ETV Bharat / bharat

'బంగాలీ ఆత్మగౌరవం' దీదీని గెలిపించేనా?

author img

By

Published : Mar 23, 2021, 5:32 PM IST

Bengali pride, sub-nationalism emerge as rallying points in WB polls
'బంగాలీ ఆత్మగౌరవం' దీదీని గెలిపించేనా?

"లోకల్​ వర్సెస్ నాన్​-లోకల్".... బంగాల్​ రాజకీయం ప్రస్తుతం ఇదే అంశం చుట్టూ తిరుగుతోంది. మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొనేందుకు బంగాలీ ఆత్మగౌరవాన్ని అస్త్రంగా మలుచుకుంటోంది అధికార తృణమూల్ కాంగ్రెస్. ఇంతకీ ఈ వ్యూహం ఫలిస్తుందా? తిప్పికొట్టేందుకు భాజపా ఏం చేస్తోంది? శాసనసభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

  • దీదీ హవా కొనసాగుతుందా?
  • మోదీ మంత్రం అద్భుతం చేస్తుందా?
  • కోల్​కతా​ పీఠం ఎవరికి దక్కుతుంది?

బంగాల్​ శాసనసభ ఎన్నికలకు ముందు చర్చనీయాంశమైన ప్రశ్నలివి. అందుకు తగినట్టే ఆ రాష్ట్ర రాజకీయాలు అంతకంతకూ వేడెక్కుతున్నాయి. అధికారం నిలబెట్టుకునే లక్ష్యంతో తృణమూల్ కాంగ్రెస్ పదునైన వ్యూహాలు రచిస్తోంది. గత లోక్​సభ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు అందుకున్న భాజపా.. ఈసారి బంగాల్​లో పాగా వేయాలన్న పట్టుదలతో ఉంది.

ఇలాంటి సమయంలో బంగాలీవాదం తెరపైకి వచ్చింది. బంగాలీల ఆత్మగౌరవం, స్థానికులు​ వర్సెస్​ ఔట్​సైడర్స్​ పేరిట పెద్ద యుద్ధానికి తెరలేచింది. భాజపా హిందుత్వ వాదానికి చెక్​ పెట్టేందుకు బంగాలీ ఆత్మ గౌరవ నినాదాన్ని అధికార టీఎంసీ ఎంచుకుంది. తమది లోకల్​ అని, భాజపా ఔట్​సైడర్స్ పార్టీ అని ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బంగాల్‌లో భాజపా నిర్వహించిన ర్యాలీలో సంఘసంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ప్రతిమ అపవిత్రం కావడం, అసోంలో ఎన్‌ఆర్‌సీ విడుదలను టీఎంసీ తనకు అనుకూలంగా మార్చుకుంది. ఎన్‌ఆర్‌సీలో అసోంలోని 19 లక్షల మంది ప్రజల పేర్లు గల్లంతుకాగా, వారిలో అత్యధికులు బంగాలీయులు కావటం భాజపాను బంగాల్ వ్యతిరేక పార్టీగా ముద్రవేసేందుకు టీఎంసీకి ఉపకరించింది. టీఎంసీ ప్రచారానికి తోడు బంగ్లా పొక్కో, జతియో బంగ్లా సమ్మేళన్, బంగ్లా సంస్కృతి మంచ్ వంటి సంస్థలు భాజపా హిందీని, ఉత్తరాది సంస్కృతిని బంగాలీయులపై బలవంతంగా రుద్దాలని ఆరోపిస్తుండటం కమలదళాన్ని కలవరపరుస్తోంది.

ప్రతివ్యూహాలు..

టీఎంసీ వ్యూహాలను అడ్డుకునే క్రమంలో భాజపా ప్రతివ్యూహాలతో సిద్ధమైంది. ఆత్మగౌరవం అంటూనే టీఎంసీ అందుకు విరుద్ధమైన పనులు చేస్తోందన్న కమలనాథులు.. బంగాలీ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించేది తామేనంటూ ప్రచారం సాగిస్తున్నారు. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో అందరి అభివృద్దే తమ ధ్యేయమంటున్నారు. పలు రాష్ట్రాలలో భాజపా అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క భాషనో, సంస్కృతినో బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు. ఓట్ల కోసం టీఎంసీ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శిస్తున్నారు.

రూటు మార్చిన రాజకీయం

'లోకల్' మంత్రం బంగాల్​కు చాలా కొత్త. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 'బంగాలీ ఆత్మగౌరవం' తెరపైకి రావడానికి ప్రధాన కారణం భాజపా. 2019 లోక్​సభ ఎన్నికల్లో బంగాల్​లో ప్రభంజనం సృష్టించింది భాజపా. ఆ రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాల్లో ఏకంగా 18 సీట్లు కైవసం చేసుకుంది. టీఎంసీని 22 సీట్లకే పరిమితం చేసి, ఊహించని దెబ్బ కొట్టింది. మిగిలిన 2 స్థానాలు కాంగ్రెస్​కు దక్కాయి.

2014 సార్వత్రిక ఎన్నికల్లో బంగాల్​లో భాజపా గెలిచింది 2 సీట్లే. అలాంటి పార్టీ 2019లో అనూహ్యంగా పుంజుకున్నాక... రాష్ట్ర రాజకీయం రూపు మారింది. హిందుత్వ శక్తుల దూకుడు పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే బంగాల్​లో పెద్దగా ప్రాచుర్యం లేని శ్రీరామ నవమి వంటి పండుగలకు భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించే సంస్కృతి మొదలైంది. ఆ ర్యాలీల సందర్భంగా వేర్వేరు వర్గాల మధ్య ఘర్షణలు జరగడం.. రాజకీయ వేడిని మరింత పెంచింది.

దీదీ దూకుడు..

ఈ క్రమంలో బంగాలీ ఆత్మగౌరవాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకునేందుకు టీఎంసీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో స్వయంగా ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. "భాజపా బయటి వ్యక్తుల పార్టీ. బంగాల్​ అధికార పగ్గాల్ని గుజరాతీలకు(మోదీ, షాను ఉద్దేశించి), బయటి వ్యక్తులకు అప్పగిస్తారా?" అని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశ్నిస్తున్నారు.

"బంగాల్​లో కాషాయ దళం పుంజుకోవడం వల్ల బంగాలీల్లో భయం మొదలైంది. ఎన్​ఆర్​సీ అమలు, హిందీని బలవంతంగా రుద్దడం వంటివి ఇందుకు కారణం. మేము భాజపాలా కాదు. మేము లౌకికవాదం, సమ్మిళిత అభివృద్ధినే నమ్ముతాం" అని టీఎంసీ అధికార ప్రతినిధి సౌగతా రాయ్ చెప్పారు.

ఓటమి భయంతోనే

ఓటమి భయంతోనే టీఎంసీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్ విమర్శించారు.

భాజపాను బయటి పార్టీగా ముద్రవేయాలన్న టీఎంసీ ఎత్తుగడలను అడ్డుకునే క్రమంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీని కమలదళం తెరపైకి తెచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ వంటి దిగ్గజాల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ బంగాల్ సంస్కృతి, విలువలతో అనుబంధమున్న పార్టీగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. బంగాలీయులను ఆకట్టుకునే దిశగా ఎన్నికల ప్రణాళికలో నోబెల్ బహుమతి తరహాలో ఠాగూర్ స్మృతి పురస్కార్, ఆస్కార్ అవార్డు తరహాలో సత్యజిత్‌రే అవార్డును అందజేస్తామని హామీ ఇచ్చింది. సాంస్కృతిక పరిరక్షణ కోసం గురుదేవ్ కేంద్రం, ప్రముఖ బంగాలీనటుడు ఉత్తమ్ కుమార్ పేరుమీద ఫిల్మ్ సిటీ రూపొందిస్తామని పేర్కొంది. అయితే కేంద్ర నాయకత్వంపై భాజపా రాష్ట్ర నాయకత్వం అతిగా ఆధారపడటం, కేంద్ర నాయకుల్లోనూ ఇతర రాష్ట్రాల వారే ఎక్కువగా ఉండటం భాజపాకు ఇబ్బందికరంగా మారింది.

ఇప్పటిది కాదు..

బంగాలీవాదం ఇప్పటిది కాదని, ఎప్పటి నుంచో ఉందంటున్న రాజకీయ విశ్లేషకులు.. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు. బంగాల్ సామాజిక, రాజకీయ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్ధమవుతుందంటున్నారు.

1950ల్లో బిహార్‌, పశ్చిమ బంగాల్‌లో ప్రాంతాల విలీనం సందర్భంగా తొలిసారిగా బంగాలీవాదం తెరపైకి వచ్చింది. విలీనానికి వ్యతిరేకంగా పోరాట బాటపట్టిన వామపక్షాలు, ప్రజా సోషలిస్టు పార్టీ.. విలీనమైతే బంగాలీయులు మైనారిటీలుగా మిగులుతారని ఆరోపించాయి. ఫలితంగా అప్పట్లో జరిగిన ఎన్నికల్లో బిధాన్ చంద్ర రాయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది మున్సిపాలిటీలు, ఓ శాసనసభ ఉపఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తర్వాతి కాలంలో బంగాల్‌లో అధికారం చేపట్టిన వామపక్షాలు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బంగాల్‌పై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ ఆరోపిస్తూ రావడం, కాంగ్రెస్ వ్యతిరేక, కేంద్ర వ్యతిరేక విధానాలను అనుసరించడంతో ఈ భావన లోలోన రగులుతూ వచ్చింది.

మా, మాటీ, మనుష్​..

1998 జనవరి ఒ‍కటిన కాంగ్రెస్‌ నుంచి విడిపోయి టీఎంసీ ఏర్పాటైన అనంతరం బంగాలీవాదానికి తాత్కాలికంగా తెరపడింది. మా, మాటీ, మనుష్ నినాదంతో ప్రధానంగా ముందుకు సాగిన టీఎంసీ.. సామ్యవాదం, లౌకికవాదం సిద్ధాంతాలే ప్రధానంగా పనిచేసే వామపక్షాల నుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే బంగాల్ రాజకీయ యవనికపై భాజపా విస్తరిస్తున్న క్రమంలో... కాషాయపార్టీ హిందూత్వ అజెండాను ఎదుర్కొనేందుకు టీఎంసీ బంగాలీ ఆత్మగౌరవం, బంగాలీ స్వాభిమానాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.

బంగాలీవాద ప్రభావం కొన్ని ప్రాంతాల్లో లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఇది పట్టణ ప్రాంతాలకే పరిమితమని కొన్ని విశ్లేషణలు వినపడుతున్నాయి. హిందీ మాట్లాడేవారు అధికంగా ఉన్న 30 నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఉండదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించే తృణమూల్ కాంగ్రెస్.. ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు కుదుర్చుకుందని విశ్లేషిస్తున్నారు.

ఇవీ చూడండి: బంగాల్ దంగల్: విజయానికి 'ఆమె' ఓట్లే కీలకం!

బంగాల్​ దంగల్​: గాయాలే దీదీ విజయానికి సోపానాలు!

బంగాల్​ దంగల్​: రాజకీయ సిద్ధాంతాల్ని మరచిన నేతలు!

బంగాల్ దంగల్: అస్థిత్వ పోరాటం- మతతత్వ రాజకీయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.