ETV Bharat / state

వడదెబ్బ నుంచి రక్షించుకునేందుకు ఎన్‌సీడీసీ మార్గదర్శకాలు పాటించండి : ఈఎస్ఐసీ - NCDC GUIDELINES ON SUN STROKE

author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 9:02 AM IST

High Temperatures in India : దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. దీనికితోడూ ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు ఈఎస్‌ఐసీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎన్‌సీడీసీ మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.

High temperatures in india 2024
High temperatures in india 2024 (Etv Bharat)

Temperature Rises in India 2024 : దేశంలో వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. ఉదయం 9 దాటకముందే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఈ క్రమంలో కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్‌ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఆదేశాలు ఇచ్చింది. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) మార్గదర్శకాల మేరకు డిస్పెన్సరీలు, ఆసుపత్రుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. వడదెబ్బ బాధితులకు సత్వర చికిత్సలు అందించాలని సూచనలు చేసింది. మార్చి 1 నుంచి ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో నమోదైన వడదెబ్బ కేసులు, చికిత్సలు, మృతుల వివరాలను నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ అండ్‌ హ్యూమన్‌హెల్త్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని పేర్కొంది.

నిప్పులు కురిపిస్తున్న భానుడు - ఆల్‌టైం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు - high temperatures in telangana

ఈ లక్షణాలు కనిపిస్తే : వడదెబ్బకు గురైనప్పుడు పెద్దల్లో ఆందోళన, చిరాకు, మూర్ఛ, అయోమయం, గందరగోళం, కోమా లక్షణాలు, శరీరం వేడిగా, చర్మం ఎర్రగా, తేమలేకుండా మారడం, శరీర ఉష్ణోగ్రత 104 ఫారన్‌హీట్‌కు మించి నమోదు కావడం లాంటివి ఉంటాయి. అలాగే తలనొప్పి, ఆందోళన, తిమ్మిరి, వికారం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాల బలహీనత, వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నారులు ఆహారం తీసుకోవడానికి నిరాకరించడం, నోరు పొడిబారడం, బద్ధకం, మూర్ఛ, చికాకు, మూత్రం సరిగా రాకపోవడం, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.

ఎన్‌సీడీసీ మార్గదర్శకాలివీ :

  • ఈఎస్‌ఐ ఆసుపత్రులకు నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగేలా చూడాలి. ఆసుపత్రుల లోపల వేడిని తగ్గించేలా పైకప్పు గ్రీన్‌ రూఫ్‌, విండోషెడ్‌, కూలింగ్‌ రూఫ్‌ ఏర్పాటు తదితర చర్యలు తీసుకోవాలి. చికిత్స వార్డులు, వెయిటింగ్‌ ప్రాంతాలు చల్లగా ఉండేలా పరికరాలు నిరంతరం పనిచేస్తూ ఉండాలి.
  • వడదెబ్బకు గురైన వ్యక్తులను వెంటనే గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందించాలి. ఐవీఫ్లూయిడ్స్‌, ఐస్‌ప్యాక్స్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అవసరమైన ఇతర పరికరాలు అందుబాటులో ఉంచాలి. అన్ని ఆసుపత్రుల్లో తగినంత తాగునీరు ఉండాలి.
  • వడదెబ్బకు గురైన వ్యక్తులకు ప్రాథమిక చికిత్స అందించి, ఇతర ఆసుపత్రులకు తరలించే సమయంలో అంబులెన్స్‌లలో ఐస్‌ప్యాక్స్‌, చల్లటినీరు, ఇతర వసతులు ఉండేలా చూడాలి.
  • వాతావరణ విభాగం సూచనలను పాటించాలి. వడగాల్పుల సమయంలో బాహ్యప్రదేశాల్లో వేడుకలు, సమావేశాలు నిర్వహించకూడదు.
  • ఉద్యోగులు, కార్మికులకు పనిప్రదేశాల్లో చల్లటి తాగునీరు అందించాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఉద్యోగులు ఒకకప్పు తాగునీరు తాగాలి. ఒకవేళ ఎండలో పనిచేసే కార్మికులు ప్రతి గంటకు ఐదు నిమిషాల పాటు విశ్రాంతిని తీసుకోవాలి.
  • వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లటి ప్రదేశానికి వెళ్లాలి. ద్రవపదార్థాలు తీసుకోవాలి.

నీటి సంక్షోభానికి తప్పదు భారీ మూల్యం - అందుకు పొదుపే కావాలి ఓ పాఠం! - Water Crisis in India

రాష్ట్రంలో నాల్గో రోజూ 46 డిగ్రీలు దాటిన ఎండలు - వడదెబ్బతో ఆరుగురి మృత్యువాత - Heat Waves in Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.