ETV Bharat / bharat

రైతుల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం: బాదల్

author img

By

Published : Sep 18, 2020, 9:05 PM IST

allaince-is-important-but-so-is-party-ideology-will-decide-about-future-with-party-leaders
రైతుల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం: బాదల్

భాజపాతో పొత్తు కొనసాగించడం ముఖ్యమేనని, కానీ తమకు సొంత సిద్ధాంతాలు ఉన్నాయని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్​బీర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధరను బిల్లులో చేర్చకపోవడం వల్లే ప్రభుత్వం నుంచి తప్పుకున్నట్లు స్పష్టతనిచ్చారు. ఈ మేరకు ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. రైతుల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని తెలిపారు.

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు.. చిరకాల మిత్రపక్షాలైన శిరోమణి అకాలీదళ్, భాజపా మధ్య అభిప్రాయబేధాలకు కారణమయ్యాయి. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఎంపీ హర్​సిమ్రత్ కౌర్ ఇప్పటికే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

భాజపాతో పొత్తు కొనసాగించడం ముఖ్యమేనని, కానీ తమకు సొంత సిద్ధాంతాలు ఉన్నాయని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్​బీర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. తాము రైతుల పక్షాన నిలబడతామని అన్నారు. తమ ఆందోళనలకు పరిష్కారం లభించనప్పుడు కేబినెట్​లో కొనసాగే అవసరం లేదని వ్యాఖ్యానించారు.

కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ)పై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ హామీ ఇచ్చినప్పటికీ.. బిల్లులను వ్యతిరేకించడంపై స్పష్టతనిచ్చారు సుఖ్​బీర్.

"తోమర్ రాసిన లేఖను రైతులకు చూపించాం. లిఖితపూర్వక హామీకి రైతులు సంతృప్తి చెందలేదు. ఎంఎస్​పీపై హామీని బిల్లులో చేర్చాలని వారు కోరారు. కేంద్రం ఆ పని చేయలేదు. అందుకే ప్రభుత్వంలో నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాం. తుది ముసాయిదా రూపొందించిన తర్వాత కూడా మమ్మల్ని సంప్రదించలేదు."

-సుఖ్​బీర్ సింగ్ బాదల్, అకాలీదళ్ అధ్యక్షుడు

హర్​సిమ్రత్ కౌర్ రాజీనామాపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు సుఖ్​బీర్. ఇలాంటి ఆర్డినెన్సులనే గతంలో అమరీందర్ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. వీటిని మేనిఫెస్టోలోనూ ప్రస్తావించిందని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లులో ముస్లింలను మినహాయించడాన్నీ తాము వ్యతిరేకించామని, అలాగే ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇవన్నీ పార్టీ సిద్ధాంతాలని పేర్కొన్నారు.

రైతుల కోసం ఎంతటి త్యాగాలకైనా అకాలీదళ్​ సిద్ధమని స్పష్టం చేశారు బాదల్. కూటమి విషయంపైనా పార్టీ కోర్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.