ETV Bharat / business

మౌలికానికి రూ.10లక్షల కోట్లు.. పేదల ఇళ్ల కోసం బడ్జెట్​లో భారీగా నిధులు

author img

By

Published : Feb 1, 2023, 12:03 PM IST

Updated : Feb 1, 2023, 6:20 PM IST

Etv Bharat
Etv Bharat

పేదల సొంతింటి కల నెరవేరేలా.. బడ్జెట్​లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులను భారీగా పెంచింది కేంద్రం. రూ.79వేల కోట్లు ఇందుకోసం కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. రూ.10లక్షల కోట్లను ఇందుకోసం ప్రకటించారు.

Union Budget 2023 : ఇళ్లు లేని వారికి కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పింది. కేంద్ర బడ్జెట్​లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను భారీగా పెంచింది. గతంలో కంటే 66 శాతం నిధులను పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తాజా బడ్జెట్​లో రూ.79వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

మౌలికానికి రూ.10 లక్షల కోట్లు
మౌలిక వసతుల కల్పనకు 2023-24 బడ్జెట్‌లో కేంద్రం పెద్దపీట వేసింది. వరుసగా మూడో ఏడాది భారీగా నిధులను కేటాయించింది. ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఊతమిచ్చే మౌలిక వసతుల రంగ అభివృద్ధికి కేంద్రం రూ.10 లక్షల కోట్లు కేటాయించింది. ఇది జీడీపీలో 3.3 శాతమని కేంద్ర విత్త మంత్రి సీతారామన్ ప్రకటించారు. 2020లో చేసిన కేటాయింపులతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికమని వివరించారు.

దీంతో పాటు పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద రూ.ఏటా 10 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన నిర్మల.. ఇందుకోసం ప్రత్యేకంగా అర్బన్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ ఫండ్​ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి తరహాలోనే దీన్ని జాతీయ హౌసింగ్ బ్యాంక్ నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు 50 అదనపు ఎయిర్​పోర్టులు, హెలిప్యాడ్లు, వాటర్ ఏరో డ్రోన్లు, అడ్వాన్స్​డ్ ల్యాండింగ్ గ్రౌండ్లను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలను పాటించే రాష్ట్రాలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, వడ్డీ రహిత రుణ సదుపాయాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.

రైల్వేలకు ఇలా..
రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. 2013-14 తర్వాత రైల్వేలకు ఇవే అత్యధిక కేటాయింపులు అని సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ రైళ్ల కోసం వేగానికి అనుగుణంగా ట్రాకుల సామర్థ్యాన్ని పెంచేందుకు బడ్జెట్‌లో రూ.17,296 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాజధాని, శతాబ్ది, హంసఫర్‌, తేజస్‌ వంటి ప్రీమియం రైళ్లలో సౌకర్యాల మెరుగుదలకు ఈసారి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ప్రయాణికుల సౌఖ్యం కోసం దాదాపు వెయ్యికి పైగా కోచ్‌లను ఆధునికీకరించనున్నారు. మెట్రో స్టేషన్లతో రైల్వేస్టేషన్ల అనుసంధానం, ప్రయాణికుకు సౌకర్యల కల్పన కోసం రూ.500 కోట్లు కేటాయించారు. కొత్తగా 50 విమానాశ్రయాలనూ ప్రతిపాదించారు.

ఏడు అంశాలకు ప్రాధాన్యం..
తాజా బడ్జెట్ విషయంలో సప్త సూత్రాల మంత్రాన్ని పఠించింది కేంద్రం. అమృత కాలంలో ఆర్థిక సాధికారత సాధించేందుకు ఏడు అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపింది. సమ్మిళిత వృద్ధి, చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు, మౌలిక వసతులు- పెట్టుబడులు, హరిత అభివృద్ధి, సామర్థ్యాల వెలికితీత, యువ శక్తి, ఆర్థిక రంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు స్పష్టం చేసింది. అందించడం సహా వ్యవసాయం కోసం డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపర్చనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జాతీయ మౌలిక సదుపాయాల పైప్​లైన్ కింద రూ.141.4లక్షల కోట్లతో చేపట్టిన 89,151 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.

Last Updated :Feb 1, 2023, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.