బాపట్ల జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు - జనసేన అభిమానులపై కర్రలతో దాడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 10, 2024, 12:28 PM IST
YSRCP Workers Attack on Janasena Fans: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. ప్రతిపక్షాలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతూ అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు సైతం వైసీపీ నేతల అరాచకాలను చూసీ చూడనట్లు వ్యవహరించటంతో ఇష్టానుసారంగా వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలో తిరునాళ్లకు వెళ్తున్న సమయంలో జనసేన అభిమానులపై వైసీపీ కార్యకర్తలు కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
చెరుకుపల్లి - గోవాడ రహదారి వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనలో జనసేన అభిమానులు తీవ్ర గాయాలపాలయ్యారు. రాత్రి సమయంలో కొందరు జనసేన అభిమానులు ట్రాక్టర్పై పార్టీ జెండాలు పట్టుకుని గోవాడలో జరుగుతున్న తిరునాళ్లకు వెళ్తున్నారు. అదే సమయంలో డీజేలతో భారీగా వైసీపీ కార్యకర్తలు ట్రాక్టర్లపై ప్రభలు తీసుకొస్తున్నారు. వారి ట్రాక్టర్ల పక్క నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన జనసేన అభిమానులపై ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో కొంతమంది జనసేన అభిమానులకు గాయాలవటంతో వారిని రేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.