తెలంగాణ

telangana

భూదాన్ పోచంపల్లి నుంచి 'సర్వోదయ సంకల్ప పాదయాత్ర'.. పాల్గొన్న భట్టి

By

Published : Mar 14, 2022, 1:21 PM IST

Sarvodaya Sankalp Padayatra: రాజీవ్​ గాంధీ పంచాయతీరాజ్​ సంఘటన్​ ఆధ్వర్యంలో​ "సర్వోదయ సంకల్ప పాదయాత్ర" ప్రారంభమైంది. వినోబాబావే శిష్యులు.. యాదాద్రి జిల్లా భూదాన్​ పోచంపల్లి నుంచి యాత్ర చేపట్టారు. దేశవ్యాప్తంగా చేపట్టిన భూదాన ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భూదాన్​ పోచంపల్లి నుంచి మహారాష్ట్ర సేవగ్రామ్​ వరకు సుమారు 600 కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పలువురు కాంగ్రెస్​ నేతలు పాల్గొన్నారు.

Sarvodaya Sankalp Padayatra
'సర్వోదయ సంకల్ప పాదయాత్ర'

Sarvodaya Sankalp Padayatra: దేశవ్యాప్తంగా మొట్టమొదటి భూదాన ఉద్యమానికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.... వినోబా బావే శిష్యులు "సర్వోదయ సంకల్ప పాదయాత్ర"కు శ్రీకారం చుట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి వినోబా బావే స్వగ్రామం అయిన మహారాష్ట్రలోని సేవగ్రామ్​ వరకు 600 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. భూదాన్​ పోచంపల్లిలో ప్రారంభమైన పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కీ, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్​ కుమార్​ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అంతకుముందుగా వినోబాబావే, రామచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

కాంగ్రెస్​ హయాంలోనే

దేశంలోని భూస్వాముల నుంచి వినోబాబావే 45 లక్షల ఎకరాలు సేకరించి పేదలకు పంచారని భట్టి విక్రమార్క తెలిపారు. భూదాన కార్యక్రమానికి రామచంద్రారెడ్డి పోచంపల్లి నుంచే శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. పేదలకు భూ పంపిణీ చేసింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమేనని స్పష్టం చేశారు.

"గతంలో కాంగ్రెస్​ పంచిన భూములను ధరణి పోర్టల్​లోకి ఎక్కించకూడదని తెరాస యత్నిస్తోంది. సర్వోదయ సంకల్ప పాదయాత్ర ద్వారా.. తెరాస పాలన, దోపిడీ గురించి ప్రజలకు తెలియజేస్తాం. వినోబాబావే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ వందల ఎకరాలను పేదలకు పంచగా.. అదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 45 లక్షల ఎకరాలు సేకరించి పేదలకు పంచారు. కానీ ఇప్పుడు తెరాస పాలనలో ప్రజలను దోచుకోవడమే ఉంది." -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

పేదల భూములను లాక్కోవద్దని ప్రభుత్వాలను ఎమ్మెల్యే సీతక్క హెచ్చరించారు. వినోబాబావే స్ఫూర్తితో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూములు పంపిణీ చేసిందని స్పష్టం చేశారు.

భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు పాదయాత్ర

ఇదీ చదవండి:త్వరలోనే రాష్ట్రంలో ఆయిల్‌పామ్ పరిశోధనా కేంద్రం: నిరంజన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details