లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉండాలే కానీ అందుకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించింది పంజాబ్ చండీగఢ్కు చెందిన 15 ఏళ్ల విద్యార్థిని కాఫీ. యాసిడ్ దాడికి గురై చూపు కోల్పోయినా.. చదువుపై మక్కువతో ముందుకు సాగింది. సెంట్రల్ సిలబస్ అయిన సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డ్ పరీక్షల్లో ఏకంగా 95.2 శాతం మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది.
"3 ఏళ్లు ఉన్నప్పుడు పక్కింటి వ్యక్తి నా కూతురిపై యాసిడ్ దాడి చేశాడు. దీంతో ఆమె చూపు కోల్పోయింది. ఎలాగైనా తనకు తెప్పించాలనే ఆశతో ట్రీట్మెంట్ కోసం సుమారు 6 ఏళ్లపాటు హైదరాబాద్ సహా అనేక చోట్ల ఉన్న ఆస్పత్రులకు తీసుకెళ్లాను. కానీ, ఫలితం లేదు. ఇక నా కూతురికి చూపు రావడం కష్టమని వైద్యులు చెప్పారు. మధ్యలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయినా కొందరి సలహాతో నా కూతురిని ఇంతవరకు చదవించగలిగాను. అందరి తల్లిదండ్రులను కోరేది ఒక్కటే.. పిల్లలను నిరుత్సాహపరచకండి. వాళ్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకారం అందించండి. నా కూతురు ఐఏఎస్ కావాలని అనుకుంటోంది. అందుకోసం నా పూర్తి సహకారం ఆమెకు ఉంటుంది."
- పవన్, కాఫీ తండ్రి.
ప్యూన్ ఉద్యోగం చేసుకుంటూ..
సచివాలయంలో ప్యూన్ ఉద్యోగం చేస్తూనే కూతురిని సీబీఎస్ఈ సిలబస్ పాఠశాలలో చేర్పించాడు పవన్. కాఫీ చదువుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాడు. తల్లి కూడా అన్ని రకాలుగా తోడుగా నిలిచింది. స్నేహితులు, ఉపాధ్యాయులు కాఫీని ఎల్లప్పుడూ ప్రోత్సాహించేవారు. తనకు చూపులేదని.. ఎలా చదవగలనని ఎన్నడూ నిరుత్సాహపడలేదు కాఫీ. ఇంతమంది ప్రోద్బలంతో కష్టపడి చదివింది. ఎంతో కష్టంగా భావించే సెంట్రల్ సిలబస్ ఎగ్జామ్స్లో ఏకంగా 95 శాతానికి పైగా మార్కులతో పాసయి పాఠశాలలో టాపర్గా నిలిచింది.
"నా కూతరు ఐఏఎస్ కావాలని అనుకుంటోంది. కచ్చితంగా తను ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందనే పూర్తి నమ్మకం నాకుంది. నేను బతికున్నంత కాలం తనకేం కావాలన్నా దగ్గరుండి అన్నీ సమకూరుస్తాను. తల్లిగా అది నా బాధ్యత. బేటీ బచావో బేటీ పడావో అని మోదీ అన్నారు. ఆయన చెప్పినట్లుగానే మా కూతురిని కాపాడుకున్నాము, చదివించుకుంటున్నాము. అందరి తల్లులను నేను కోరేది ఒక్కటే.. పిల్లలను చదివించండి. వారి లక్ష్యాలను చేరుకోవడానికి తోడ్పాటు అందించండి."
- కాఫీ తల్లి
భవిష్యత్లో ఐఏఎస్ అధికారి కావడమే తన ముందున్న లక్ష్యమని అంటోంది కాఫీ. తనకు జియాగ్రఫీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టమని.. తదుపరి తరగతుల్లో ఆర్ట్స్ స్ట్రీమ్ను ఎంచుకుంటానని తెలిపింది.
"సీబీఎస్ఈ టెన్త్ పరీక్షల్లో నాకు 95.2% మార్కులు వచ్చాయి. స్కూల్లో టాపర్గా నిలిచాను. మానసికంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి గొప్ప సహకారం అందింది. ముఖ్యంగా ఉపాధ్యాయుల నుంచి. ఏదైనా సందేహం అడిగితే వెంటనే వారు నివృతి చేసేవారు. సెలవుల్లోనూ ఆన్లైన్ క్లాస్లు పెట్టి, మా డౌట్స్ క్లారిఫై చేసేవారు. మొత్తంగా ప్రతి ఒక్కరి నుంచి మద్దతు అందింది. నేను రోజు కనీసం 5 నుంచి 6 గంటల వరకు చదువుతాను. సాధారణ విద్యార్థుల కోసం మార్కెట్లో అనేక రకాల గైడ్స్, సాంపుల్ పేపర్స్ అందుబాటులో ఉంటాయి. అయితే మా లాంటి వాళ్లకు వాటితో ఉపయోగం ఉండదు. ఇది కాస్త ఇబ్బందికరమే. కానీ, యూట్యూబ్ ద్వారా మాకు సిలబస్కు సంబంధించి దాదాపు అన్ని పాఠాలు ఆన్లైన్లో ఆడియో, వీడియో రూపంలో అందుబాటులో ఉంటాయి. ఇవి నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది నా కల. ఇందుకోసం నేను ఆర్ట్స్ స్ట్రీమ్ను ఎంచుకుంటాను."
- కాఫీ, విద్యార్థిని