ETV Bharat / politics

బీఆర్ఎస్​తో పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 సీట్లు - నాగర్​కర్నూల్​ ఎంపీ అభ్యర్థిగా ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 11:30 AM IST

Updated : Mar 15, 2024, 12:39 PM IST

BSP 2 MP Seats in Telangana 2024
BSP 2 MP Seats in Telangana 2024

BSP 2 MP Seats in Telangana : లోక్​సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్, బీఎస్పీలు సీట్లపై స్పష్టతకు వచ్చాయి. పొత్తులో భాగంగా బీఎస్పీకి హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు నియోజకవర్గ సీట్లను కేటాయించినట్లు గులాబీ బాస్ కేసీఆర్ తెలిపారు.

BSP 2 MP Seats in Telangana 2024 : లోక్​సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి, బహుజన సమాజ్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఇందులో భాగంగా బీఎస్పీకి రెండు ఎంపీ స్థానాలను కేటాయించారు. ఇరు పార్టీల నేతల చర్చల అనంతరం పొత్తుపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్​సభ స్థానాలను బీఎస్పీకి కేటాయించారు. ఈ మేరకు బీఎస్పీకి రెండు స్థానాలను కేటాయించినట్లు బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్​ స్థానం నుంచి ఎవరు బరిలో దిగనున్నారో తెలియాల్సి ఉంది. పార్టీ పోటీ చేసే రెండు స్థానాల్లో అభ్యర్థులను బీఎస్పీ త్వరలోనే ఖరారు చేయనుంది.

మా పొత్తు చారిత్రాత్మక అవసరం : భారత్ రాష్ట్ర సమితి​ - బహుజన సమాజ్​ పార్టీలు అన్ని లోక్‌సభ స్థానాల్లో పూర్తి పరస్పర సహకారంతో, విజయం దిశగా పయనించబోతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి అనుమతించిన బీఎస్‌స్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం మాయావతి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు 'ఎక్స్‌' వేదికగా ఆయన ఈ పొత్తు నిర్ణయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, దేశంలో బహుజనుల రక్షణ కోసం ఈ పొత్తు ఒక చారిత్రాత్మక అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈ లౌకిక కూటమి నిస్సందేహంగా విజయ దుందుభి మోగించబోతుందని ఆర్‌ఎస్‌పీ ధీమా వ్యక్తం చేశారు.

RS Praveen Kumar Nagar Kurnool MP Seat : భారతి రాష్ట్ర సమితి​-బహుజన సమాజ్​ పార్టీల పొత్తుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి స్పందించారు. అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలోనే నాగర్​కర్నూల్ బీఆర్​ఎస్​, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగనున్నారని ఆయన వెల్లడించారు. ఆర్ఎస్​పీ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు. పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, హక్కులు కాపాడుకోవడానికి ఈ పొత్తు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

'రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీఆర్​ఎస్​తో పొత్తు - వారంతా మా కూటమిని నిందించడం హాస్యాస్పదం'

కాంగ్రెస్​ తీరు సిగ్గుచేటు : 100 రోజుల కాంగ్రెస్ అసమర్థ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీ అటకెక్కిందని, రైతు భరోసా ఆగిపోయిందని దుయ్యబట్టారు. మహిళలకు ప్రతి నెలా రూ.2500, నిరుద్యోగులకు రూ.4000 భృతి పథకాల ఊసెత్తడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేసి, తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. రేవంత్​ పాలనలో సాగునీళ్లు ఆగిపోయాయని, తాగునీళ్లకు కరవొచ్చిందని అన్నారు.

'బీఆర్​ఎస్​ నేతలనే చేర్చుకుని అభ్యర్థులు ప్రకటించే దుస్థితికి బీజేపీ, కాంగ్రెస్​ వచ్చాయి'

కేసీఆర్​కు గిఫ్ట్​గా ఇస్తాం : రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయం లేదని, అంతర్గత కలహాలతో కాంగ్రెస్ సతమతం అవుతోందని నిరంజన్​రెడ్డి ఆరోపించారు. మంత్రులు, ముఖ్యమంత్రి పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలను అయోమయంలో పడేస్తున్నారన్నారు. కరెంట్ కోతలతో రైతులు తల్లడిల్లుతున్నారని, అర్ధరాత్రి కరెంటు కోసం రైతులు నిద్ర కాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ మళ్లీ తీసుకొచ్చిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ తెచ్చిన ఈ మార్పులను గడప గడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​తోనే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోగలమని, నాగర్​కర్నూల్ ఎంపీ స్థానాన్ని గెలిపించి కేసీఆర్​కు బహుమతిగా ఇస్తామని స్పష్టం చేశారు.

దేశంలో లౌకికత్వాన్ని కాపాడాలనే బీఆర్​ఎస్​తో పొత్తు : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

Last Updated :Mar 15, 2024, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.