ETV Bharat / business

వేతన జీవులకు ఊరట, ఇళ్లు లేని పేదలకు వరాలు.. అభివృద్ధి భారతావని కోసం ఆశల బడ్జెట్!

author img

By

Published : Feb 1, 2023, 5:44 PM IST

Updated : Feb 1, 2023, 6:01 PM IST

నవీన భారత నిర్మాణానికి సప్త సూత్ర ప్రణాళికలను బడ్జెట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.45లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. వేతన జీవుల కోసం పన్ను శ్లాబుల్లో మార్పులు చేయడం సహా.. గృహనిర్మాణానికి 66 శాతం మేర కేటాయింపులు పెంచింది. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.20లక్షల కోట్లకు చేర్చింది. మూలధన వ్యయానికి రికార్డు స్థాయిలో రూ.10 లక్షల కోట్లు కేటాయించారు. అయితే, అప్పుల ద్వారా రూ.17లక్షల 86 వేల కోట్లు సేకరించాలని నిర్ణయించారు.

union-budget-2023
union-budget-2023

యావద్దేశ కలలను సాకారం చేయడమే లక్ష్యంగా, స్వతంత్ర భారతం వందో పడిలోకి అడుగు పెట్టేలోపు అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడమే ధ్యేయంగా పేర్కొంటూ 'అమృత కాలంలో తొలి బడ్జెట్'​ను ప్రవేశపెట్టింది మోదీ సర్కారు. అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రాధాన్యమని పేర్కొంటూ.. వచ్చే 25 ఏళ్లకు అభివృద్ధి అజెండాను ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి బడ్జెట్ అయినందున.. సామాన్యుడి అంచనాలను అందుకుంటూనే.. ద్రవ్యలోటు అదుపుతప్పకుండా పగడ్బందీగా బడ్జెట్​కు రూపకల్పన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం రూ.45లక్షల కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్​ను.. పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. రెవెన్యూ రాబడులు కింద రూ.26.32 లక్షల కోట్లు ప్రతిపాదించారు నిర్మల. మూలధన రాబడులు రూ.18లక్షల 70వేల 816 కోట్లుగా పేర్కొన్న మంత్రి.. ఇందులో రుణాలు, ఇతర అప్పుల రూపంలో ఏకంగా రూ.17లక్షల 86వేల 816 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేయడం సహా ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు నిధులు భారీగా పెంచారు.

union-budget-2023
బడ్జెట్ స్వరూపం

ప్రపంచవ్యాప్తంగా మాంద్యం పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్శరం 7శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. 2014 నుంచి ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అయ్యి రూ.1.97లక్షలకు చేరిందన్నారు. సవాళ్లు ఎన్ని ఉన్నప్పటికీ.. భారత ఎకానమీ మాత్రం సరైన ట్రాక్​లోనే ఉందని స్పష్టం చేశారు. తాజా బడ్జెట్ విషయంలో సప్త సూత్రాల మంత్రాన్ని పఠించారు నిర్మల. అమృత కాలంలో ఆర్థిక సాధికారత సాధించేందుకు ఏడు అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.

అవేంటంటే?

  • సమ్మిళిత వృద్ధి
  • చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు
  • మౌలిక వసతులు- పెట్టుబడులు
  • హరిత అభివృద్ధి
  • సామర్థ్యాల వెలికితీత
  • యువ శక్తి
  • ఆర్థిక రంగం

మౌలిక వసతులకు రూ.10లక్షల కోట్లు..
దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. వరుసగా మూడో ఏడాది భారీగా నిధులను కేటాయించింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.10 లక్షల కోట్లను వెచ్చించనున్నట్లు కేంద్ర విత్త మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఇది జీడీపీలో 3.3 శాతమని చెప్పారు. 2020లో చేసిన కేటాయింపులతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికమని వివరించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులనూ భారీగా పెంచారు. గతంలో కంటే 66 శాతం నిధులను పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తాజా బడ్జెట్​లో రూ.79వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

union-budget-2023
ఆవాస్ యోజన

ఇదీ చదవండి: సొంత ఇల్లు లేనివారికి కేంద్రం శుభవార్త.. బడ్జెట్​లో భారీగా నిధులు

రైల్వేలకు ఇలా..
రైల్వే బడ్జెట్​కు అత్యధిక కేటాయింపులు చేసినట్లు నిర్మల వివరించారు. రూ.2.40 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. 2013-14 తర్వాత అత్యధిక కేటాయింపులు ఇవేనని చెప్పారు. రైళ్లలో ప్రజల ప్రయాణాలు మరింతగా పెరుగుతాయన్న అంచనాలతో మరో 1000 కోచ్​లను పునరుద్ధరించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వీటిని రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌సఫర్, తేజస్ వంటి ప్రీమియర్ రైళ్లలో ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఈ కోచ్​లను ఆధునాతన రూపంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా తయారు చేయనున్నట్లు తెలిపారు. రైళ్ల వేగాన్ని పెంచాలని, వందేభారత్​ రైళ్లను మరిన్ని మార్గాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నందున.. అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకోనున్నట్లు నిర్మల స్పష్టం చేశారు. పాత రైల్వే ట్రాకులను మార్చేందుకు ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు.

ఇదీ చదవండి: వెయ్యి కొత్త కోచ్​లు.. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్​.. రైల్వే శాఖకు బడ్జెట్ బూస్ట్

విద్యా రంగం
విద్యారంగానికి 2023-24 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి రూ.లక్షా 12 వేల 899 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం రూ.లక్షా 4 వేల 278 కోట్లు కేటాయించినా తర్వాత 99 వేల 881 కోట్లకు సవరించారు. విద్యాబోధనలో నూతన విధానాలు సహా.. పరిశ్రమల అవసరాలకు తగినట్లు యువతను తీర్చిదిద్దేందుకు నూతన కోర్సులు, నైపుణ్యాల పెంపునకు కృషిచేయనున్నట్లు స్పష్టంచేశారు.

union-budget-2023
విద్యారంగం

వైద్య రంగానికి..
వైద్య రంగానికి కూడా ఈసారి బడ్జెట్‌లో మరింత ప్రాధాన్యం ఇచ్చారు. 88 వేల 956 కోట్ల రూపాయలు కేటాయించారు. గతేడాది 86 వేల 606 కోట్ల రూపాయల కేటాయింపులు ప్రతిపాదించి తర్వాత 77 వేల 351 కోట్లకు సవరించారు.

union-budget-2023
వైద్య రంగం కేటాయింపులు

వేతన జీవులకు ఊరట!!
పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తూ బడ్జెట్​లో కీలక ప్రకటన చేశారు నిర్మల. లక్షలాది మందికి ప్రయోజనం కలిగేలా వ్యక్తిగత పన్ను రిబేట్ పరిమితిని రూ.7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు మినహాయింపులు ఉపయోగించుకొని పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శ్లాబుల సంఖ్యను 5కు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో మినహాయింపుల కారణంగా ఏటా ప్రభుత్వానికి రూ.35 వేల కోట్ల ఆదాయం తగ్గనుందని నిర్మల వెల్లడించారు. కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి డిఫాల్ట్​గా అమలుకానుందని.. అయితే ఈ విధానాన్ని ఎంచుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు.

union-budget-2023
కొత్త పన్ను విధానం
union-budget-2023
కొత్త శ్లాబులు

వ్యవసాయం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల లక్ష్యాన్ని 11 శాతం పెంచి రూ.20 లక్షల కోట్లకు చేర్చుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. భారత్‌ను చిరుధాన్యాల (శ్రీఅన్న) కేంద్రంగా మారుస్తామని తెలిపారు. వ్యవసాయం కోసం ప్రత్యేకంగా డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వీటిని అభివృద్ధి చేస్తామన్నారు. పంట ప్రణాళిక, దిగుబడి అంచనా, మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌, అగ్రిటెక్‌ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని రైతులకు అందించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని పెంచడం కోసం పీఎం-ప్రణామ్‌ పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రతిపాదించారు. వ్యవసాయ రంగంలోని అంకుర సంస్థల కోసం ప్రత్యేక నిధిని ప్రకటించారు.

  • వ్యవసాయ రుణ వితరణ లక్ష్యం రూ.20 లక్షల కోట్లకు పెంపు
  • పశుపోషణ, మత్స్య సాగు, పాడి పరిశ్రమ రుణాలకు ప్రాధాన్యం
  • 7 శాతం వడ్డీరేటుకే స్వల్పకాల పంట రుణాలు
  • చిన్న, సన్నకారు రైతుల కోసం తనఖాలేని రుణ పరిమితి రూ.1 లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంపు
  • హైదరాబాద్‌లో ఉన్న 'ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌'ను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా మార్చడం
  • ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు 'పీఎం- ప్రణామ్‌' పథకం
  • పీఎం-ప్రణామ్​లో భాగంగా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
  • ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం కోటి మంది రైతులకు సహకారం. 10 వేల బయో-ఇన్‌పుట్‌ రీసోర్స్‌ సెంటర్లను ఏర్పాటు
  • అగ్రికల్చర్‌ యాక్సిలరేటర్‌ ఫండ్‌ ద్వారా వ్యవసాయ అంకుర సంస్థల ప్రోత్సాహానికి ప్రత్యేక నిధి
  • ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం కోసం 'ఆత్మనిర్భర్‌ హార్టికల్చర్‌ క్లీన్‌ ప్లాంట్‌' పథకం
  • రూ.6,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంతో 'ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన' అనే కొత్త పథకానికి శ్రీకారం

రక్షణ బడ్జెట్ ఇలా..
సరిహద్దులో ద్వంద్వ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రక్షణ బడ్జెట్​ను పెంచింది కేంద్రం. గతేడాది 5.25లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించిన కేంద్రం.. తాజాగా రూ.5.94 లక్షల కోట్లను రక్షణ రంగానికి కేటాయించింది. కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధనౌకలు, ఇతర మిలిటరీ హార్డ్​వేర్ కొనుగోళ్ల కోసం రూ.1.62 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. వేతనాలు, నిర్వహణ వ్యయం కోసం రూ.2.70 లక్షల కోట్లను కేటాయించింది.

మహిళలకు ప్రత్యేకం..
మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ అనే కొత్త పథకాన్ని బడ్జెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టింది. డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ వచ్చే ఈ పథకం రెండేళ్ల కాలానికి అందుబాటులో ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేయొచ్చు.

మిషన్ కర్ణాటక
దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకకు మాత్రం భారీగా నిధులు కేటాయించారు నిర్మల. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆ రాష్ట్రానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు. ఆ రాష్ట్రంలో కరవు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆర్థిక సహకారం అందించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. 29.4 టీఎంసీల సామర్థ్యంతో 2.25 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు ఆ రాష్ట్రం చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కరవు ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఈ ప్రాజెక్ట్‌ అత్యంత కీలకమని కర్ణాటక చెబుతోంది.

రూపాయి రాక, పోక
ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో.. 58 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా రానున్నాయి. 34 పైసలు అప్పులు, ఇతర రుణాల ద్వారా సమీకరించనున్నారు. 6పైసలు పెట్టుబడుల ఉపసంహరణ వంటి పన్నేతర ఆదాయం నుంచి సేకరించనున్నారు. మొత్తం వ్యయంలో వడ్డీ చెల్లింపుకే ప్రభుత్వం అధికంగా వెచ్చించనుంది. ప్రతి రూపాయి వ్యయంలో 20 పైసలు వడ్డీ చెల్లింపులే ఉండనున్నాయి. పన్నుల్లో రాష్ట్రాల వాటాగా 18పైసలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 17 పైసలు చెల్లించనుంది.

union-budget-2023
రూపాయి రాక, పోక ఇలా..

ధరలు పెరిగేవి.. తగ్గేవి..
బంగారం, వెండి ధరలపై కస్టమ్‌ సుంకాన్ని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నాయి. బంగారు కడ్డీలతో తయారు చేసే ఆభరణాలపై కూడా కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు సీతారామన్​ తెలిపారు. దిగుమతి చేసుకునే బంగారం ధరలు మాత్రం తగ్గనున్నట్లు ఆమె వెల్లడించారు. దేశీయ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ల్యాబ్‌లో వజ్రాలు తయారు చేసేందుకు ఉపయోగించే సీడ్స్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు నిర్మలా ప్రకటించారు. సహజ వజ్రాలను కత్తిరించడం, పాలిష్ చేయడంలో భారత్‌ ప్రపంచ అగ్రగామిగా ఉందని నిర్మలా తెలిపారు.

union-budget-2023
ధరలు పెరిగే వస్తువులు
union-budget-2023
ధరలు తగ్గేవి

ఇదీ చదవండి: మొబైల్స్​, టీవీలు చౌక.. బంగారు ఆభరణాలు, సిగరెట్లు ప్రియం.. ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే..

అతిచిన్న ప్రసంగం ఇదే..
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఐదోసారి. తద్వారా ఎక్కువసార్లు బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత సాధించారు. నిర్మలా సీతారామన్‌ ఇప్పటి వరకు చేసిన బడ్జెట్‌ ప్రసంగాల్లో ఈసారే అతి తక్కువ సమయం కొనసాగింది. ఈసారి ఆమె దేశ పద్దును 86 నిమిషాల్లో (1 గంట 26 నిమిషాలు) పార్లమెంటు వేదికగా ప్రజల ముందుంచారు. అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 2020-21 బడ్జెట్‌ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు ప్రసంగించారామె. బడ్జెట్‌ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. 2019-20 బడ్జెట్‌లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివిపరంగా రెండో అతిపెద్దది.

ఇదీ చదవండి:

Last Updated :Feb 1, 2023, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.