ETV Bharat / state

పేదలను వాడుకోని వదిలేసిన జగన్ - ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు చెల్లించని ప్రభుత్వం - Fee Reimbursement Amount Issue

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 10:42 AM IST

Fee Reimbursement Amount Issue: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు రాకపోవడంతో విద్యార్థుల పేద తల్లిదండ్రులు అప్పులు చేసి కళాశాలలకు ఫీజులు కడుతున్నారు. ప్రభుత్వం వద్ద రూ.14వేల కోట్లు ఉంటే ఏం చేయాలి? వీరిని ఆదుకోవాలి కదా? కానీ, వీరికి డబ్బులు ఇచ్చేందుకు సీఎస్‌కు, ఆర్థికశాఖకు చేతులు రావట్లేదు. ప్రభుత్వం మాత్రం నిధులు ఉన్నా విద్యాదీవెనకు విడుదల చేయట్లేదు. ఈ బకాయిలన్నీ కొత్త ప్రభుత్వంపైకి నెట్టేసేందుకే ప్రయత్నిస్తోంది.

Fee Reimbursement Amount Issue
Fee Reimbursement Amount Issue (ETV Bharat)

Fee Reimbursement Amount Issue : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు రాకపోవడంతో విద్యార్థుల పేద తల్లిదండ్రులు అప్పులు చేసి కళాశాలలకు ఫీజులు కడుతున్నారు. ప్రభుత్వం వద్ద రూ.14వేల కోట్లు ఉంటే ఏం చేయాలి? వీరిని ఆదుకోవాలి కదా? కానీ, వీరికి డబ్బులు ఇచ్చేందుకు సీఎస్‌కు, ఆర్థికశాఖకు చేతులు రావట్లేదు.

ఎన్నికల కోడ్‌కు ముందు ఒక విడత విడుదలకు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి బటన్‌ నొక్కారు. ఆ డబ్బులైనా వస్తాయనుకుంటే అవీ ఇవ్వడం లేదు. పోలింగ్‌ ముగియడంతో ఇక వారితో పనేముందని అనుకుంటున్నారేమో గానీ, పేదలు అప్పులు చేసి ఫీజులు కడుతున్నా అధికార యంత్రాంగం మనసు కరగడం లేదు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తుందనే ఆశతో పిల్లల్ని ఉన్నత విద్యలో చేర్పించారు. విద్యా సంవత్సరం ముగియడంతో ఫీజు మొత్తం చెల్లించాలని కళాశాలలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం నిధులు ఉన్నా విద్యాదీవెనకు విడుదల చేయట్లేదు. ఈ బకాయిలన్నీ కొత్త ప్రభుత్వంపైకి నెట్టేసేందుకే ప్రయత్నిస్తోంది. పీజీ కోర్సుల బకాయిలు రూ.450 కోట్ల వరకు ఉన్నాయి. డబ్బులు లేక చాలామంది పీజీ విద్యార్థులు సర్టిఫికెట్లు కళాశాలల్లోనే వదిలేశారు.

No PG Admissions: ఉన్నత విద్యకు ‘ఉరి’.. పడిపోయిన పీజీ ప్రవేశాలు.. మాటలు తప్ప చేతలు చూపించని వైసీపీ సర్కారు

కొత్త ప్రభుత్వంపైనే భారం : 2023-24 విద్యా సంవత్సరానికి నాలుగు త్రైమాసికాలుగా ఫీజులను విడుదల చేయాల్సి ఉండగా ఫిబ్రవరిలో సీఎం జగన్‌ ఒక విడతకు బటన్‌ నొక్కారు. ఈ డబ్బులూ తల్లుల ఖాతాల్లో పడలేదు. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. విద్యాసంవత్సరం ముగిసింది. దీంతో నాలుగు త్రైమాసికాలకు కలిపి రూ.2,832 కోట్ల భారం జూన్‌ 4 తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వంపైనే పడుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద గత ప్రభుత్వాలు ఫీజుల డబ్బులను నేరుగా కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లో వేసేవి. కానీ, తల్లుల ఖాతాల్లో వేసే విధానాన్ని జగన్‌ తెచ్చారు.

పీజీ బిల్లులు చెల్లించకుండా ఒత్తిడి : పీజీ కోర్సులకు ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల చెల్లింపు పథకాన్ని 2020-21 నుంచి జగన్‌ ప్రభుత్వం నిలిపివేసింది. పీజీ కళాశాలలకు చెల్లించాల్సిన రూ.450 కోట్లు చెల్లించకుండా వన్‌టైం సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించింది. బకాయిల్లో 75% ఇస్తామని, దీనికే అంగీకరించాలంటూ వారిపై ఒత్తిడి చేసింది. ఈ మొత్తం చాలని, దీనిపై న్యాయస్థానాలకు వెళ్లబోమని యాజమాన్యాల నుంచి లేఖలు తీసుకుంది. కానీ, 75% కూడా ఇవ్వలేదు.

వసతి దీవెన ఇవ్వలేదు : వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, వైద్య తదితర కోర్సులకు రూ.20వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా, ఇవ్వలేదు. ట్రిపుల్‌ఐటీల్లో చదివే విద్యార్థుల నుంచి ప్రభుత్వమే హాస్టల్‌ డబ్బులను ముక్కుపిండి వసూలు చేస్తోంది. ట్రిపుల్‌ ఐటీల్లో వసతి దీవెన మొత్తం చాలదని, విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. వీటిల్లో చదివేవారు అందరూ పేదలే.

Jagananna Vidya Devena Scheme: జగనన్న విద్యాదీవెన అందక.. ఫీజులు చెల్లించలేక

ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్‌ : విద్యా దీవెన డబ్బులు ఇవ్వకపోవడంతో కళాశాలకు ఫీజులు కట్టలేక విశాఖపట్నం పీఎంపాలెంలో ఓ విద్యార్థిని తల్లి ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్న కుమార్తె ఫీజు రూ.25వేలు బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లిస్తేనే హాల్‌టికెట్‌ ఇస్తామని యాజమాన్యం చెప్పింది. కుమార్తె ఆవేదన చూడలేక తల్లి కళాశాల ఆవరణలోనే చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రభుత్వం ఫీజులు జమచేశాక కడతామని చెప్పినా యాజమాన్యం అంగీకరించకపోవడంతో నెల్లూరులో నర్సింగ్‌ విద్యార్థులు ఆందోళన చేశారు.

అప్పులు చేసి ఫీజులు కట్టారు : ఏలూరు జిల్లాలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలో కన్వీనర్‌ కోటా, జేఎన్‌టీయూ వర్సిటీ కామన్‌ ఫీజు కట్టాలని యాజమాన్యం విద్యార్థులకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. సకాలంలో చెల్లించకుంటే పరీక్షకు అనుమతించబోమని హెచ్చరించింది. విజయవాడకు చెందిన ఓ విద్యార్థి ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. మొత్తం ఫీజు చెల్లిస్తేనే చివరి సెమిస్టర్‌ పరీక్షలకు అనుమతిస్తామని హెచ్చరించడంతో అప్పు చేసి, రూ.70వేలు కట్టారు.

నాడు గొప్పలు, నేడు తిప్పలు - ఫీజులన్నీ బకాయి పెట్టిన జగన్ సర్కార్ - Jagananna Vidya Devena Scheme

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.