చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ హృదయ విదారక ఘటన ఒడిశా సుబర్ణాపుర్ జిల్లాలోని తారాభ ప్రాంతంలో నెలకొంది. ఒకేరోజు కొన్ని గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులు మరణించడం వల్ల వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
శనివారం సాయంత్రం తండ్రి 'ఆది సా'(72) అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడి కుమారుడు 'అర్తత్రానా సా'(48) తండ్రిని బలంగిర్లోని భీంభోయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆదివారం ఉదయం పని మీద ఆస్పత్రిలోని తండ్రిని వదిలి బయటకు వెళ్లాడు అర్తత్రానా. అనంతరం పని ముగించుకొని ఆస్పత్రికి తిరిగి వచ్చిన అతడు తండ్రి ప్రాణపాయ స్థితిలో ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న వైద్యులు అప్పటికే అర్తత్రానా మరణించినట్లుగా గుర్తించారు. అక్కడే బెడ్పై చికిత్స పొందుతున్న తండ్రి ఆది కుమారుడి మరణవార్త విని తుదిశ్వాస విడిచాడు. ఒకేరోజు కొన్ని గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులు మరణించడం వల్ల స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్ట్మార్టం పరీక్షల అనంతరం ఇద్దరి మృతదేహాలను గ్రామానికి తీసుకొచ్చి ఒకే దగ్గర అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు.
మృతుడు 'ఆది సా'కి భార్య, ఓ దివ్యాంగ కుమారుడు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నువ్వు లేక నేను లేను..
కొద్దిరోజుల క్రితం కూడా ఇదే తరహా ఘటన కర్ణాటకలో జరిగింది. హవేరి జిల్లా సవనూరు తాలూకా ఇచ్వంగి గ్రామంలో ఓ వృద్ధ దంపతులు 55 ఏళ్లుగా నివసిస్తున్నారు. అనారోగ్యంతో భర్త చనిపోయిన కొద్ది గంటల్లోనే భార్య కూడా ప్రాణాలు విడిచింది. వీరికి నలుగురు పిల్లలు, పదకొండు మంది మనవళ్లు ఉన్నారు.
కొడుకు లేడని తల్లి కూడా..
కుమారుడి మరణవార్త విన్న తల్లి గుండెపోటుతో మరణించింది. ఈ ఘటన కొద్దిరోజుల క్రితం కర్ణాటక బాగల్కోట్ జిల్లాలోని కలదగి గ్రామంలో వెలుగు చూసింది. కాగా, మృతులు.. కుమారుడు దశరథ దుర్వే(60), తల్లి షావక్క దుర్వే(90)గా పోలీసులు తెలిపారు.