ETV Bharat / state

గ్రేటర్​లో మరో 25 మంది కార్పొరేటర్లపై కాంగ్రెస్​ ఫోకస్​ - టార్గెట్​ రీచ్​ అయితే 4 ఎంపీ సీట్లు పక్కా!

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 7:54 AM IST

రాష్ట్ర రాజధానిలో అధికార పార్టీ తన బలం పెంచుకునేందుకు బల్దియాపై గురి పెట్టింది. లోక్ సభ ఎన్నికల్లోపు బీఆర్​ఎస్​, బీజేపీ నుంచి వీలైనంత మంది కార్పొరేటర్లను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఇటీవలే జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్ దంపతులతోపాటు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హస్తం గూటికి చేరగా తాజాగా డిప్యూటీ మేయర్ శ్రీలత దంపతులు కూడా బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ వారం పదిరోజుల్లో మరో పాతిక మంది కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరుతారని నేతలు భావిస్తున్నారు. మరోవైపు తమ కార్పొరేటర్లను చేజార్చుకోకుండా బీఆర్​ఎస్​ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Congress Joinings
GHMC BRS Corporators Joining in Congress

మరో పాతిక మంది కార్పొరేటర్లపై కాంగ్రెస్​ ఫోకస్​ టార్గెట్​ రీచ్​ అయిత్ 4 ఎంపీ సీట్లు పక్కా

GHMC BRS Corporators Joining in Congress : గ్రేటర్ హైదరాబాద్‌లో అధికార, విపక్ష పార్టీల లెక్కలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాజధానిలో ఊహించని ఫలితాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​పై గట్టిగానే గురిపెట్టింది. ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయిలో మంతనాలు సాగిస్తూ బీఆర్​ఎస్​ను బలహీనపర్చేందుకు పావులు కదుపుతోంది.

2020లో గ్రేటర్​లోని 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో బీఆర్​ఎస్ ​- 55, బీజేపీ - 48, ఎంఐఎం - 44 డివిజన్లలో గెలుపొందాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఏఎస్ రావు నగర్, ఉప్పల్, లింగోజిగూడ ఈ 3 చోట్ల మాత్రమే గెలిచింది. అందులో ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ బీఆర్​ఎస్​లోకి వెళ్లడంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 2కు పడిపోయింది.

56 స్థానాల్లో గెలిచిన బీఆర్​ఎస్​, ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవానికి అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. బల్దియాపై పూర్తి పట్టు కోల్పోయిన కాంగ్రెస్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్​లో ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 29 స్థానాలకు మూడింట మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఖైరతాబాద్ బీఆర్​ఎస్​ కార్పొరేటర్ విజయారెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్​లు బీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యేల టికెట్లు ఆశించి భంగపడ్డారు. దాంతో కాంగ్రెస్​లో చేరి టికెట్ దక్కించుకున్నా గెలవలేకపోయారు.

కాంగ్రెస్​లోకి కొనసాగుతున్న వలసలు - బీఆర్ఎస్​కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా

ఈ పరిణామాలతో లోక్​సభ ఎన్నికల్లోపు గ్రేటర్​లో పార్టీని బలోపేతం చేసుకోకపోతే 4 ఎంపీ స్థానాలపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ సీనియర్లు అంచనా వేశారు. అందుకే ముందస్తుగా బీఆర్​ఎస్​, బీజేపీ కార్పొరేటర్లను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ తలుపులు తెరిచారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖైరతాబాద్, మాదాపూర్, హఫీజ్ పేట, రహ్మత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ల చేరికతో బల్దియాలో కాంగ్రెస్​కు 6 సీట్లు (Congress Joinings) పెరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వివిధ స్థాయిల్లో ఉన్న అగ్రనేతల సంప్రదింపులు, బీఆర్​ఎస్​ అధిష్ఠానంపై అసంతృప్తితో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్​తో పాటు ఆయన సతీమణి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి హస్తం గూటికి చేరారు.

అలాగే బోరబండ బీఆర్​ఎస్​ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పది రోజుల వ్యవధిలోనే జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్, తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతతో పాటు (Corporator Mothe Srilatha) బీఆర్​ఎస్​ కార్మిక విభాగం అధ్యక్షుడు శోభన్ రెడ్డి బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరారు. దీంతో గ్రేటర్​లో బీఆర్​ఎస్​ తేనెతుట్టె మరోసారి కదిలినట్టైంది. ఆరుగురు కార్పొరేటర్లు కాస్తా ఇప్పుడు తొమ్మిది మందయ్యారు.

కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు

తెలంగాణ ఉద్యమంలో ఉండి పార్టీ కోసం పని చేసిన వాళ్లకు తగిన గుర్తింపు లేకపోవడం వల్లే తన భర్తతో కలిసి పార్టీ మారుతున్నట్లు డిప్యూటీ మేయర్ శ్రీలత తెలిపారు. బీఆర్​ఎస్​లో అవమానాలు ఎదుర్కొంటూ ఇబ్బందులకు గురవుతున్న నాయకులు స్వేచ్ఛగా తమ పార్టీలో చేరవచ్చని హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

గ్రేటర్‌లోని బీఆర్​ఎస్​, బీజేపీ నుంచి మరికొంత మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్​లో చేరితే తామంతా అదే పార్టీలోకి వెళ్తామనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. సమీప భవిష్యత్​లో గ్రేటర్​లోని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే, బీఆర్​ఎస్​ నుంచి పెద్ద ఎత్తున కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్​తోనూ కొంతమంది కార్పొరేటర్లు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వారి చేరికల బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొంతు రామ్మోహన్​కు అప్పగించినట్లు బల్దియాలో జోరుగా చర్చించుకుంటున్నారు.

కారు జస్ట్ సర్వీసింగ్​కు వెళ్లింది - త్వరలో జెట్​ స్పీడ్​లో దూసుకొస్తుంది : కేటీఆర్​

ఇటీవల మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Mayor Gadwala Vijayalakshmi) కూడా సీఎంను కలవడంపై పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని మేయర్ ఖండిస్తూ తాను బీఆర్​ఎస్​లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అలాగే పలు డివిజన్లలో జనంపై పట్టుకోసం బీఆర్​ఎస్​ నేతలపై కూడా కాంగ్రెస్ కన్నేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో అత్యధిక స్థానాలు గెలుచుకొని గ్రేటర్​లో పరువు నిలబెట్టుకున్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు చేజారకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

KTR Meet With BRS Corporators : నగర కార్పొరేటర్లతో బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్​లో సమావేశమై దిశానిర్దేశం చేశారు. అయినా కూడా కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో రాజధానిలో బీఆర్​ఎస్​ బలం తగ్గుముఖం పడుతోంది. 56 మంది కార్పొరేటర్లకు గానూ 47 మంది కార్పొరేటర్లు మిగిలారు. వారిలో కనీసం పాతిక మందిని తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచించింది. ఈ నెల 27న చేవెళ్లలో జరిగే సభలో కనీసం 10 మంది కార్పొరేటర్లు ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తమ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో చేరనున్న జీహెచ్‌ఎంసీ ఉప మేయర్‌ శ్రీలతా రెడ్డి దంపతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.