ETV Bharat / bharat

26 Week Pregnancy Supreme Court : 26 వారాల అబార్షన్ కేసు.. పిండం పరిస్థితిపై మరో నివేదిక కోరిన సుప్రీం

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 2:17 PM IST

26 Week Pregnancy Supreme Court : ఓ మహిళ 26 వారాల గర్భవిచ్ఛిత్తికి ఇచ్చిన అనుమతిని రీకాల్​ చేయాలంటూ కేంద్రం వేసిన పిటిషన్​పై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పిండం సాధారణంగా ఉందో లేదో అనే విషయంపై ఎయిమ్స్​ మెడికల్ బోర్డు మరో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సందేహాలు తొలగించేందుకే ఈ నివేదిక అని స్పష్టం చేసింది.

26 Week Pregnancy Supreme Court
26 Week Pregnancy Supreme Court

26 Week Pregnancy Supreme Court : 26 వారాల పిండం గర్భవిచ్ఛిత్తికి అనుమతినివ్వాలంటూ కోరుతున్న మహిళ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిండం ఏదైనా అసాధారణ సమస్యతో బాధపడుతోందా లేదా అనే విషయంపై నివేదిక సమర్పించాలని ఎయిమ్స్​ మెడికల్ బోర్డును సుప్రీం కోర్టు ఆదేశించింది. 'ఎయిమ్స్​ ఇంతకుముందు ఇచ్చిన నివేదికలో.. పిండం సాధారణంగా ఉందని వెల్లడైంది. అయినా ఈ విషయంపై సందేహాలకు ఆస్కారం లేకుండా మరో రిపోర్టు సమర్పించాలి' అని పేర్కొంది. ఈ నివేదికను సెప్టెంబర్​ 16 లోపు ఇవ్వాలంటూ ఆరోజుకు వాయిదా వేసింది. అంతకుముందు, ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషనర్‌ అనుమతి కోరుతున్నారా? అని సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ ప్రశ్నించారు. బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్న పిండాన్ని తాము చంపలేమని అన్నారు.

ఇదీ కేసు?
Termination Of Pregnancy At 26 Weeks : ఇద్దరు పిల్లలున్న ఓ 27 ఏళ్ల వివాహిత అబార్షన్ చేయించుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ప్రసవాల తర్వాత నుంచి తాను కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని దేశ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. మానసికంగా, ఆర్థికంగా తాను మూడో బిడ్డను కని, పెంచే పరిస్థితుల్లో లేనని ఆమె న్యాయస్థానానికి వివరించారు. అయితే ఈ పిటిషన్‌పై మొదట విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. గర్భవిచ్ఛిత్తి చేసుకునేందుకు అక్టోబరు 9న ఆమెకు అనుమతినిచ్చింది. ఆ ఉత్తర్వులను రికాల్​ చేయాలని అభ్యర్థిస్తూ కేంద్రం పిటిషన్‌ దాఖలు చేసింది. పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్‌ వైద్యులు తాజాగా ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. ఈ పిటిషన్​పైనే శుక్రవారం సుప్రీం విచారణ చేపట్టింది.

Woman Decision To Terminate Pregnancy : అయితే 26 వారాల గర్భ విచ్ఛిత్తి కేసులో బుధవారం (అక్టోబర్ 11) ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ భిన్నమైన తీర్పునిచ్చింది. ద్విసభ్య ధర్మాసనంలో ఒకరు అబార్షన్​కు విముఖత తెలపగా మరొకరు సమర్థించారు. ఇప్పటికే ఇద్దరు పిల్లలున్న మహిళ మానసిక కుంగుబాటుతో బాధపడుతోందని, ఆర్థికంగానూ మూడో బిడ్డను పెంచే స్థితిలో లేదని ఆమె తరఫు న్యాయవాదులు పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పునిచ్చింది. అయితే పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్‌ వైద్యులు తాజాగా ఇచ్చిన నివేదికతో ఈ తీర్పును రీకాల్ చేయాలంటూ కేంద్రం విజ్ఞప్తి చేసింది.

దీంతో ఈ పిటిషన్‌ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది. ఈ క్రమంలోనే అబార్షన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. "తల్లి హక్కుతో పాటు గర్భస్థ శిశువు హక్కుల మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ పిండం సజీవంగా ఉంది. బతికే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఆ పిండం గుండె చప్పుడును ఆపమని మేమే ఎయిమ్స్‌ వైద్యులతో చెప్పాలని మీరు కోరుకుంటున్నారా? ఆ బిడ్డను మేం చంపలేం" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. "ఈ పిండాన్ని మోస్తూ 26 వారాలుగా ఎదురుచూశారు. ఇంకొన్ని వారాలు మోయలేరా? అప్పుడైతే ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉంటుంది" అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మరికొన్ని వారాలు బిడ్డను మోసే బాధ్యత గురించి ఆ మహిళతో మాట్లాడాలని కేంద్రం, పిటిషనర్‌ తరఫు న్యాయవాదులకు సూచించింది.

Supreme Court On Pregnancy Termination : 'పిండం గుండె చప్పుడు ఆపాలని ఏ కోర్టు చెబుతుంది?'.. గర్భ విచ్ఛిత్తి కేసులో భిన్నమైన తీర్పులు

Prathidwani: అవాంఛిత గర్భం తొలగింపుపై చట్టం ఏం చెబుతోంది ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.