ETV Bharat / bharat

దిల్లీలో ఏపీ సీఐడీ చీఫ్‌ విలేకర్ల సమావేశం.. తెలుగు మీడియాను రానివ్వకుండా విశ్వప్రయత్నం

author img

By

Published : Apr 13, 2023, 8:12 AM IST

No Entry for Telugu Media in Press Meet: మార్గదర్శి అంశంపై ఏపీ సీఐడీ ఏడీజీ ఎన్‌.సంజయ్‌ దిల్లీ ఏపీభవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశానికి తెలుగు మీడియాను రానీయకుండా సీఐడీ అధికారులు విశ్వప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మార్గదర్శిపై సీఐడీ అధికారులు చేస్తున్న ఆరోపణల గురించి తెలుగు మీడియా ప్రతినిధులు లోతైన ప్రశ్నలు వేస్తారన్న ఉద్దేశంతో వారిని రానీయకుండా చేయాలని చూశారు.

No Entry for Telugu Media
No Entry for Telugu Media

No Entry for Telugu Media in Press Meet: మార్గదర్శి అంశంపై ఏపీ సీఐడీ ఏడీజీ ఎన్‌.సంజయ్‌ దిల్లీ ఏపీభవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశానికి తెలుగు మీడియాను రానీయకుండా సీఐడీ అధికారులు విశ్వప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మార్గదర్శిపై సీఐడీ అధికారులు చేస్తున్న ఆరోపణల గురించి తెలుగు మీడియా ప్రతినిధులు లోతైన ప్రశ్నలు వేస్తారన్న ఉద్దేశంతో వారిని రానీయకుండా చేయాలని చూశారు. మార్గదర్శి అంశాన్ని దేశవ్యాప్త విషయంగా ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఐడీ ఏడీజీ బుధవారం దిల్లీలో విలేకర్ల సమావేశం పెట్టారు. దానికి ఆంగ్ల, హిందీ పత్రికలు, ఛానళ్లతోపాటు తెలుగు నుంచి సాక్షి ఛానల్‌ను లోపలికి అనుమతించారు.

మిగతా తెలుగు పాత్రికేయులందర్నీ బయటే నిలబెట్టి సాక్షి మీడియా ప్రతినిధులను మాత్రమే ఎలా లోపలికి రానిస్తారని కొందరు తెలుగు మీడియా ప్రతినిధులు ఏపీ సీఐడీ పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు వారిని దబాయించి బయటికి పంపించాలని చూశారు. అది సాధ్యం కాకపోవడంతో సాక్షి మీడియాతో పాటు అందరూ కెమెరాలు పెట్టుకోవాలని, రిపోర్టర్లు మాత్రం బయటికెళ్లాలని సూచించారు. దానికి తెలుగు మీడియా ప్రతినిధులు అంగీకరించలేదు.

తెలుగు మీడియానే బయటికెళ్లమనడం ఏంటి?: ఒక ప్రభుత్వ అధికారి వచ్చి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ భవనంలో విలేకర్ల సమావేశం పెట్టి కేవలం తెలుగు మీడియానే బయటికెళ్లమని ఎందుకు అడుగుతున్నారు? వారు విలేకర్ల సమావేశానికి హాజరైతే మీకు సమస్య ఏంటి? మీరు తెలుగు మీడియా, జాతీయ మీడియాను ఎందుకు వేరు చేసి చూస్తున్నారని తెలుగు మీడియా ప్రతినిధులు నిలదీశారు. జాతీయ మీడియాతో మాట్లాడటానికి ఇదే సరైన వేదిక అని ఏపీసీఐడీ ఏడీజీ ఇక్కడికొచ్చారని పోలీసు సిబ్బంది చెప్పారు. దిల్లీలో ఉన్న తాము కూడా జాతీయ మీడియా ప్రతినిధులమేనని.. కేంద్ర మంత్రులు, అధికారుల విలేకర్ల సమావేశాలకు కూడా వెళ్తుంటామని విలేకర్లు చెప్పారు. దేశ రాజధానిలో ప్రాంతీయ మీడియా, జాతీయ మీడియా అన్న భేదభావాలు ఉండవన్నారు. దీంతో పోలీసులు సాక్షి ప్రతినిధిని కూడా బయటికి పంపుతామన్నారు. మేం సాక్షి గురించి మాత్రమే అడగటం లేదు.. జాతీయ మీడియా, ప్రాంతీయ మీడియా అని మీరు వేర్వేరుగా ఎందుకు చూస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు.

ఏపీసీఐడీ ఏడీజీ తొలుత జాతీయ మీడియాను ఉద్దేశించి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోమనండి, ఆయన మాట్లాడినంతసేపు మేం ఎలాంటి ప్రశ్నలు అడగం, ఆయన తెలుగు మీడియాకు అనుమతించిన తర్వాతే ప్రశ్నిస్తాం అని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో విలేకర్ల సమావేశం పెట్టి ఎందుకు రహస్యం పాటిస్తారు? అని ప్రశ్నించగా.. మేం ఏమీ దాయడం లేదని, కావాలంటే కెమెరాలు పెట్టుకోమని పోలీసు సిబ్బంది పేర్కొన్నారు. కెమెరాలు ఉన్నప్పుడు తాము వస్తే అభ్యంతరమేంటని విలేకర్లు ప్రశ్నించారు. ఈ విలేకర్ల సమావేశమైన తర్వాత మళ్లీ మిమ్మల్ని ఆహ్వానిస్తామని, అంతవరకు మీ కెమెరాలు పెట్టేసి బయటికెళ్లిపోండి, తర్వాత రండి అని పోలీసులు స్పష్టం చేశారు. ఒకే విషయాన్ని విలేకర్లకు గ్రూపులవారీగా వేర్వేరుసార్లు చెప్పాల్సిన అవసరమేంటి? కెమెరామెన్లు ఉండి.. విలేకర్లు బయటకెళ్లండి అని చెప్పడం ఎందుకుని పాత్రికేయులు ప్రశ్నించారు. తాము ఇక్కడ 20 ఏళ్లుగా పనిచేస్తున్నామని, ఎప్పుడూ ఇలా విలేకర్ల సమావేశం నుంచి బయటికెళ్లాలని చెప్పిన దాఖలాల్లేవని పేర్కొన్నారు.

మా కంటే వాళ్లకే బాగా తెలుస్తుంది కదా..: హిందీ మీడియా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ జాతీయ మీడియా కంటే తెలుగు విలేకర్లకు ఈ విషయం గురించి బాగా తెలుస్తుంది, వాళ్లు మంచి ప్రశ్నలు వేయగలుగుతారు, వారిని ఎందుకు బయటకు పంపుతున్నారని ఏపీ పోలీసులను ప్రశ్నించారు. మేం సాక్షి రిపోర్టర్‌ను కూడా పంపించేశామని, లోగో కూడా పెట్టనివ్వలేదని, తర్వాత మీరు రావచ్చని పోలీసులు తెలుగు మీడియా ప్రతినిధులకు బదులిచ్చారు. ఈ సమావేశం తర్వాత సీఐడీ ఏడీజీ తెలుగు పాత్రికేయులకు ప్రత్యేకంగా సమావేశం పెట్టకుండా వెళ్లిపోతే తామేం చేయాలని విలేకర్లు ప్రశ్నించారు. తొలుత మమ్మల్ని దబాయించిన మీరు మళ్లీ మమ్మల్ని లోపలికి రానిస్తారన్న నమ్మకమేంటని నిలదీశారు. అందుకు క్షమాపణలు చెబుతున్నానని ఒక పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. మాతో సమావేశం పూర్తయ్యే వరకూ తెలుగు విలేకర్లను ఆ హాల్లోనే కూర్చోనివ్వండి, బయటికెళ్లమనడం విలేకర్ల మధ్య తేడా చూపినట్లవుతుందని జాతీయ మీడియా ప్రతినిధులూ ఏపీ పోలీసులకు సూచించారు. మా సమావేశం తర్వాతే ప్రశ్నలు అడుగుతామని వారు చెబుతున్నప్పుడు హాల్లో కూర్చోనివ్వడానికి సమస్యేంటని ప్రశ్నించారు.

అప్పటి వరకు తెలుగు మీడియాను ప్రత్యేకంగా పిలుస్తామని చెప్పిన పోలీసులు.. ఈ రోజు మేం తెలుగు మీడియాకు సమావేశమని ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. అధికారులు విలేకర్ల సమావేశం పెట్టినప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని.. దాన్ని కవర్‌ చేయడం విలేకర్ల బాధ్యత అని, అది కూడా ఏపీ ప్రభుత్వ భవనంలో ఏర్పాటు చేసి తమను రావద్దంటే ఎలా అని తెలుగు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఇలా మీడియాలో కొందరు రావద్దనడం సబబు కాదని, జాతీయ మీడియా సెంటర్లలోనూ ఇలా ఎప్పుడూ వేరు చేసి చూడలేదని జాతీయ మీడియా ప్రతినిధులు ఏపీ పోలీసులతో అన్నారు. సీఐడీ ఏడీజీ ఇప్పుడు మాట్లాడబోయేది ఆయన కుటుంబ విషయం కాదు, పోలీసు దర్యాప్తునకు సంబంధించిన విషయం గురించి విలేకర్లు అందరూ వింటే వచ్చే సమస్యేంటని ప్రశ్నించారు. ఇలా చేయడం ప్రభుత్వానికీ మంచిదికాదని సూచించారు. ప్రస్తుతానికి కెమెరామెన్లను అనుమతిస్తాం... తర్వాత విలేకర్లు రావొచ్చని పోలీసులు చెప్పారు. కెమెరామెన్లను రానిచ్చాకే మేం బయటికెళ్తామని విలేకర్లు పోలీసులకు స్పష్టం చేశారు. అయితే కెమెరామెన్లను రానివ్వకుండానే పాత్రికేయులను బయటికి పంపే ప్రయత్నం చేశారు.

ఈ వివక్షే ఎక్కువ ప్రచారమవుతుంది జాగ్రత్త!

పోలీసులకు, తెలుగు విలేకర్లకు సుమారు 40 నిమిషాలపాటు ఈ వాదనలు సాగాయి. ఆలస్యమైపోతుందని, త్వరగా మాట్లాడితే తాము వెళ్లిపోతామని జాతీయ మీడియా ప్రతినిధులు అన్నారు. ఇలా జాతీయ మీడియా, ప్రాంతీయ మీడియా మధ్య తేడా చూపిస్తే ఉత్తరాది, దక్షిణాది మధ్య తేడా చూపినట్లవుతుందని.. అసలు విలేకర్ల సమావేశం కంటే ఇదే పెద్ద హైలైట్‌ అవుతుందని, హోంశాఖ దృష్టికి కూడా వెళుతుందని వారు ఏపీ పోలీసులను హెచ్చరించారు. విషయం చేయిదాటిపోతుందని భావించిన సీఐడీ పోలీసులు.. ఎట్టకేలకు అందర్నీ అనుమతిస్తామని చెప్పారు. అయితే జాతీయ మీడియా సమావేశం పూర్తయ్యాకే తెలుగు విలేకర్లు ప్రశ్నలు అడగాలని షరతు పెట్టారు. చివరకు తెలుగు విలేకర్లకు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించకుండానే సీఐడీ ఏడీజీ వెళ్లిపోవడం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.