ETV Bharat / bharat

Acid Attack: ఏలూరులో దారుణం.. మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్​ దాడి

author img

By

Published : Jun 14, 2023, 10:16 AM IST

Updated : Jun 14, 2023, 10:15 PM IST

Acid Attack on Woman
Acid Attack on Woman

Acid Attack on Woman: మహిళలపై వేధింపులు సర్వసాధారణమైపోయాయి. రోజుకో చోట అతివలపై దాడులు, అత్యాచారాలు, హత్యాయత్నాలు, యాసిడ్​ దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది.

Acid Attack on Woman: దేశంలో మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, ఎన్ని శిక్షలు వేసిన మనుషుల తీరు మాత్రం మారడం లేదు. రోజుకో చోట అతివలపై దాడులు, అత్యాచారాలు, హత్యాయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వారి వేధింపులు తాళలేక కొద్దిమంది స్త్రీలు పోలీసులను, చట్టాలను ఆశ్రయిస్తే.. మరికొంతమంది బయట పడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాగే మరోవైపు యాసిడ్​ దాడులు కూడా ఎక్కువవతున్నాయి. ప్రేమను నిరాకరించారని, పెళ్లికి ఒప్పుకోలేదని, ఇంకా ఏవో కారణాల వల్ల చాలా మంది యాసిడ్​ దాడి చేసి వారిని కోలుకోలేని దెబ్బ తీస్తున్నారు. తాజాగా ఒంటరిగా బైక్​పై వెళ్తున్న ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్​ దాడి చేసిన పరారైన దారుణ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది.

ఏలూరు నగరానికి చెందిన వై.ఫ్రాన్సిక (35)అనే మహిళకు రాజమహేంద్రవరానికి చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ రామాంజనేయులతో ఏడు సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికే ఐదు సంవత్సరాల పాప కూడా ఉంది. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా రెండు సంవత్సరాల క్రితం విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్రాన్సిక ఏలూరులోని విద్యానగర్​లో నివాసం ఉంటోంది. స్థానికంగా ఉండే దంత ఆస్పత్రుల్లో రిసెప్షనిస్ట్​గా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆసుపత్రిలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు యాసిడ్​తో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన మహిళను వెంటనే చికిత్స నిమిత్తం హుటాహుటిన ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని నేరుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాసిడ్ దాడి జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, దాడికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడకు తరలిస్తున్నామన్నారు.

"ఆమె డెంటల్​ ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్​గా పని చేస్తున్నారు. ఆసుపత్రిలో విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి యాసిడ్​ దాడి చేశారు. ఈ ఘటన ఆమె ఉంటున్న ఇంటికి దగ్గరలో జరిగింది. ఆమె ఇంటికి వెళ్లి తన తల్లి, చెల్లికి చెప్పి ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఆమె భర్తతో కూడా మాట్లాడుతున్నాము. అతనిపై ఎటువంటి అనుమానం లేదని బంధువులు తెలుపుతున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నాము. అతి త్వరలో ఆమెపై దాడి చేసిన వారిని అరెస్టు చేస్తాము. రెండు సంవత్సరాల క్రితం భార్యభర్తల మధ్య గొడవల కారణంగా విడిపోయినట్లు బంధువులు చెబుతున్నారు. రాజమండ్రిలో కెమికిల్​ ఇంజనీర్​గా పని చేస్తున్నారు. ఇద్దరి స్వస్థలం ఏలూరు జిల్లాలోని దెందులూరు."-అశోక్​కుమార్​, ఏలూరు రేంజ్​ డీఐజీ

మహిళ ప్రాణాలకు ముప్పు లేదు: ఏలూరులో జరిగిన యాసిడ్ దాడి ఘటనలో గాయపడిన మహిళ ప్రాణాలకు ముప్పు లేదని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్​ డా. వెంకటేశ్ తెలిపారు. అర్ధరాత్రి ఏలూరు నుంచి మహిళను ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు. మహిళ ముఖం, ఛాతి, వీపుపై యాసిడ్ పడిందన్నారు. కుడి కన్నుపై పడటంతో కన్నుకు తీవ్రగాయమైందని తెలిపారు. బాధితురాలికి అన్ని రకాల వైద్య చికిత్సలు అందించామన్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం మణిపాల్ ఆసుపత్రికి తరలించినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ఓ కంటి చూపు కోల్పోయే ప్రమాదముందన్నారు.

Last Updated :Jun 14, 2023, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.