ETV Bharat / business

అతి త్వరలోనే ఈ-పాస్‌పోర్ట్‌లు.. డేటా పూర్తిగా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?

author img

By

Published : Jun 26, 2022, 9:41 PM IST

E Passport India: పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్ రెండో దశలో భాగంగా ఈ-పాస్‌పోర్ట్‌లు తీసుకొస్తున్న కేంద్రం.. ఇవి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే విషయంపై కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరి నాటికి వీటిని జారీ చేయనున్నట్లు తెలిపింది. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

E PASSPORT
E PASSPORT

విదేశీ ప్రయాణం చేయాలంటే.. పాస్‌పోర్ట్‌తోపాటు వీసా తప్పనిసరి. అయితే పాస్‌పోర్ట్ పొందడం అంత సులభమైన ప్రక్రియేమీ కాదు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుని, పోలీస్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియలో ఎలాంటి అభ్యంతరాలు లేవని రుజువైతే నేరుగా ఇంటికే వస్తుంది. ఒకవేళ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే తిరిగి కొత్తది పొందడం మరో పెద్ద పని. అంతేకాదు.. అందులోని సమాచారం ఇతరుల చేతికి చేరుతుందనేది మరో బాధ. మరోవైపు నకిలీ పాస్‌పోర్ట్‌లు కట్టడి కూడా కేంద్రానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ-పాస్‌పోర్ట్‌లను తీసుకురానుంది. వీటి ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడంతోపాటు, పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తుల డేటాకు భద్రత కల్పిచడం, నకిలీ పాస్‌పోర్ట్‌లకు అడ్డుకట్ట వేయొచ్చని కేంద్రం చెబుతోంది.

పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్ రెండో దశలో భాగంగా గతేడాదే ఈ-పాస్‌పోర్ట్‌లు తీసుకొస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తాజాగా పాస్‌పోర్ట్ దివస్‌ను పురస్కరించుకుని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కీలక ప్రకటన చేశారు. "ఈ ఏడాది చివరినాటికి ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తాం. పాస్‌పోర్ట్‌ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి, పౌరులకు ఉత్తమమైన సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ-పాస్‌పోర్ట్‌లను తీసుకొస్తున్నాం" అని మంత్రి తెలిపారు.

ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏమిటి?
నిజానికి ఈ-పాస్‌పోర్ట్ కొత్త ప్రక్రియ ఏమీ కాదు. ఇప్పటికే 100కు పైగా దేశాలు తమ పౌరులకు ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తున్నాయి. ప్రస్తుతం వినియోగంలో సాధారణ పాస్‌పోర్ట్ తరహాలోనే ఈ-పాస్‌పోర్ట్‌ను ఉపయోగించవచ్చు. డేటా భద్రత, విదేశాల్లో సులువైన ఇమిగ్రేషన్‌ ప్రక్రియ కోసం వీటిలో ఎలక్ట్రానిక్ చిప్‌ను నిక్షిప్తం చేస్తారు. ఇందులో పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, చిరునామా వంటి వివరాలు ఉంటాయి. ఇది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ చిప్‌. దీనికి వెనుకవైపు చిన్న యాంటినా ఉంటుంది. దీనిసాయంతో ఇమిగ్రేషన్‌ లేదా ఇతరత్రా సమయాల్లో ప్రయాణికుడి వివరాలను వేగంగా వెరిఫై చేయొచ్చు. ఇప్పటికే ఈ-పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించి కేంద్రం ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌ను ఎంపిక చేసింది. ఇందుకోసం భాతర విదేశాంగ శాఖతో కలిస టీసీఎస్‌ ఒక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.

ఈ-పాస్‌పోర్ట్‌ల జారీ ఎప్పుడు?
తాజాగా కేంద్ర మంత్రి జైశంకర్‌ చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి ఈ-పాస్‌పోర్ట్‌ల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సాధారణ పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తులు ఈ-పాస్‌పోర్ట్‌కు అప్‌గ్రేడ్‌ అవ్వాలా? వద్దా? అన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ-పాస్‌పోర్ట్‌లు చూసేందుకు సాధారణ పాస్‌పోర్ట్‌ల మాదిరే ఉంటాయి. ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎవరైనా కొత్త పాస్‌పోర్ట్ లేదా పాస్‌పోర్ట్ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఈ-పాస్‌పోర్ట్‌లనే జారీ చేస్తారని సమాచారం.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.