'మూడో వేవ్ రాలేదు.. వచ్చే అవకాశం తక్కువే!'

author img

By

Published : Aug 4, 2021, 6:38 PM IST

covid third wave

దేశంలో కరోనా థర్డ్​వేవ్​పై నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోవేవ్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే.. రెండో వేవ్ స్థాయిలో ఉంటుందా? అంతకన్నా ప్రమాదకర పరిస్థితులను తీసుకొస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి... ఆర్​-ఫ్యాక్టర్ ఆందోళనకరంగా మారింది... అనేక రాష్ట్రాల్లో వైరస్ విజృంభిస్తోంది.... మూడోవేవ్ మొదలైపోయినట్టే... ఇవీ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు. వీటిని చూసి మీరూ భయపడుతున్నారా? ఆ అవసరం లేదు. అతిగా ఆందోళన చెందకుండా.. మాస్కు ధరించి, వ్యాక్సిన్ వేయించుకుంటే సరి!

ఇది మేం చెప్పే మాట కాదు.. నిపుణులే స్వయంగా చెబుతున్నారు. కరోనా మూడో వేవ్ ప్రారంభమైందని ఇప్పుడే చెప్పేయడం సరికాదని దేశంలో కరోనా వ్యాప్తిని గమనిస్తున్న నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండో దశ వ్యాప్తే ఇంకా ముగియలేదని గుర్తు చేస్తున్నారు. దిల్లీ సహా ఈశాన్య రాష్ట్రాల్లో వైరస్ కేసులు తగ్గిపోయాయని హరియాణాలోని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ గౌతమ్ మేనన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త వేవ్ ప్రారంభం కన్నా.. రెండో వేవ్ కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

"కేసులు పెరుగుతున్నప్పటికీ.. మూడోవేవ్ ఇప్పుడే మొదలైందని చెప్పడం తొందరపాటు అవుతుంది. రానున్న కొద్ది వారాలు చాలా కీలకం. కేసుల పెరుగుదల ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమవుతుందా లేదా దేశవ్యాప్తంగా ఉంటుందా అనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. కేరళ సెరో సర్వేను గమనిస్తే.. రాష్ట్రంలోని అనేక మందికి వైరస్ ముప్పు ఉందని స్పష్టమవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు."

-గౌతమ్ మేనన్, శాస్త్రవేత్త

ఐసీఎంఆర్ నిర్వహించిన నాలుగో సెరో సర్వేలో.. యాంటీబాడీలు అత్యల్పంగా ఉన్న రాష్ట్రం కేరళ అని తేలింది. మధ్యప్రదేశ్​లో అత్యధికంగా 79 శాతం నమూనాల్లో యాంటీబాడీలు కనిపించగా.. కేరళలో ఈ సంఖ్య 44 శాతంగా ఉంది.

మూడో వేవ్ రాకపోవచ్చు!

యూపీ, బిహార్ సహా జనాభా అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే మెజారిటీ జనాభాకు కరోనా సోకిందని మేనన్ తెలిపారు. ఈ నేపథ్యంలో వైరస్ విజృంభణ నెమ్మదిస్తుందని అంచనా వేశారు. కాబట్టి, దేశవ్యాప్తంగా మరో వేవ్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఒకవేళ వచ్చినా.. భీతావహం కలిగించిన రెండో వేవ్ తరహాలో ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ పరిమిత స్థాయిలోనే జరుగుతోందని, అయినప్పటికీ కేసులు తగ్గడంలో టీకాల పాత్ర కూడా ఉంటుందని వివరించారు.

ఆర్ వ్యాల్యూ సంగతి..?

కరోనా వ్యాప్తిని సూచించే ఆర్ వ్యాల్యూ మే 7 తర్వాత తొలిసారి ఒకటి దాటిందని చెన్నైలోని మేథమెటికల్ సైన్సెస్ ఇన్​స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆర్ వ్యాల్యూ ఒకటి కన్నా ఎక్కువగా ఉందని కేంద్రం సైతం వెల్లడించింది. చెన్నై, కోల్​కతా, బెంగళూరు, దిల్లీ నగరాల్లోనూ ఆర్ వ్యాల్యూ 1 దాటిందని మేథమెటికల్ సైన్సెస్​కు చెందిన సీతభ్ర సిన్హా పేర్కొన్నారు. ఒకే ప్రాంతం నుంచి అధికంగా కేసులు నమోదు కావడం లేదని.. అందువల్ల కట్టడి చేయడం కష్టమవుతోందని తెలిపారు. కరోనా నిబంధనలు సరిగ్గా అమలు చేయడమే ఇందుకు పరిష్కారమని మరో నిపుణుడు చంద్రకాంత్ లహారియా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఎనిమిది రాష్ట్రాల్లో ఆందోళనకరంగా కరోనా ఆర్​-ఫ్యాక్టర్!

"కొవిడ్ ప్రోటోకాల్స్​ను పటిష్ఠంగా అమలు చేయడం తక్షణావసరం. ఈ గణాంకాలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. వైరస్​ను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి. కానీ, ఎక్కువగా ఆందోళన చెందకూడదు. ప్రజలు మాస్కులు ధరించి, టీకాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు కరోనా వ్యాప్తి అధికంగా లేని రాష్ట్రాల నుంచే కేసులు అధికంగా బయపడుతున్నాయి. మొత్తం కేసుల్లో ఏ రాష్ట్రం నుంచి ఎన్ని కేసులు వస్తున్నాయని లెక్కించడం సరైన పద్ధతి కాదు. కేసులను గుర్తించే వ్యవస్థ పటిష్ఠంగా ఉన్న రాష్ట్రాలతో.. బలహీన వ్యవస్థ ఉన్న రాష్ట్రాలను పోల్చి చూసినట్లు ఉంటుంది."

-చంద్రకాంత్ లహారియా, దిల్లీకి చెందిన ఎపిడమాలజిస్ట్

కరోనా వేవ్​ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రకాంత్ పేర్కొన్నారు. కేసులు పెరగడాన్నే పరిగణనలోకి తీసుకోవాలని.. అది రెండో దశ కొనసాగింపా లేదా మూడో దశ ప్రారంభమా అన్న విషయం ప్రాధాన్యం కాదని అన్నారు.

కేసుల్లో పెద్దగా మార్పు లేదు

మరోవైపు, శివ్ నాడార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ నేచురల్ సైన్సెస్ డీన్ సంజీవ్ గలాండే సైతం మూడో దశ ప్రారంభమైందని ఇప్పుడే చెప్పలేమని అన్నారు.

"దేశవ్యాప్తంగా వీక్లీ సగటు కేసుల్లో పెద్దగా మార్పు లేదు. కొన్ని రాష్ట్రాల్లో మార్పులు స్వల్పంగానే ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి కొత్త వేవ్ ప్రారంభమని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. రెండో వేవ్ పూర్తిగా తగ్గకపోయినా.. ఆర్ వ్యాల్యూ చాలా రాష్ట్రాల్లో 1 లోపునకు పడిపోయింది. కొత్త కేసులు జులై 19న 30 వేల లోపునకు దిగివచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో పెరుగుదల వల్ల.. దేశవ్యాప్తంగా కొత్త కేసులు 40 వేల మార్క్ దాటుతున్నాయి. అయితే, మే నెలతో పోలిస్తే ఇది చాలా తక్కువ."

-సంజీవ్ గలాండే, డీన్, శివ్ నాడార్ యూనివర్సిటీ

బుధవారం దేశవ్యాప్తంగా 42,625 కేసులు వెలుగులోకి వచ్చాయి. పాజిటివిటీ రేటు 2.31 శాతంగా నమోదైంది. వీక్లీ పాజిటివీటీ రేటు 2.36 శాతంగా ఉంది. ప్రస్తుతానికైతే కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే, గత వారంలో 13 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు రికార్డు స్థాయిలో కరోనా కేసులను గుర్తించాయని గుర్తు చేస్తున్నారు.

ఆగస్టు 1తో ముగిసిన వారంలో కేరళలో లక్షా 40 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు వారంతో పోలిస్తే ఇవి 20 వేలు అధికం. దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మిజోరం, జమ్ము కశ్మీర్, సిక్కిం, కర్ణాటకలోనూ కేసులు పెరిగాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.