ETV Bharat / bharat

కర్ణాటకలో మోదీ ప్రచార జోరు.. బెంగళూరులో 26 కి.మీ మెగా రోడ్​ షో.. తరలివచ్చిన కార్యకర్తలు

author img

By

Published : May 6, 2023, 10:33 AM IST

Updated : May 6, 2023, 12:39 PM IST

karnataka election 2023
karnataka election 2023

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో మెగా రోడ్​షోను నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నగరంలో దాదాపు 26 కిలోమీటర్ల పాటు కన్నడ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

కర్ణాటకలో మోదీ ప్రచార జోరు

కర్ణాటక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార బీజేపీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 26.5 కిలోమీటర్ల మేర మెగా రోడ్​ షోను చేపట్టారు. ఇటీవలే నైస్​ రోడ్​ జంక్షన్​ నుంచి బెంగళూరు నార్త్​ నియోజకవర్గంలోని సుమనహల్లి సర్కిల్​ వరకు రోడ్​ షో నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తాజాగా బెంగళూరు సౌత్​ నియోజకవర్గంలో మెగా రోడ్​ షోను చేపట్టారు.

శనివరాం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రోడ్​ షో మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాగింది. సోమేశ్వర్​ భవన్​ నుంచి బెంగళూరు సౌత్​లోని మల్లేశ్వర్​ సంకి ట్యాంక్​ వరకు దాదాపు 26.5 కిలోమీటర్లు పర్యటించారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని 34 రోడ్లను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మూసివేశారు. వాహనదారులు వేరొక మార్గాన్ని ఎంచుకోవాలని నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం 8 కిలోమీటర్ల మేర మరో రోడ్​షో చేపట్టనున్నారు ప్రధాని మోదీ. కెంపెగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్​ వరకు సాగనుంది.

నగరంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలను కలుసుకునేందుకు రెండు రోజుల రోడ్​ షో పెట్టారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒక రోజులో నగరమంతా పర్యటిస్తే.. ప్రజలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. నగరంలోని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని బీజేపీ ఎలక్షన్​ నిర్వహణ కమిటీ కన్వీనర్​ శోభా కరంద్లాజే చెప్పారు.

ప్రధాని మోదీ ర్యాలీపై కాంగ్రెస్​ ఫైర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన మెగా రోడ్​షోపై కాంగ్రెస్​ విరుచుకుపడింది. ప్రధాని మోదీని మాటలు వక్రీకరించడంలో మాస్టర్​ అని.. ఆయన తన ర్యాలీలో పక్షపాతం, మతోన్మాదంపై రెచ్చగొడుతారని ఆరోపించింది.

'ఉచితంగా సిలిండర్లు.. 'నందిని' పాలు'
బీజేపీ ప్రజా ప్రణాళిక పేరుతో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం అందించడం, సంక్షేమం కల్పించడమే బీజేపీ విజన్‌ అని తెలిపారు.

భాజపా మేనిఫెస్టోలోని ప్రధాన హామీలివే..

  • కర్ణాటకలో ఉమ్మడి పౌరస్మృతి అమలు
  • తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన
  • దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ప్రతి రోజు ఉచితంగా అర లీటరు నందిని పాలు
  • పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం, 5 కేజీల తృణధాన్యాలతో నెలవారీ రేషన్‌ కిట్‌.
  • దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ఏటా ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు (ఉగాది, వినాయక చవితి, దీపావళికి ఒక్కోటి చొప్పున)
  • కర్ణాటక యాజమాన్య చట్టం సవరింపు, ప్రతి వార్డుకో లాబోరేటరీ
  • ప్రతి వార్డులో అటల్‌ ఆహార కేంద్రాలు
  • మైసూరులోని ఫిల్మ్‌ సిటీకి దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు
  • నిరాశ్రయులకు 10 లక్షల ఇళ్ల స్థలాల కేటాయింపు
  • బెంగళూరుకు స్టేట్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్యాగ్
  • వృద్ధులకు ఉచితంగా వార్షిక హెల్త్‌ చెకప్‌లు
  • ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం
  • రూ.30వేల కోట్లతో మైక్రో కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాల కల్పన
  • రూ.1500 కోట్లతో పర్యాటక రంగ అభివృద్ధి

Karnataka Election Date : కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ రాష్ట్రంలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 114 సీట్లతో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్​కు 76, జేడీఎస్​కు 26 సీట్లు ఉండగా.. 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

Last Updated :May 6, 2023, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.