Rajeev Gandhi Death Anniversary Celebrations : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సోమాజిగూడ కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను నేతలు కొనియాడారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి మహిళల సాధికారతకు తోడ్పడ్డారని గుర్తు చేశారు. యావత్ భారతదేశంలో టెలికాం రంగం అభివృద్ధికి తోడ్పడ్డారని అన్నారు. పేదవారు సెల్ఫోన్ వాడుతున్నారంటే అది ఆయన వల్లే అని చెప్పారు. మరోవైపు.. గాంధీభవన్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ చిత్రపటం వద్ద పలువురు నేతలు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.