కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత - తెలంగాణకు తీవ్ర నష్టం : బీఆర్ఎస్ ఎంపీలు
Published : Feb 2, 2024, 2:31 PM IST
BRS MPs Meet Union Minister Gajendra Singh Shekhawat : దిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను బీఆర్ఎస్ ఎంపీల బృందం కలిసింది. కృష్ణా నదిపై ఉన్న రెండు కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్ను కేఆర్ఎంబీకి అప్పగించడంపై నిరసన తెలిపింది. తమకు ఉన్న అభ్యంతరాలు తెలియజేస్తూ షెకావత్కు లేఖ అందించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం నిర్ణయం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టమని పేర్కొంది. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది. అదేవిధంగా కృష్ణా ట్రైబ్యునల్లో విచారణ పూర్తయ్యేవరకు ఇరు రాష్ట్రాలకు 50:50 పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని షెకావత్కు విజ్ఞప్తి చేసింది.
కేఆర్ఎంబీ వల్ల తెలంగాణకు జరిగే నష్టాలను కేంద్ర మంత్రి షెకావత్కు వివరించామని బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామ నాగేశ్వరరావు తెలిపారు. అందుకు ఆయన ఇరు ప్రభుత్వాలు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు ఇచ్చేందుకు ఒప్పుకొన్నాయని పేర్కొన్నారు. కానీ తాము దీని వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని వారికి వివరించామని చెప్పారు. అందువల్ల బీఆర్ఎస్ ఎంపీలు ఇచ్చిన లేఖపై కూడా ఆలోచన చేయాలని షెకావత్ను కోరినట్లు వెల్లడించారు. ఈ విషయంపై పార్లమెంట్ కూడా పోరాడుతామని నామ నాగేశ్వరరావు వివరించారు.