ETV Bharat / state

No PG Admissions: ఉన్నత విద్యకు ‘ఉరి’.. పడిపోయిన పీజీ ప్రవేశాలు.. మాటలు తప్ప చేతలు చూపించని వైసీపీ సర్కారు

author img

By

Published : Jul 26, 2023, 11:07 AM IST

YSRCP Negligence on Higher Education: విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు విద్యార్థులే లేకపోతే.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు ఎలా వస్తాయి?. ప్రత్యేకంగా నిధులు ఇవ్వకుండా.. వర్సిటీలు ఎలా అభివృద్ధి చెందుతాయి?. మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆర్ట్స్, ఇతర కోర్సుల్లో మార్పులు చేయకపోతే విద్యార్థులెలా చేరతారు?. రాష్ట్రంలో ఉన్నత విద్యాపరంగా అసలేం జరుగుతోందో ముఖ్యమంత్రి జగన్‌కు తెలుసా? సమీక్షల్లో నాలుగు మాటలు గొప్పగా చెప్పేసి.. పనైపోయిందనుకుంటే ఉన్నత విద్య విరాజిల్లిపోతుందా?.

higher education
higher education

YSRCP Negligence on Higher Education: "విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రభుత్వ కళాశాలల్లోనూ ఫీజు రీయింబర్స్‌ చేస్తాం. అవి ఆర్థికంగా స్వయంసమృద్ధి చెందుతాయి. విదేశాల్లో అందిస్తున్న కోర్సులను పరిశీలించి, వాటిని ఇక్కడి వారికి అందుబాటులోకి తీసుకురావాలి. ప్రఖ్యాత కళాశాలల పాఠ్యప్రణాళిక మన దగ్గర అమలయ్యేలా చూడాలి. పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులను తీసుకురావాలి." ఇవి.. 2021 అక్టోబరు 25న ఉన్నత విద్య సమీక్షల్లో సీఎం జగన్‌ గారి మాటలు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే.. మీరేం చేస్తారో నాకు తెలియదు. దిగువ స్థితిలో ఉన్న అన్ని కళాశాలలు ఉన్నత స్థితికి వెళ్లిపోవాలి అంటూ ఎంత గొప్పగా చెప్పారో.. అదే విధంగా ఈ నెల 13న జరిగిన ఉపకులపతుల సమావేశంలో ఏమన్నారో అవి కూడా తెలుసుకుందాం...

ఈ నెల 13న ఉపకులపతుల సమావేశంలోనూ.. మనం ఉన్నత విద్యలో దిగవ స్థాయిలో ఉన్నాం.. పై స్థాయికి వెళ్లడాకిని మనమందరం కలసి పరిష్కారాలను కనుక్కోవాలని సెలవిచ్చారు. ఈ మాటలు విన్నవారు ఎవరైనా సీఎం నిజంగానే విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని అనుకుంటారు. వాస్తవానికి వైసీపీ సర్కారు ఉన్నత విద్యను గాలికొదిలేయడంతో.. సాధారణ పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పడిపోతోంది.

ప్రైవేటు కాలేజీల్లో పీజీ కోర్సుల్లో చేరేవారికి బోధన రుసుముల చెల్లింపును ఆపేసి, ఎస్సీ, పేదవారిని ఉన్నత చదువులకు దూరం చేసింది. మరోపక్క మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా కోర్సుల్లో మార్పులనూ తీసుకురాలేక.. యువత ఆశలను ఆవిరి చేసింది. రాష్ట్రంలో ఆర్ట్స్ కోర్సులకు సంబంధించి గొప్ప కళాశాల ఒక్కటీ లేదంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఉపాధి, ఉద్యోగాలను కల్పించలేని పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులెవరూ ముందుకు రావటం లేదు. ఈ కారణం చూపించి వాటిని మూసేస్తున్నారు. చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజనీతిశాస్త్రం లాంటి సబ్జెక్టులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం, వర్సిటీలు అసలేమాత్రం పట్టించుకోలేదు. ఇటీవల ఉపకులపతుల సమావేశంలో సీఎం జగన్ మాత్రం.. కృత్రిమ మేథ తీసుకురావాలని, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వర్సిటీల విధానాలను పాటించాలంటూ మాటలు ఊదరగొట్టారు.

దిల్లీలోని శ్రీరామ్ కళాశాల, హిందూ కళాశాల, చెన్నైలోని లయోల, జాదవ్పూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా, పుణెలోని సింబియోసిస్ కళాశాల ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ లాంటి ప్రముఖ కళాశాలల్లో ఆర్ట్స్ గ్రూపులకు ఎంతో ఆదరణ ఉంది. ఇక్కడ చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. కానీ, మన వర్సిటీల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పీజీ కోర్సులకు డిమాండ్ పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. చివరకు సీట్లిస్తాం చేరండంటూ విద్యార్థులను బతిమలాడుకునే స్థితికి చేరుకుంది.ఉన్నత విద్యామండలి సైతం వీడియోలు రూపొందించి ప్రచారం చేస్తున్నా.. విద్యార్థుల నుంచి స్పందన రాలేదు. విశ్వవిద్యాలయాల్లో 71శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్ర వర్సిటీలో రాజనీతిశాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులకు రెగ్యులర్ అధ్యాపకులు లేని దుస్థితి.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రైవేటు కళాశాలల్లో PG కోర్సులకు బోధన రుసుముల చెల్లింపును 2020-21 నుంచి నిలిపేసింది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్ కోటాలో చేరే వారికి మాత్రమే చెల్లిస్తోంది. SC, STలు, నిరుపేద వర్గాల వారు ఫీజులు చెల్లించలేక... కోరుకున్న కోర్సు వర్సిటీల్లో లేక.. PGకి దూరమైపోతున్నారు. 2021లో 40 వేల మంది దరఖాస్తు చేస్తే ఈ ఏడాది 30 వేలకు పడిపోయింది. గతేడాది పీజీ కోర్సుల్లో 44వేల 463 సీట్లు ఉంటే.. 37 శాతమే అంటే 16వేల 252 మాత్రమే నిండాయి. 2022-23లో ద్రవిడ విశ్వవిద్యాలయంలో సోషల్ వర్క్​లో ముగ్గురు, స్టాటిస్టిక్స్ కోర్సులో ఐదుగురు మాత్రమే చేరారు. చాలా విశ్వవిద్యాలయాల్లోని ఆర్ట్స్ గ్రూపుల్లో ఇదే పరిస్థితి.

గతంలో వర్సిటీలే సొంతంగా ఎంట్రన్స్​ టెస్ట్​ నిర్వహించి, సకాలంలో ప్రవేశాలు పూర్తి చేసేవి. మూడు సంవత్సరాలుగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష పేరుతో కౌన్సెలింగ్ జాప్యమవుతోంది. ఇది ప్రవేశాలపై ప్రభావం చూపుతోంది. ఇతర రాష్ట్రాల్లో కొన్ని కాలేజీల్లో ఆర్ట్స్ చదివినవారికీ క్యాంపల్​ ప్లేస్​మెంట్స్​ లభిస్తున్నాయి. కానీ రాష్ట్రంలో ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేకుండా పోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.