Energy Week Goa Modi Speech : భారత్లో ప్రాథమిక ఇంధన డిమాండ్ 2045 నాటికి రెట్టింపు కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇంతకుముందెన్నడు లేనంతగా, ఇంధన రంగంలో పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఐదారేళ్లలో ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్ చూడదనుందని, అందువల్ల భారత్ వృద్ధిలో భాగస్వాములు కావాలంటూ పెట్టుబడిదారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ రెండో ఎడిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ, గత పదేళ్లలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ 1.5 శాతం నుంచి 12 శాతానికి పెరిగినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి ఇథనాల్ కలిపిన పెట్రోల్, 25 శాతానికి చేరనుందన్నారు. నిపుణుల అంచనాల ప్రకారం భారత్ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 2030 నాటికి భారత్లో ఇంధన రిఫైనింగ్ సామర్థ్యం 254మిలియన్ మెట్రిక్ టన్నుల(MMT) నుంచి 450 MMTలకు పెరగనుందన్నారు.
"అతిముఖ్యమైన కాలంలో ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమం జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో భారత్ జీడీపీ వృద్ధిరేటు 7.5శాతంగా నమోదైంది. ఇది ప్రపంచ వృద్ధిరేటు అంచనాల కంటే చాలా ఎక్కువ. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ. అదేవిధమైన వృద్ధిని కొనసాగించనున్నట్లు ప్రపంచ ద్రవ్య నిధి-ఐఎంఎఫ్ అంచనా వేసింది."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ వినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉందన్నారు ప్రధాని మోదీ. ఎల్ఎన్జీ దిగుమతిలో నాలుగో స్థానంలో ఉందని, గత రెండేళ్లలో పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గాయన్నారు. సహజ వాయువు ఉత్తత్తి పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతకుముందు ఓఎన్జీసీ సీ సర్వైవర్ సెంటర్ను ప్రారంభించారు ప్రధానమంత్రి మోదీ. ఆ తర్వాత సుమారు రూ.1,330 కోట్లతో నిర్మించనున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్కు శాశ్వత భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వికసిత్ భారత్, వికసిత్ గోవా కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. కాగా, ఈ ఎనర్జీ వీక్ కార్యక్రమం ఫిబ్రవరి 6నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనుంది.