ETV Bharat / business

టాటా ఏస్‌ ఈవీ.. ఒక్కసారి ఛార్జింగ్​తో 154 కిలోమీటర్లు

author img

By

Published : May 5, 2022, 5:39 PM IST

Tata ace electric mini truck: ఏస్​ మినీ ట్రక్​ ఎలక్ట్రిక్​ వెర్షన్​ను విడుదల చేసింది టాటా మోటార్స్​. ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోగా.. వాటి నుంచి ఇప్పటికే 39వేల యూనిట్లకు ఆర్డర్లు కూడా పొందింది. వచ్చే త్రైమాసికం నుంచి డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. ఒక్కసారి ఛార్జింగ్​ చేస్తే 154 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని పేర్కొంది. మరోవైపు.. భారత మార్కెట్లోకి తీసుకొస్తున్న ఏ8 ఎల్​ సెడాన్​ వాహనం బుకింగ్స్​ ప్రారంభించింది ఆడీ.

Tata ace electric mini truck
టాటా ఏస్‌ ఈవీ

Tata ace electric mini truck: దేశీయ ఆటో మొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ తన ఎలక్ట్రిక్‌ వాహన శ్రేణిని విస్తరించుకుంటూ పోతోంది. తాజాగా బాగా ప్రాచుర్యం పొందిన ఏస్‌ మినీ ట్రక్‌.. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. టాటా ఏస్‌ మినీ ట్రక్‌ను లాంచ్‌ చేసిన 17 ఏళ్ల తర్వాత ఏస్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను లాంచ్‌ చేసింది. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌, బిగ్‌ బాస్కెట్‌, సిటీ లింక్‌, డాట్‌, ఫ్లిప్‌కార్ట్‌, లెట్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌, వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్‌.. ఆయా సంస్థల నుంచి 39 వేల యూనిట్లకు ఆర్డర్లు కూడా పొందింది. ప్రస్తుతానికి దీని ధరను కంపెనీ వెల్లడించలేదు. వచ్చే త్రైమాసికం నుంచి వీటి డెలివరీలు ప్రారంభమైనప్పుడు ధరను వెల్లడించనున్నారు.

Tata ace electric mini truck
టాటా ఏస్‌ ఈవీని విడుదల చేస్తున్న టాటా మోటార్స్​ ప్రతినిధులు

కొత్త ఏస్‌ ఈవీ 27Kw (36hp) మోటార్‌తో 130Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సింగిల్‌ ఛార్జ్‌తో 154 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఇందులో అడ్వాన్స్‌ బ్యాటరీ కూలింగ్‌ సిస్టమ్‌ కూడా ఉంది. రెగ్యులర్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ఇ-కామర్స్‌ లాజిస్టిక్స్‌ కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. పాసింజర్‌ కార్లు, బస్సులను సైతం ఎలక్ట్రిక్‌గా మారుస్తున్నామని, ఇప్పుడు ఈ-కార్గో వంతు వచ్చిందని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ఈ సందర్భంగా అన్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఏస్‌తో పాటు మరిన్ని కేటగిరీ వాహనాలను సైతం ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చనున్నట్లు చెప్పారు. సరిగ్గా 17 ఏళ్ల క్రితం వచ్చి ఏస్‌ మినీ ట్రక్‌.. ప్రభంజనం సృష్టించిందని, ఇప్పుడు కార్గో విభాగంలో ఏస్‌ ఈవీ సైతం అదే స్థాయిలో మన్ననను పొందుతుందని టాటా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిరీశ్‌ వాఘ్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. ఏస్‌ ఈవీని మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ-కామర్స్‌, లాజిస్టిక్‌ సర్వీసులతో జట్టు కట్టినట్లు వివరించారు.

మరోవైపు ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 500 కిలోమీటర్లు, అంతకంటే అధికదూరం ప్రయాణించే లక్ష్యంతో, విద్యుత్తు వాహనాలు తయారు చేసేందుకు సరికొత్త విద్యుత్‌ వాహన ఆర్కిటెక్చర్‌ అవిన్యా (వినూత్నత) కాన్సెప్ట్‌ను టాటా మోటార్స్‌ ఇటీవల ఆవిష్కరించింది. జెన్‌ 3 ఆర్కిటెక్చర్‌పై రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్‌ వినియోగించుకుని, పలు అధునాతన విద్యుత్‌ వాహనాలను తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. తొలితరం విద్యుత్తు వాహనాలు ఒక ఛార్జింగ్‌తో 250 కి.మీ. ప్రయాణిస్తే, రెండోతరం కర్వ్‌ కాన్సెప్ట్‌కు 400-500 కి.మీ. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, మూడోతరమైన అవిన్యాకు 500 కి.మీ... అంతకుమించిన ప్రయాణం లక్ష్యమని సంస్థ పేర్కొంది. కొత్త ఆర్కిటెక్చర్‌పై రూపొందించిన మొదటి మోడల్‌ 2025లో విపణిలోకి వచ్చే అవకాశం ఉంది.

Audi A8 L బుకింగ్స్​ షురూ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ.. భారత్​ మార్కెట్లోకి మరో కొత్త కారును తీసుకురాబోతోంది. ఆడీ ఏ8 ఎల్​ పేరిట వస్తున్న సెడాన్​ వాహనం బుకింగ్స్​ గురువారం ప్రారంభించింది. 3 లీటర్ల పెట్రోల్​ పవర్​ట్రైన్​, 48వోల్ట్స్​ హైబ్రిడ్​ సిస్టమ్​, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ వంటి అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఆడీ ఏ8 ఎల్​ వాహనం డ్రైవింగ్​లో సరికొత్త అనుభూతిని ఇస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ కారును బుక్​ చేసుకునేందుకు కనీస రుసుము రూ.10 లక్షలు చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: హైబ్రిడ్​ వెర్షన్​లో హోండా సిటీ​.. సూపర్​ మైలేజ్, ఫీచర్స్.. ధర ఎంతంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.