జగన్ నవరత్నాల పేరుతో నవ మోసాలు చేశాడు: యనమల రామకృష్ణుడు
Yanamala Ramakrishnudu comments on Jagan: జగన్ ప్రభుత్వం బీసీలను అన్ని రంగాల్లో అణగదొక్కిందని తెలుగుదేశం సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, కళా వెంకటరావు విమర్శించారు. బీసీలను నాయకులను చేసింది తెలుగుదేశం పార్టీనే అని గుర్తుచేశారు. పార్వతీపురంలో నిర్వహించిన బీసీ ఐక్యపోరాట సదస్సులో తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో ఇరుపార్టీల సమన్వయంతో అధికారంలోకి రావడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. జనసేనతో కలిసి పనిచేయాలని టీడీపీ కార్యకర్తలకు యనమల సూచించారు. జగన్ను ఎదురించడానికి అంతా కలిసి పనిచేయాలని పేర్కొన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సహజ వనరులను దోచేస్తూ.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని మండిపడ్డారు. జగన్ నవరత్నాలు అంటూ... నవమోసాలు చేశాడని విమర్శించారు. ప్రజాధనంతో జగన్ ప్రచారాలు చేసుకుంటున్నాడని యనమల ఆరోపించారు. జగన్ ఇప్పటికీ ఏం అభివృద్ది చేశాడో చెప్పుకోలేకపోతున్నాడని యనమల పేర్కొన్నారు. ప్రజల్లో జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూస్తే.. రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఎలా ఉందో తెలుస్తుందని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.