Lok Sabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వంద మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 17 పార్లమెంటు స్థానాల్లో 525 మంది పోటీలో నిలిచారు. మల్కాజిగిరిలో అత్యధికంగా 15 మంది, భువనగిరిలో 12, మెదక్, నల్గొండలో తొమ్మిది మంది, హైదరాబాద్లో ఎనిమిది మంది, పెద్దపల్లి, జహీరాబాద్లో ఏడుగురు, వరంగల్, ఖమ్మంలో ఆరుగురు, కరీంనగర్లో ఐదుగురు, మహబూబ్నగర్లో నలుగురు, నిజామాబాద్, చేవెళ్లలో ముగ్గురు, నాగర్కర్నూలు, మహబూబాబాద్లో ఇద్దరు, ఆదిలాబాద్, సికింద్రాబాద్ లో ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు.
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది, అతితక్కువగా ఆదిలాబాద్లో 12 మంది పోటీలో ఉన్నారు. పెద్దపల్లిలో 42, కరీంనగర్లో 28, నిజామాబాద్లో 29, జహీరాబాద్లో 19, మెదక్లో 44, మల్కాజిగిరిలో 22, హైదరాబాద్లో 30, చేవెళ్లలో 43, మహబూబ్నగర్లో 31, నాగర్కర్నూలులో 19, నల్గొండలో 22, భువనగిరిలో 39, వరంగల్ లో 42, మహబూబాబాద్ లో 23, ఖమ్మంలో 35 మంది లోక్సభ బరిలో ఉన్నారు.
CEO Vikas Raj on Polling Arrangements : మరోవైపు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గతేడాది నవంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన కేంద్రాల్లోనే ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు.
ఎన్నికల వేళ రాష్ట్రానికి చేరుకున్న బలగాలు: రాష్ట్రానికి ఎన్నికల కారణంగా 155 కంపెనీల సాయుధ బలగాలు వచ్చాయని మరో 50 కంపెనీలను కేటాయించాలని కోరినట్లు వివరించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 375 కంపెనీల బలగాలు వచ్చాయని తెలిపారు. ఈ దఫా దేశవ్యాప్తంగా వివిధ దశల్లో పోలింగ్ జరగనుండటంతో వాటి సంఖ్య తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 60 వేల యూనిఫాం సర్వీసు ఉద్యోగులతో పాటు, పక్క రాష్ట్రాల నుంచి 20 వేల పోలీసు బలగాలు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు.
నకిలీ ఓట్లపై ఈసీ ఫోకస్- హైదరాబాద్లో ఎన్ని ఓట్లు తొలగించారంటే? - telangana election commission