ETV Bharat / state

మాజీ మంత్రి నారాయణను ఇంటి వద్దే విచారించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం

author img

By

Published : Mar 3, 2023, 10:49 PM IST

Etv Bharat
Etv Bharat

Former Minister Narayana : మాజీ మంత్రి నారాయణకు మరోసారి హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ విచారణను ఆయన ఇంటి వద్దే నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అమరావతి ఇన్నర్​ రింగ్​ రోడ్డు ఎలైన్‌మెంట్‌ అవకతవకల కేసుకు సంబంధించిన పిటిషన్​ తీర్పులో హైకోర్టు ఈ మేరకు ఆదేశాలనిచ్చింది.

Former Minister Narayana : మాజీ మంత్రి నారాయణను ఆయన సతీమణిని ఇంటి వద్దే విచారించాలని హైకోర్టు సీఐడిని ఆదేశించింది. సీఐడి అందించిన నోటీసులపై నారాయణ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ నారాయణ తరపున వాదనలు వినిపించారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను పరిణగలోకి తీసుకుని మహిళలను ఇంటీ వద్ద విచారించాలన్న విషయాన్ని దమ్మాలపాటి హైకోర్టు ముందుంచారు. గతంలో కూడా ఓ సారి నారాయణను ఇంటి వద్ద విచారించాలని .. కోర్టు ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వాదనలు పరిగణలోకి తీసుకున్న హై కోర్టు నారాయణను ఆయన సతీమణి రమాదేవితో పాటు ఉద్యోగి ప్రమీలను ఇంటి వద్దనే విచారించాలని తీర్పు వెలువరించింది.

రాజధాని మాస్టర్​ ప్లానింగ్​ రూపకల్పనలో, అమరావతి ఇన్నర్​ రింగ్​ రోడ్డు ఎలైన్‌మెంట్‌ అవకతవకలకు పాల్పడ్డారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మాజీ మంత్రి నారాయణకు ఆయన సతీమణి రమాదేవికి సీఐడీ నోటిసులు జారీచేసింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ ప్రకారం ఇచ్చిన నోటీసులు.. ఎన్‌ఎస్‌పీఐఆర్‌ఏ ఉద్యోగి ప్రమీలకు సైతం నోటీసులు అందాయి. రామకృష్ణా హౌసింగ్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ అంజీనీకుమార్​ అలియాస్​ బాబీకీ సైతం నోటిసులిచ్చినా సీఐడీ.. ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. నారాయణ కుమార్తెలిద్దరికే కాకుండా వారి భర్తలకు సైతం సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం.. నోటీసులు అందించి సాక్షులుగా విచారణకు హాజరు కావాలని తెలిపింది.

గతంలో ఇంటి వద్దనే విచారణ : గతంలో నారాయణను సాక్షిగా విచారణకు రావాలని సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం సీఐడీ అధికారులు నోటీసులు అందించారు. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్​ దాఖాలు చేశారు. ఆ సమయంలో అనారోగ్యంతో ఉన్నానని.. వయస్సు 65 ఏళ్లు దాటిందని కోర్టుకు విన్నవించారు. స్పందించిన హైకోర్టు నారాయణను ఆయన నివాసంలోనే.. న్యాయవాది సమక్షంలో విచారించాలని స్పష్టం చేసింది. ఆయన నివాసంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు.

నారాయణపై రాష్ట్రప్రభుత్వం పలు కేసులు నమోదు : గత ప్రభుత్వ హయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణపై పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ కేసు, ఇప్పుడు నడుస్తున్న రాజధాని మాస్టర్​ ప్లానింగ్​ రూపకల్పన, ఇన్నర్​ రింగ్​ రోడ్డు ఎలైన్‌మెంట్‌ అవకతవకల కేసు, రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్​ భూముల అక్రమ కొనుగోలు అంటూ పలు కేసులు నమోదు చేసింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.