ETV Bharat / state

Jagananna Vidya Devena Scheme: జగనన్న విద్యాదీవెన అందక.. ఫీజులు చెల్లించలేక

author img

By

Published : May 21, 2023, 9:39 AM IST

Jagananna Vidya Devena Scheme
జగనన్న విద్యాదీవెన పథకం

Jagananna Vidya Devena Scheme: దేశంలో ఎక్కడా లేనివిధంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నామని సీఎం జగన్​ ఆర్భాటాలు పలుకుతున్నారు. పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని అంటున్నారు. అయితే ప్రభుత్వం సకాలంలో జగనన్న విద్యాదీవెన ఫీజుల డబ్బులు ఇవ్వడం లేదని, 2022-23 సంవత్సరానికి ఒక్క విడత ఫీజు మాత్రమే ఇచ్చిందని విద్యార్థులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కళాశాలల యాజమాన్యాలు మాత్రం విద్యా సంవత్సరం పూర్తయినందున మొత్తం ఫీజు చెల్లించాలని అడుగుతున్నాయని, మొత్తం ఒకేసారి చెల్లించాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని వాపోతున్నారు.

జగనన్న విద్యాదీవెన పథకం

Jagananna Vidya Devena Scheme: 'జగనన్న విద్యా దీవెన' కింద పూర్తిగా ఫీజులు చెల్లిస్తున్నామని ప్రతి సభలోనూ ఆర్భాటం చేస్తున్న సీఎం జగన్‌.. వాటిని సకాలంలో చెల్లించడం లేదు. బీటెక్‌ నాలుగో ఏడాది విద్యా సంవత్సరం పూర్తయినా ఇంతవరకు ఒకే ఒక్క త్రైమాసిక ఫీజు విడుదల చేశారు. మూడు విడతలు పెండింగ్‌లో పెట్టారు. చదువు పూర్తయిన విద్యార్థులు అప్పులు చేసి, సొంతంగా ఫీజులు కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. 'తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం. కళాశాలలను పరిశీలించి, ఫీజులు చెల్లించాలి' అని సీఎం జగన్‌ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. అసలు డబ్బులే ఇవ్వకపోతే తల్లులు ఎలా చెల్లిస్తారు? డిగ్రీ మూడో ఏడాది ఆరో సెమిస్టర్‌ మరో నెల రోజుల్లో ముగియనుంది. ప్రభుత్వం మొత్తం ఫీజు ఇవ్వకపోతే విద్యార్థుల పరిస్థితి ఏంటి? కళాశాలలు ఎలా కొనసాగుతాయి? అనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జగనన్న విద్యా దీవెన కింద మూడు త్రైమాసికాలకు కలిపి 9.86 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.2,096 కోట్లు చెల్లించాల్సి ఉంది.

డబ్బులిస్తేనే ధ్రువపత్రం..: ఉన్నత విద్యాశాఖ ఉమ్మడి అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏప్రిల్‌ 24తో బీటెక్‌ నాలుగో ఏడాది ముగిసింది. స్వయం ప్రతిపత్తి కళాశాలలూ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ఇచ్చేశాయి. విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలలకూ పరీక్షలు పూర్తయ్యాయి. చాలా మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సంపాదించారు. ఉద్యోగాల్లో చేరాలంటే కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్‌ కావాలి. డబ్బులు చెల్లిస్తేనే ధ్రువపత్రం ఇస్తామని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరో మార్గం లేక పేదవారు అప్పులు చేసి, ఫీజులు చెల్లిస్తున్నారు. రూ.70 వేల ఫీజు ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థికి ఒక్క విడతగా రూ.17,500 ప్రభుత్వం విడుదల చేసింది. కళాశాలలు ధ్రువపత్రాలు ఇవ్వాలంటే ఇప్పుడు ఒకేసారి రూ.52,500 చెల్లించాలి. ఇంత మొత్తం ఒకేసారి చెల్లించాల్సి రావడం పేదవారికి ఆర్థిక భారంగా మారింది. మరోవైపు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీ అధికారులే విద్యార్థులను ఫీజులు అడగడంతో వారంతా ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

రూ.600 కోట్లు ఎగవేత..: ఇంజినీరింగ్‌తోపాటు ఇతర విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరంలో నాలుగో త్రైమాసికం బోధన రుసుములను ప్రభుత్వం చెల్లించలేదు. కరోనా మహమ్మారి కారణంగా తరగతులు నిర్వహించలేదని, సుమారు రూ.600 కోట్లు ఎగవేసింది. ఆన్‌లైన్‌, తరగతుల్లో సిలబస్‌ పూర్తి చేసినందున ఫీజులు చెల్లించాల్సిందేనని యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూలు చేసుకున్నాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.600 కోట్ల భారం పడింది.

ప్రభుత్వం ఇస్తున్న 'వసతి దీవెన'పై నమ్మకం లేని కళాశాలలు హాస్టల్‌ ఫీజులనూ విద్యార్థుల నుంచి నెలనెలా వసూలు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఏడాది రూ.20 వేలు ఇస్తుండగా.. కళాశాలలు రూ.30 వేల నుంచి రూ.40 వేలు తీసుకుంటున్నాయి. మిగతా మొత్తం విద్యార్థులే చెల్లించాల్సి వస్తోంది.

బెదిరించి సెటిల్‌మెంట్‌..: పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల బకాయిలను 75 శాతమే చెల్లిస్తామంటూ ప్రభుత్వం యాజమాన్యాలను బెదిరిస్తోంది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదివే వారికి 2020-21 నుంచి ఎలాగూ బోధన రుసుములు చెల్లించడం లేదు. పాత బకాయిలు రూ.450 కోట్లు ఉంటే ఇవీ ఇవ్వకుండా నాలుగేళ్లుగా జాప్యం చేసి.. ఇప్పుడు వన్‌టైం సెటిల్‌మెంట్‌ చేస్తోంది. ఇందుకు యాజమాన్యాలను బెదిరించి ఆ బకాయిలో 75శాతమే ఇస్తామని చెప్పి, భవిష్యత్తులో దీనిపై కోర్టుకూ వెళ్లబోమనే హామీ పత్రాలు రాయించుకుంటోంది. 'డబ్బులు కావాలంటే అంగీకారపత్రం ఇవ్వాలని ప్రభుత్వం బెదిరిస్తోంది. పిల్లలకు చదువు చెప్పిన వారినే బెదిరింపులకు గురి చేయడం అన్యాయం' అని యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.