ETV Bharat / state

అంతా నా ఇష్టం..! అటు వాహనదారులను, ఇటు అన్నదాతలను బెంబెలెత్తిస్తున్న గజరాజులు!

author img

By

Published : Mar 3, 2023, 4:04 PM IST

Etv Bharat
Etv Bharat

A herd of elephants halchal : చిత్తూరు జిల్లా పలమనేరు గుడియాత్తం రహదారిలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. సుమారు గంటల కొద్దీ రోడ్డుపై వాటి హడావుడి కొనసాగింది. అర్ధరాత్రి పలు గ్రామాల పరిధిలో పంటపొలాలను ధ్వంసం చేశాయి. రోడ్డుపైకి రావడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు.

A herd of elephants halchal : చిత్తూరు జిల్లా పలమనేరు గుడియాత్తం రహదారిలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. సుమారు గంటల కొద్దీ రోడ్డుపై వాటి హడావుడి కొనసాగింది. ఏనుగుల గుంపు గత నాలుగు రోజులుగా పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ పరిధిలో సంచరించాయి. పలు గ్రామాల పరిధిలో పంటపొలాలను ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో ఏనుగుల గుంపు శుక్రవారం ఉదయం గుడియాత్తం రోడ్డుపై ప్రవేశించాయి. వాహనదారులు భయాందోళనలతో కాసేపు రోడ్డుపై వాహనాలు నిలిపి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం రోడ్డుపై ఉన్న ఏనుగుల్ని అటవీశాఖ అధికారులు చాకచక్యంగా అటవీ ప్రాంతం వైపు మళ్లించారు.

అర్ధరాత్రి పంటల ధ్వంసం.. పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ పాలమాకులపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు స్వైర విహారం చేసింది. సుమారు 15 ఏనుగులు 5 ఎకరాల మేర ఆస్తిని నష్టం చేసినట్లు బాధిత రైతులు తెలిపారు. ఐదుగురు రైతులకు చెందిన వ్యవసాయ పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు.. టమోటా, బీన్స్, కోస, వరి కసువు, కొబ్బరి, అరటి చెట్లు ధ్వంసం చేశాయి. చుట్టుపక్కల స్థానికంగా అటవీ ప్రాంతం కావడంతో రోజూ సాయంత్రం ఏనుగుల గుంపు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలు, కొబ్బరి, అరటి చెట్లను ధ్వంసం చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం మండిపడ్డారు. ఏనుగుల గుంపు గ్రామం వైపు కూడా దూసుకు రావడంతో ఇళ్ల మీద దాడి చేస్తున్నాయని పలువురు భయాందోళన వ్యక్తం చేశారు. ఏనుగుల గుంపుల వల్ల ఆవులు, గొర్రెలు మేపే పరిస్థితి కూడా లేదని గ్రామస్తులు వాపోయారు. వారం రోజులుగా గుంపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వైర విహారం చేస్తున్నాయని తెలిపారు. సాయంత్రం సమయంలో రైతులు బయటికి రావాలంటే భయపడుతున్నారని చెప్పారు.

మూడు రాష్ట్రాల సరిహద్దు.. కర్ణాటక, తమిళనాడు అటవీ ప్రాంతాల సరిహద్దు... పలమనేరు కౌండిన్య అభయ అరణ్యాలు ఏనుగులకి ఆవాసానికి అనుకూలంగా మారాయి. దీంతో ఏనుగులు పక్క రాష్ట్రానికి వెళ్లకుండా ఈ ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. ఎండాకాలంలో అటవీ ప్రాంతంలో ఆహారం దొరకక అవి గ్రామాల వైపు మళ్లుతున్నాయి. గతంలో వాటిని కట్టడి చేసేందురు అధికారులు చైన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయగా.. తెంపుకొని గ్రామం వైపు వస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు రాత్రి వేళల్లో కాపలా ఉన్నప్పటికీ లాభం లేకపోయిందని రైతులు చెబుతున్నారు. ఏనుగుల్ని కట్టడి చేయాలని, పంట నష్టానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

సోలార్ ఫెన్సింగ్ వేయాలని... గంటల కొద్దీ రోడ్డుపై హల్ చల్ చేసిన ఏనుగుల గుంపు అడవిలోకి వెళ్లడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగులు తరచూ రోడ్డుపైకి రాకుండా ఇరువైపులా సోలార్ ఫెన్సింగ్ వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. నిత్యం ఏదో ఒక కారణ రీత్యా ఈ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఏనుగులు ఎక్కడ దాడి చేస్తాయో అన్న భయంతో తిరగలేకపోతున్నామని వాపోయారు. ఇప్పటికే అడవికి ఆనుకుని ఉన్న వ్యవసాయ పొలాలను ఏనుగుల గుంపు పూర్తిగా ధ్వంసం చేశాయి. తీవ్ర పంట నష్టంతో రైతులు విలవిల్లాడుతున్నారు. అటవీశాఖ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడి ఏనుగులు రాకుండా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదు. ప్రభుత్వాలు నిధులు కేటాయించి అడవి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేయించినట్లయితే ఏనుగులను రోడ్లపైకి, పంటపొలాల్లోకి రాకుండా కట్టడి చేయొచ్చని స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.