ETV Bharat / bharat

Margadarsi: మార్గదర్శిపై ప్రతీకారాత్మక దాడి.. ఏపీ సీఐడీ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించిన సంస్థ

author img

By

Published : Jul 29, 2023, 7:30 AM IST

Margadarsi Condemned AP CID Allegations: AP CID ఆరోపణల్ని మార్గదర్శి సంస్థ నిర్ద్వంద్వంగా ఖండించింది. కక్ష సాధించాలనే తొందరలోనే ఆస్తుల జప్తు చేసిందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గతంలో చేసిన ఆరోపణలనే ఎస్సీ అమిత్ బర్దార్‌ తిరిగి వల్లెవేశారని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చినా.. అదే దుష్ప్రచారం కొనసాగిస్తున్నారని తెలిపింది.

margadarsi
margadarsi

Margadarsi Condemned AP CID Allegations: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆ సంస్థ ప్రమోటర్లపై ఏపీ సీఐడీ తన ప్రతీకారాత్మక దాడిని కొనసాగించింది. CID ఎస్పీ అమిత్‌ బర్దార్‌ శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ.. గతంలో చేసిన ఆరోపణలనే తిరిగి వల్లెవేశారు. ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఉషాకిరణ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థల్లో మార్గదర్శి చిట్‌ఫండ్‌ పెట్టిన రూ.15.81 కోట్ల పెట్టుబడుల్ని జప్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో ఎంఎస్‌ నంబర్‌ 134 విడుదల చేసిందని ఆయన తెలిపారు.

వాస్తవానికి మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థకు చెందిన 1,035 కోట్ల రూపాయల విలువ చేసే చరాస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకు ఇంకా కోర్టు అనుమతి లభించాలి. ఇందుకోసం ప్రభుత్వం 2023 మే 29న జీవో ఎంఎస్‌ నంబర్‌ 104, జూన్‌ 15న జీవో 116 విడుదల చేసింది. అయితే ఏపీసీఐడీ ఎప్పట్నించో చెబుతున్న, ఒక మీడియా సంస్థ దురుద్దేశంతో ప్రచురిస్తూ వస్తున్న పాత అబద్ధాలనే ఈసారీ పునరుక్తం చేశారు. మార్గదర్శికి అనుకూలంగా హైకోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని పట్టించుకోకుండా అదే దుష్ప్రచారానికి మళ్లీ ఒడిగట్టారు.

ఏపీ సీఐడీ దురుద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణల్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్కడా ఒక్క ఎగవేతకు, అక్రమానికి తావీయకుండా దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతున్న వ్యాపారాన్ని కూల్చే ఎత్తుగడలో భాగంగా సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడం, చందాదారుల్ని భయభ్రాంతులకు గురిచేయడం ఈ అవాస్తవాల వెనక అసలు లక్ష్యమని తెలిపింది.

మార్గదర్శిని వాస్తవాలతో ఎదుర్కోలేక రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విభాగం ద్వారా మీడియాలో తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ ప్రజల్ని, ముఖ్యంగా చందాదారుల్ని అయోమయానికి గురిచేస్తోందని పేర్కొంది. ఎలాగైనా మార్గదర్శిపై కక్ష సాధించాలన్న తొందరలో రాష్ట్ర ప్రభుత్వం సంస్థ చరాస్తుల్ని జప్తు చేస్తున్నట్టు ప్రకటించిందని.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, తదితర పెట్టుబడుల రూపంలో ఉన్న ఈ చరాస్తులు కంపెనీ ఆరు దశాబ్దాలుగా గడించిన లాభాలతో సమకూర్చుకున్నవే తప్ప ఒక్క పైసా కూడా చందాదారుల చందా నుంచి తీసుకున్నది కాదని స్పష్టం చేసింది.

దురుద్దేశంతో తప్పుడు ప్రచారం, కేసులు: సీఐడీ దర్యాప్తునకు సహేతుకమైన ప్రాతిపదికే లేదని మార్గదర్శి సంస్థ పేర్కొంది. చిట్‌ఫండ్‌ వ్యాపారం చేస్తూ మిసిలేనియస్‌ నాన్‌బ్యాంకింగ్‌ కంపెనీ కోవకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం వర్తించదని.. మార్గదర్శి 1982 నాటి చిట్‌ఫండ్‌ చట్టం పరిధిలోకి వస్తుందని తెలిపింది.

ఆర్‌బీఐ చట్టంలోని 45-ఐ (బిబి) సెక్షన్‌లో నిర్వచనం మేరకు చిట్‌ఫండ్‌ చందాలను డిపాజిట్లుగా పరిగణించడానికి వీల్లేదు. ఈ చట్టంపై పూర్తి అవగాహన ఉండి కూడా.. ఏపీ సీఐడీ ఇప్పటివరకూ తాను పాల్పడిన లోపభూయిష్టమైన చర్యల్ని సమర్థించుకోడానికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని మీడియా ద్వారా ప్రచారం చేస్తోందని మార్గదర్శి సంస్థ ప్రకటనలో వెల్లడించింది. మార్గదర్శి యాజమాన్యంపై తప్పుడు కేసులు బనాయించి 60 ఏళ్లుగా మార్గదర్శిపై.. అచంచల విశ్వాసముంచిన చందాదారుల దృష్టిలో సంస్థను దోషిగా నిలిపే కుతంత్రంలో భాగంగా వాస్తవాల్ని కావాలనే మరుగుపరుస్తోందని మార్గదర్శి సంస్థ పేర్కొంది.

ప్రభుత్వ ప్రోద్బలంతో.. నిలిపివేత ఆదేశాలు: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రోద్బలంతో రిజిస్ట్రార్లు... రాష్ట్రంలో ఎలాంటి ఫిర్యాదులకూ తావీయకుండా విజయవంతంగా నడుస్తున్న చిట్‌ గ్రూపులకు వ్యతిరేకంగా నిలిపివేత ఆదేశాలిచ్చారు. తాము పొదుపు చేసుకున్న సొమ్ము భవితవ్యం ఏంటన్న బెంగతో చందాదారులు సంస్థను ఆశ్రయించి రిజిస్ట్రార్ల ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసేందుకు సమాచారం అందించాల్సిందిగా కోరారు. చిట్‌ గ్రూపుల నిలిపివేత ఆదేశాలు తమ ప్రయోజనాలకు తీవ్రంగా విఘాతం కలిగిస్తాయని, ఒక పథకం ప్రకారం జరుగుతున్న ఈ దాడిలో అంతిమంగా తాము సమిధలవుతామని గుర్తించిన చిట్టీ పాడుకోని చందాదారులు.. న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తలుపులు తట్టారు. తమ సొమ్మును మార్గదర్శి సంస్థ నిర్వహణలోనే ఉంచాలని అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఈ నిలిపివేత ఉత్తర్వులను సస్పెండ్‌ చేయడంతోపాటు, అవి సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, పిటిషనర్ల ప్రయోజనానికి భంగకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

చందాదారుల్ని బెదిరిస్తూ.. దౌర్జన్యం: ఏపీ హైకోర్టు వెల్లడించిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా కోపోద్రిక్తులైన సీఐడీ అధికారులు నిలిపివేత ఆదేశాలను సవాలు చేసిన చందాదారులను బెదిరించడంతో పాటు వారిపై దౌర్జన్యానికి దిగినట్టు తెలిసింది. భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులకు విఘాతం కలిగిస్తూ చందాదారుల వ్యాపారం, వృత్తి, ఆదాయమార్గాలు, కేవైసీ తదితర వ్యక్తిగత సమాచారం కూడా కోరుతున్నారు. ఈ కేసు దర్యాప్తు పరిధిలో లేని ఆదాయపన్ను, జీఎస్టీ వంటి విషయాల సమాచారం కూడా ఇవ్వాల్సిందిగా చందాదారుల్ని బలవంతపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న సంస్థలన్నీ ఈ చందాదారుల్ని వేధింపులకు గురిచేస్తున్నాయి. నిలిపివేత ఆదేశాల్ని సవాలు చేస్తూ తాము సమర్పించిన పిటిషన్లను వెనక్కు తీసుకునేలా కొందరిపై ఒత్తిడి చేశారు.

సంస్థ వ్యాపారాన్ని స్తంభింపజేయడమే లక్ష్యంగా.. బలవంతపు చర్యలు: ఈ కేసులో న్యాయాన్ని గెలిపించేందుకు పూర్తి నిష్పాక్షికతతో కూడిన సమగ్ర విచారణ జరుపుతున్నట్టు సీఐడీ ఎస్పీ చెబుతున్నారు. కానీ సంస్థ వ్యాపారాన్ని స్తంభింపజేయడానికి అన్యాయమైన బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల్ని బేఖాతరు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌, పత్రాల స్వీకరణ, సెక్యూరిటీ విడుదల వంటి విషయాల్లో చట్టనిర్దేశాన్ని కచ్చితంగా పాటించాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2022 డిసెంబరు 26న ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించడంలో రిజిస్ట్రార్లు పూర్తిగా విఫలమయ్యారు.

70 కోట్ల రూపాయలకు పైగా సీఎస్డీ ఎఫ్‌డీఆర్‌లను విడుదల చేయకుండా తమవద్దే ఉంచుకున్నారు. సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, బ్రాంచ్‌ మేనేజర్లు, ఇతర సిబ్బందిపై బలప్రయోగం చేయరాదని మార్గదర్శి సంస్థ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లపై స్పందిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి సంస్థ, దాని బ్రాంచిలు నిర్వహించే దైనందిన కార్యకలాపాలకు అవరోధం కల్పించవద్దని ప్రతివాది అయిన ఏపీ సీఐడీని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు మరో రిట్‌ పిటిషన్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పైన అభియోగించిన నేరాలకు సంబంధించి భవిష్యత్తులో ఎప్పుడు సోదాలు నిర్వహించినా పిటిషనర్‌ కంపెనీకి సంబంధించిన బ్రాంచి కార్యాలయాల మెయిన్‌ గేట్లు మూయవద్దని కూడా కోర్టు ఆదేశించింది.

ఈ కేసుపై మీడియా విచారణకు పాల్పడవద్దని 2023 జూన్‌ 26న తెలంగాణ హైకోర్టు పేర్కొంది. సీఐడీ ఎస్పీ కోర్టు ఆదేశాలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఇప్పటికే కోర్టు విచారణలో ఉన్న అంశంపై నిరాధార నిందారోపణలకు దిగారు. తద్వారా చందాదారుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. విచారణలో ఉన్న కేసుపై పోలీసులు తమ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించకూడదు. న్యాయస్థానంలో నేరం రుజువు కానంతవరకూ ఏ వ్యక్తినైనా నిర్దోషిగానే పరిగణించాలన్న న్యాయసూత్రాన్ని సీఐడీ గౌరవించాలి.

చిట్‌ఫండ్‌ చట్టాన్ని గానీ, కంపెనీ చట్టాన్ని గానీ, ఆదాయపు పన్ను చట్టాన్ని గానీ ఉల్లంఘించలేదని మార్గదర్శి పునరుద్ఘాటిస్తోంది. చిట్టీ పాడుకున్నవారికి సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు జరపడం సంస్థ అనుసరిస్తున్న నియమం. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాలను చట్టనిర్దేశం ప్రకారం నిర్వహిస్తున్న సంబంధిత ఖాతాలకు బదిలీ చేసే ప్రక్రియను తప్పనిసరిగా పాటిస్తోంది.

మార్గదర్శిపై ప్రతీకారాత్మక దాడి.. ఏపీ సీఐడీ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించిన సంస్థ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.