ఎనిమిది రాష్ట్రాల్లో ఆందోళనకరంగా కరోనా ఆర్​-ఫ్యాక్టర్!

author img

By

Published : Aug 3, 2021, 6:08 PM IST

Updated : Aug 3, 2021, 6:21 PM IST

HEALTH MANSUKH

ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా ఆర్​ ఫ్యాక్టర్ ఒకటి దాటిందని కేంద్రం వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని పేర్కొంది. అయితే, వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందని, త్వరలోనే నాలుగు భారతీయ ఫార్మా సంస్థలు టీకాల ఉత్పత్తిని ప్రారంభించనున్నాయని తెలిపింది.

కొవిడ్ వ్యాప్తిని సూచించే రీప్రొడక్టివ్ నెంబర్(ఆర్ ఫ్యాక్టర్) ఎనిమిది రాష్ట్రాల్లో ఒకటికి మించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 12 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో కరోనా వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతానికి మించి నమోదైందని తెలిపింది. గత నాలుగు వారాలుగా ఆరు రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని వివరించింది.

"అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, భారత్​లో ఆర్​ ఫ్యాక్టర్​ సగటున 1.2గా ఉంది. అంటే.. కరోనా సోకిన వ్యక్తి వల్ల ఒకటి కన్నా ఎక్కువ మందికి వైరస్​ వ్యాపిస్తోంది.

భారత్​లోని 8 రాష్ట్రాల్లో ఆర్​ ఫ్యాక్టర్​ అధికంగా ఉంది. వైరస్ వ్యాప్తి రేటు, యాక్టివ్ కేసుల సంఖ్య ఆర్ ఫ్యాక్టర్​పైనే ఆధారపడి ఉంటుంది. ఆర్​ ఫ్యాక్టర్​ ఒకటికన్నా ఎక్కువ ఉందంటే... కేసులు పెరుగుతున్నాయని, నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అర్థం.

ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. భారత్​ విషయానికి వస్తే... కరోనా రెండో దశ ఇంకా ముగియలేదు. 44 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువ ఉంది."

--లవ్ అగర్వాల్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి

కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, మణిపుర్, అరుణాచల్​ప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని కేంద్రం తెలిపింది. గతవారం నమోదైన మొత్తం కేసుల్లో 49.85 శాతం ఒక్క కేరళలోనే వెలుగుచూసినట్లు వివరించింది. అయితే, టీకా పంపిణీ కార్యక్రం వేగంగా కొనసాగుతోందని కేంద్రం వివరణ ఇచ్చింది. మే నెలతో పోలిస్తే రెట్టింపు టీకాలను జులైలో పంపిణీ చేసినట్లు తెలిపింది.

వ్యాక్సినేషన్ వేగవంతం

మరోవైపు... వ్యాక్సినేషన్​కు సంబంధించి రాజ్యసభలో కీలక విషయాలు వెల్లడించింది కేంద్రం. మరో నాలుగు భారతీయ ఫార్మా సంస్థలు కరోనా టీకాల ఉత్పత్తిని ప్రారంభించనున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ తెలిపారు. అక్టోబర్- నవంబర్ నాటికి ఇవి ఉత్పత్తి ప్రారంభిస్తాయని, తద్వారా వ్యాక్సినేషన్ మరింత వేగం పుంజుకుంటుందని ప్రశ్నోత్తరాల్లో భాగంగా చెప్పారు.

అదే సమయంలో, కొవిషీల్డ్ టీకా ఉత్పత్తి నెలకు 12 కోట్ల డోసులకు పెరగనున్నట్లు మాండవీయ వివరించారు. కొవాగ్జిన్ ఉత్పత్తిని నెలకు 5.8 కోట్ల స్థాయికి చేరనున్నట్లు తెలిపారు.

"ప్రస్తుతం భారత్ బయోటెక్, సీరం ఇన్​స్టిట్యూట్ సంస్థలు ప్రభుత్వానికి టీకాలు సరఫరా చేస్తున్నాయి. స్పుత్నిక్ కూడా అందుబాటులో ఉంది. ఈ టీకా ఉత్పత్తి ప్రారంభమైంది. జనాభా అంతటికీ వీలైనంత వేగంగా టీకా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా 47 కోట్ల డోసులను దేశంలో పంపిణీ చేశాం. వచ్చే రోజుల్లో దీన్ని మరింత వేగవంతం చేస్తాం."

-మన్​సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

ప్రైవేటు ఆస్పత్రులకు అందిస్తున్న టీకా కోటాను కుదించాలని భాజపా ఎంపీ సుశీల్ కుమార్ మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందించారు మాండవీయ. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉపయోగించని టీకాలను ప్రభుత్వం తీసుకుంటోందని తెలిపారు. కాబట్టి కోటాను పెంచాల్సిన అవసరం లేదన్నారు.

ఇదీ చదవండి: పార్లమెంట్​లో అదే రగడ- కీలక బిల్లులు పాస్

Last Updated :Aug 3, 2021, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.