ETV Bharat / bharat

మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వ కుట్ర.. మరోసారి కక్ష సాధింపు చర్యలు

author img

By

Published : Jun 18, 2023, 7:06 AM IST

AP Govt Partisan Actions on Margadarsi: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఆంధ్రప్రదేశ్ తన కుట్రపూరిత, దురుద్దేశపూర్వక, కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. ఎన్నో ఎళ్లుగా ఆర్థిక సమగ్రతకు, నిష్కళంక క్రమశిక్షణకు మార్గదర్శి పెట్టింది పేరు. అటువంటి సంస్థపై.. చందాదార్లలో ఉన్న విశ్వాసాన్ని నాశనం చేయాలనే ఏకైక లక్ష్యంతో నిరాధార ఆరోపణలు చేస్తోంది.

margadarsi
మార్గదర్శి

మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వ కుట్ర.. మరోసారి కక్ష సాధింపు చర్యలు

AP Govt Partisan Actions on Margadarsi: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఏపీ ప్రభుత్వం తన కుట్రపూరిత, దురుద్దేశపూర్వక, కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. అందులో భాగంగానే మార్గదర్శి ఆస్తుల జప్తునకు అనుమతిస్తూ గురువారం రెండో జీవోను జారీ చేసింది. సంస్థపై లక్షల మంది చందాదార్లలో ఉన్న విశ్వాసాన్ని నాశనం చేయాలనే ఏకైక లక్ష్యంతో కల్పిత, నిరాధార ఆరోపణలు చేస్తోంది. తాజా జీవోలోనూ ఎటువంటి ఆధారాలూ, తర్కమూ లేని.. పాత ఆరోపణలే వల్లెవేసింది.

ఖాతాదార్ల ప్రయోజనాలను కాపాడుతున్నామనే సాకుతో.. చిట్‌ఫండ్‌ వ్యాపారంలో 60 ఏళ్లకు పైగా ఆర్థికంగా స్థిరంగా, అద్భుతమైన ట్రాక్‌ రికార్డుతో ఉన్న మార్గదర్శిని కావాలనే ఇబ్బంది పెట్టే అతిపెద్ద కుట్రకోణంతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగజారుడు పనులకు పాల్పడుతోంది. మార్గదర్శి 60 లక్షల మందికి పైగా చందాదార్లకు ఏళ్ల కొద్దీ సేవలందిస్తూ వస్తోంది.

గత ఆరు దశాబ్దాల్లో, మూడు తరాల చందాదార్లకు రాజీలేని సేవలను కంపెనీ అందిస్తోంది. అయినా దురుద్దేశపూర్వక ఎజెండాతో ప్రభుత్వం పదేపదే ఒకే విషయాన్ని దుష్ప్రచారం చేస్తూ ఖాతాదారుల్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. మార్గదర్శి విషయంలో రాష్ట్ర పాలకుల అబద్ధాలకు, దురుద్దేశపూరిత చర్యలకు అంతేలేదు. సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కుట్రపూరిత ఎజెండాతో, పసలేని ఆరోపణలతో జీవోల మీద జీవోలు జారీ చేసింది.

న్యాయస్థానాలు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా మార్గదర్శికి ఎప్పటికప్పుడు ఉపశమనం కల్పిస్తున్నప్పటికీ, ప్రభుత్వం వాటిని పూర్తిగా విస్మరిస్తూ.. కౌంటర్లు దాఖలు చేయకుండా తప్పుడు ఆరోపణలకు దిగుతోంది. అంతేకాకుండా ఖాతాదారులను భయభ్రాంతులకు గురిచేయడానికే విచక్షణారహితంగా జప్తు కార్యక్రమానికి పూనుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, అసలు నిజాలేమిటో పరిశీలిద్దాం.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఏళ్ల పాటు ఆర్థిక సమగ్రతకు, నిష్కళంక క్రమశిక్షణకు పెట్టింది పేరు. అన్ని శాఖల్లో చందాదారులు సంస్థ పనితీరుపై ఎల్లప్పుడూ సంతోషం వ్యక్తం చేస్తారు. గత 8 నెలల్లో చందాదారులకు, సంస్థ వ్యాపారానికి ఇబ్బందులు కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం, విభాగాలు పలు యత్నాలు చేశాయి. అయినా మార్గదర్శిపై చందాదార్ల విశ్వాసాన్ని ఏ మాత్రం దెబ్బతీయలేకపోయాయి. చందాదారులకు రక్షణ కల్పించే విధంగా కంపెనీ యాజమాన్యం ఎప్పటికప్పుడు వ్యవస్థీకృత చర్యలు చేపడుతూ కఠినమైన ఆర్థిక విధానాలను అవలంబిస్తోంది.

మార్గదర్శి ఆస్తుల జప్తు అవసరమేంటి?
చందాదారులకు చెల్లింపుల్లో ఎలాంటి ఆరోపణలు లేకున్నా.. మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఆస్తులను ఎటాచ్‌మెంట్‌ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, విచారణాధికారుల దురుద్దేశం సుస్పష్టం. దశాబ్దాలుగా సంపాదించిన సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు వ్యాపారాన్ని బలహీనపరచడమే వారి లక్ష్యం. ప్రభుత్వ చర్యలు కేవలం చందాదారులను భయభ్రాంతులకు గురిచేయడానికి ఉపక్రమించిన దురుద్దేశపూర్వక చర్య మాత్రమే. మార్గదర్శి చిట్‌ఫండ్‌లో మొత్తం 4000 మంది ఉద్యోగులుండగా, అందులో 1250 మంది 37 శాఖలున్న ఆంధ్రప్రదేశ్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

చిట్‌ఫండ్‌ నిర్వహణపై అవగాహనే లేదా?
చిట్‌ఫండ్‌ వ్యాపారం ఎలా నిర్వహిస్తారో కూడా కనీస అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. ఒక చిట్‌ గ్రూప్‌లోని సభ్యులందరి వద్ద ఆ నెలకు సంబంధించిన కిస్తీ వసూలు చేసి, పాట పాడుకున్న వ్యక్తికి ఇవ్వడం ఫోర్‌మన్‌ విధుల్లో భాగం. ఈ పరిస్థితుల్లో చిట్‌ సభ్యుల నిధులను వేరే ప్రాంతానికి బదిలీ చేయడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అయినా కూడా సంస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ఆస్తులను ఎటాచ్‌ చేయడానికి సందేహాస్పదంగా, చందాదారులను కాపాడుతున్నామనే సాకుతో వారి ప్రయోజనాలను దెబ్బతీసే హానికర పద్ధతులను ప్రభుత్వం అనుసరించింది.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ తనకు వచ్చిన నికర ఆదాయాన్ని మాత్రమే పెట్టుబడులు పెడుతూ, దానిపై ప్రతిఫలాన్ని పొందుతోంది. ఈ పరిస్థితుల్లో చందాదార్ల నెలవారీ కిస్తీ మొత్తాలను సంస్థ వేరేచోట్ల పెట్టుబడులు పెడుతుందనే ప్రశ్నే తలెత్తదు. అయినా కూడా సంస్థ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇతర పెట్టుబడులను ప్రభుత్వం జప్తు చేయడం దారుణం.

ముగిసిన చిట్స్‌కు సంబంధించి డిపాజిట్లూ ఇవ్వడం లేదు
ఏదైనా చిట్‌ గ్రూప్‌ కొత్తగా ప్రారంభించేటప్పుడు, అందుకు సంబంధించి చిట్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ను మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రభుత్వం వద్ద ఉంచుతుంది. ఇప్పటికే కొన్ని చిట్‌లు పూర్తయినా, వాటికోసం జమ చేసిన సెక్యూరిటీ మొత్తం రూ.70 కోట్లకు పైగా విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా నిలిపివేసింది. ఈ విషయంలో చేసిన దరఖాస్తులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు.

  • కొత్త చిట్‌లకు అనుమతివ్వడం లేదు
    కొత్త చిట్‌లు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా అనుమతి ఇవ్వడం లేదు. ఇందుకోసం అధికారంలోని వారి మౌఖిక ఆదేశాలే కారణంగా తెలుస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్‌ వ్యాపార పరిమాణాన్ని తగ్గించడం, అడ్డుకోవడమే పరమార్థంగా ఈ చర్యలకు పాల్పడుతున్నారు. కొత్త చిట్‌ గ్రూప్‌లు ప్రారంభించినా, లేకున్నా కూడా.. ప్రస్తుత చిట్‌లు పాడుకున్న వారికి నెలవారీగా బిడ్‌ చెల్లింపులు జరిపేందుకు, చందాదారుల నుంచి వసూలయ్యే కిస్తీలే సరిపోతాయి.

* వాస్తవాలు ఇలా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని అర్థం చేసుకునేందుకు నిరాకరిస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, కేసులు పెట్టి వేేధిస్తూ.. ఏవో ఆర్థిక ఉల్లంఘనలు జరిగాయన్న భావన చందాదార్లలో కలిగించడమే ఎజెండాగా చర్యలు చేపడుతోంది. సమయానికి చెల్లింపులతో మార్గదర్శి చిట్‌ఫండ్‌ 6 దశాబ్దాలుగా సంపాదించుకున్న విశ్వసనీయతను దెబ్బతీయటానికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ దుశ్చర్యలకు పాల్పడుతోంది. 60 సంవత్సరాల్లో ఒక్క ఫిర్యాదూ లేకున్నా కేవలం ‘ఈనాడు’పై కక్షతోనే.. సుస్థిర వ్యాపారాన్ని సాగిస్తున్న మార్గదర్శిపై ప్రభుత్వం ఈ నీతిమాలిన చర్యలకు ఒడిగడుతోంది.

ఆరోపణ: చందాదార్ల సొమ్మును కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ చేస్తున్నారు.
వాస్తవం: చందాదార్ల సొమ్మును కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ చేసి, ఆ సొమ్మును మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడిగా పెట్టారనే ఆరోపణ పూర్తిగా సత్య దూరం. చిట్‌ఫండ్‌ చట్ట ప్రకారం.. ప్రతి నెలా చందాదార్ల నుంచి వసూలైన సొమ్మును, ఆ నెలలో చిట్‌ను వేలంలో పాడుకున్న వారికి చెల్లించటం జరుగుతుంది. సంస్థకు వివిధ బ్రాంచిల ద్వారా లభించిన కమీషన్‌ ఆదాయంలో కొంత మొత్తం మాత్రమే కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ అవుతుంది. ఇది సంస్థకు చెందిన మిగులు ఆదాయం. ఆ సొమ్మును ఎక్కడైనా నిల్వ చేసుకోవచ్చని, పెట్టుబడి పెట్టుకోవచ్చని చిట్‌ఫండ్‌ చట్టంలోని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా మిగిలిన సొమ్మును కూడా మార్గదర్శి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది.

అందుకే సంస్థ ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటమే కాకుండా, ఇన్నేళ్లలో ప్రతి చందాదారుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెల్లింపులు నిర్వహిస్తూ వచ్చింది. వాస్తవం ఇది కాగా, చందాదార్ల సొమ్మును మళ్లించారనే తప్పుడు ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం పదేపదే వల్లెవేస్తోంది. ఎంత చెప్పినా వాస్తవాన్ని గ్రహించాలనే కనీస స్పృహ లేకుండా ప్రవర్తిస్తోంది. 1982 చిట్‌ఫండ్స్‌ చట్టానికి విరుద్ధంగా, ఎప్పుడూ కూడా మార్గదర్శి చందాదార్ల నిధులను మళ్లించలేదు. మళ్లించదు కూడా.

ఆరోపణ: చిట్‌ఫండ్‌ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు
వాస్తవం: ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో మార్గదర్శి నిర్వహిస్తున్న లావాదేవీలను ఎప్పటికప్పుడు రిజిస్ట్రార్స్‌ ఆఫ్‌ చిట్స్‌ ఆమోదిస్తున్నారు. మార్గదర్శి గత 60 ఏళ్లలో చిట్‌ఫండ్‌ చట్ట నిబంధనలను ఉల్లంఘించిన దాఖలాలు మచ్చుకైనా లేవు. అయితే ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉల్లంఘనలు జరిగాయంటూ రంధ్రాన్వేషణ చేస్తోంది. ఇదంతా ఇంతకాలం సజావుగా, స్థిరంగా నడుస్తున్న సంస్థను దెబ్బతీసే కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదు. కేవలం ప్రభుత్వ విధానాలు, పాలనను ఎండగడుతున్న ‘ఈనాడు’పై కక్ష తీర్చుకోవాలనే దురుద్దేశంతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.

ఆరోపణ: ఉల్లంఘనలు, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు
వాస్తవం: మార్గదర్శి యాజమాన్యంతో పాటు బ్రాంచి మేనేజర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడమే కాదు చందాదారులనూ వేధింపులకు గురి చేశారు. గత 8 నెలల్లో ప్రభుత్వం పలు విధాలుగా ఇబ్బంది పెడుతున్నా, మార్గదర్శిపై చందాదారుల్లో విశ్వాసం ఏ మాత్రం చెక్కుచెదరలేదు. ఈ పరిణామాన్ని విస్మరించి, పూర్తి బాధ్యతారాహిత్యంగా ఎటువంటి ఆధారాలు లేకుండానే దిగజారుడు ఆరోపణలు చేయడం కుట్రపూరితమే.

ఆరోపణ: అక్రమంగా డిపాజిట్లు సేకరించారు..
వాస్తవం: మార్గదర్శిని క్రిమినల్‌ కేసుల్లో ఇరికించాలని రాష్ట్ర ప్రభుత్వం, దాని విభాగాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా సెక్యూరిటీ, ష్యూరిటీ మొత్తాలను ‘అక్రమ డిపాజిట్లు’గా చిత్రీకరిస్తున్నారు. ఈ మొత్తాలను అక్రమ డిపాజిట్లుగా ఆరోపిస్తూ కంపెనీ ఆస్తులను జప్తు చేయడానికి దిగారు. చిట్‌ఫండ్‌ చట్టం 1982లోని సెక్షన్‌ 21(ఈ) ప్రకారం.. చిట్‌ఫండ్‌ వ్యాపారాన్ని నిర్వహించే క్రమంలో భవిష్యత్‌ ఇన్‌స్టాల్‌మెంట్లకు అనుగుణంగా తగినంత ష్యూరిటీ మొత్తాన్ని తీసుకునే హక్కు ఫోర్‌మెన్‌గా వ్యవహరిస్తున్న కంపెనీకి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఈ ష్యూరిటీ మొత్తాలను ‘అక్రమ డిపాజిట్లు’గా ప్రభుత్వం వక్రీకరిస్తోంది.

ప్రభుత్వం తన దుశ్చర్యలను సమర్థించుకోవడానికి వీలుగా.. ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ ద్వారా కంపెనీ కార్యకలాపాలకు నేరపూరిత ఉద్దేశాలను ఆపాదిస్తోంది. కానీ చిట్‌ఫండ్‌ చట్టం 1982లోని నిబంధనల ప్రకారం ఈ చిట్‌ఫండ్‌ వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ ష్యూరిటీ మొత్తాలపై కంపెనీ వివరణ, అభిప్రాయాలను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. చిట్‌ఫండ్‌ కంపెనీలకు వర్తించే విధంగా ఆర్‌బీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ష్యూరిటీ డిపాజిట్‌ను సాధారణ డిపాజిట్‌గా పరిగణించరాదని ఈ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అదే విధంగా చిట్‌ గ్రూపు ప్రస్తుత చందా, భవిష్యత్తులో చెల్లించాల్సి చందా లేదా అడ్వాన్సుగా చెల్లించే చందా సొమ్ము కూడా ‘డిపాజిట్‌’ నిర్వచనం కిందకు రానే రాదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.