NTR Trust Free Medical Services: 'సేవా కార్యక్రమాలే లక్ష్యం..' కుప్పంలో సంచార వైద్య వాహనాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2023, 7:25 PM IST
NTR Trust Free Medical Services in Kuppam : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం ప్రారంభించారు. ఉచిత వైద్య సేవ కేంద్రంతోపాటు సంచార వైద్య వాహనాన్ని ప్రారంభించారు. కుప్పం మండలంలోని పీబినత్వం వద్ద ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంలో పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందించాలని సంకల్పంతో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వైద్య కేంద్రం సంచార వైద్య వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 'మెడికల్ సర్వీస్ కోసం సంజీవని సంచారవైద్య వాహనాన్ని తీసుకువచ్చాం. ఇదే కాకుండా విద్యా పరంగా మహిళలకు కళాశాలను కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం. సేవా కార్యక్రమాలే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలివి. నందమూరి తారక రామారావు మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా.. విద్య, వైద్య, ఆరోగ్య పరమైన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం' అని భువనేశ్వరి తెలిపారు.