ETV Bharat / city

NTR TRUST MEDICAL AIDE: కరోనా బాధితులకు సేవలు విస్తృతం చేసిన ఎన్టీఆర్ ట్రస్టు.. మందుల పంపిణీ

author img

By

Published : Jan 27, 2022, 3:42 PM IST

NTR TRUST MEDICAL AIDE
NTR TRUST MEDICAL AIDE

NTR TRUST MEDICAL AIDE: కరోనా సోకిన తెలుగువారిని ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్టు తన వంతు సేవల్ని విస్తృతం చేసింది. వారం రోజుల్లో దాదాపు 8వేల మందికి ఉచితంగా వైద్య సాయం అందించింది. 12 మంది దేశ విదేశీ వైద్యులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయటంతో పాటు ట్రస్టు నుంచి ఉచితంగా మందులు పంపిణీ చేస్తోంది. మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్ని సేవలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

NTR TRUST MEDICAL AIDE: కరోనా మూడో దశతో మళ్లీ పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నందున.. వారిని ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం చేసింది. జూమ్ యాప్ ద్వారా వీడియో లింకులు షేర్ చేసి వేల మంది కొవిడ్ బాధితులకు టెలీమెడిసిన్ ద్వారా సాయం అందిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్, తెలుగుదేశం పార్టీ సమన్వయంతో ఈ టెలీ మెడిసిన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాయి. నలుగురు అమెరికన్లు సహా 12 మంది వైద్యులు.. వైద్య సాయం అందివ్వడంతో.. మందులు కూడా ఇంటికి పంపుతున్నారు. జూమ్ లింకులతో బాధితులు వీడియో కాల్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా వైద్య సాయం పొందుతున్నారు. ఒక యాప్ ద్వారా.. ఇన్ని వేల మందికి వైద్యసాయం అందించడం దేశంలోనే ప్రథమమని ఎన్టీఆర్ ట్రస్టు చెబుతోంది.

కరోనా రెండో దశలో ఆక్సిజన్ అవసరాలు ఏ స్థాయిలో ఉన్నాయో గమనించిన ఎన్టీఆర్ ట్రస్ట్ యాజమాన్యం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వయంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. కుప్పంలో ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ఇటీవలే ప్రారంభించారు. శ్రీ‌కాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను త్వరలో ప్రారంభిస్తారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరులోనూ ఆక్సిజ‌న్ ప్లాంట్లు సిద్ధం చేస్తున్నారు. గ‌తేడాది ఎన్టీఆర్ ట్రస్ట్ దాదాపు కోటి 75 ల‌క్షల రూపాయల విలువైన మందులు, ఆహారం, వైద్య పరికరాలు అందించింది.

కరోనా బాధితులకు సేవలు విస్తృతం చేసిన ఎన్టీఆర్ ట్రస్టు.. మందుల పంపిణీ

ప్రకృతి విప‌త్తుల సమయంలోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలందిస్తోంది. నవంబర్‌లో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన 48 కుటుంబాలకు ట్రస్ట్ తరపున నారా భువనేశ్వరి లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించారు. వరదల్లో ఆరుగురిని కాపాడిన కడప జిల్లా పులపత్తూరు యువకుడికి కూడా లక్ష ఆర్థిక సాయం అందించారు. ట్రస్ట్ రోజువారీ సేవలను సీఈవో రాజేంద్ర కుమార్‌తో కలిసి నారా భువనేశ్వరి పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ.. ట్రస్ట్ వైద్య సేవలు గ్రామస్థాయికి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇదీ చదవండి: TDP LEADERS MEET GOVERNOR: 'కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తొలగించండి'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.