తెలంగాణ

telangana

పేరుకే తెలంగాణ కుంభమేళా.. జంపన్నవాగులో మాత్రం సమస్యల మేళా..!

By

Published : Oct 31, 2021, 7:00 PM IST

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న జంపన్నవాగు సమస్యలకు నిలయంగా మారింది. ప్రతీసారి జాతర సమయంలో తూతూమంత్రంగా మరమ్మతులు చేస్తూ.. అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. మహాజాతరకు మరో నాలుగు నెలల సమయం ఉన్నా.. ఎన్నో సమస్యలు వెక్కిరిస్తూనే ఉన్నాయి.

so many problems in medaram jampanna vagu
so many problems in medaram jampanna vagu


మేడారం జాతర.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర.. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలైన సమ్మక్క సారలమ్మలకు మొక్కులు తీర్చుకుంటారు. గద్దెకు వెళ్లి మొక్కులు సమర్పించుకునే ప్రతీ భక్తుడు జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరిస్తాడు. జాతర సమయంలో జంపన్నవాగులో ఇసుకేస్తే రాలనంతగా భక్తుల కోలాహలం ఉంటుంది. అంత ప్రముఖ్యత ఉన్న వాగు.. ఎన్నో సమస్యలకు నిలయంగా మారింది. మహా జాతరకు సమయం ఆసన్నమవుతున్నా.. ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారాయి.

తెలంగాణ కుంభమేళా.. మేడారం జాతర

శిథిలావస్థకు స్నానఘట్టాలు..

జాతర సమయంలో హడావిడిగా పనులు చేసే అధికారులు.. నాణ్యతను గాలికి వదిలేయటం సర్వసాధారణంగా మారిపోయింది. గతంలో నిర్మించిన స్నానఘట్టాలు పగుళ్లు బారటమే అందుకు నిదర్శనం. స్నానఘట్టాలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. రెడ్డిగూడెం, మేడారం, ఊరట్టం, చిలకలగుట్ట వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర ఉన్న స్నానఘట్టాలు.. నిర్వాహణ సరిగా లేక ఎక్కడికక్కడే పగుళ్లు బా‌రి శిథిలమవుతున్నాయి.

పగుళ్లతో శిథిలావస్థకు చేరిన స్నానఘట్టాలు

కాజ్వేకు మోక్షం ఎప్పుడో..

మేడారం- ఊరట్టం గ్రామాల మధ్య 2006లో.. వాగుపై నిర్మించిన లోలెవల్ కాజ్వే 2010లో వరదకు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేశారు. ఏటూరునాగారం మీదుగా ఛత్తీస్​గఢ్​​, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల నుంచి భక్తులు ఊరట్టం చేరుకుంటారు. అక్కడి నుంచి మేడారం వెళ్తారు. ఊరట్టం మీదుగా ఈ కాజ్వే నుంచి సులువుగా వెళ్లాల్సింది.. ఇప్పుడు మరో రెండు కిలోమీటర్లు తిరిగి మరో వంతెన మీదుగా మేడారంకు చేరుకోవాల్సి వస్తుంది. కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెకు తీసుకు వచ్చే సమయంలో ఈ కాజ్వే ఉపయోగపడుతుంది. అయినా ఈ కాజ్వేకు మాత్రం మోక్షం కలగడం లేదు.

కొట్టుకుపోయిన క్వాజీ

కోతకు గురవుతున్న భూములు..

అలాగే ఊరట్టం వైపున ఉన్న భూములు వాగు వరద ఉద్ధృతికి కోతకు గురవుతున్నాయి. స్నానఘట్టాలు ఉన్న చోట ఈ ప్రమాదం లేకున్నా.. అవి లేని చోట మాత్రం భూములు కోల్పోవల్సి వస్తుంది. దాదాపు 300 మీటర్ల మేర భూములు కోతకు గురయ్యాయి. అటువైపు నూతనంగా స్నానఘట్టాలు నిర్మిస్తే జాతర సమయంలో ఉపయోగపడటమే కాకుండా రైతుల భూములు కూడా కాపాడుకోవచ్చు.

అన్ని తాత్కలికమే అయితే ఎలా..

పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో సాధారణ భక్తులు వాగు లోతు తెలియక.. వాగులో పడి భక్తులు మృత్యువాత పడుతున్నారు. మూడేళ్లలో దాదాపు 30 మంది వాగులో పడి చనిపోయారు. ప్రమాదాల నివారణకు లోతట్టు ప్రాంతాల్లో కంచెను ఏర్పాటు చేయాలి. అలాగే సూచిక బోర్డులు పెట్టాలి. జాతర సమయం తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకవడంతో ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. స్నానఘట్టాల పై శాశ్వతంగా షవర్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. జాతర సమయంలో మాత్రమే ఏర్పాటు చేసి.. ఆ తర్వాత వాటిని తొలగిస్తున్నారు. దుస్తులు మార్చుకునేందుకు శాశ్వత గదులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

తాత్కాలిక షవర్లు నిర్మించే స్థలం

ఇన్ని సమస్యలు ఉన్నా.. మరో నాలుగు నెలల్లో జాతర సమీపిస్తున్నా.. ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి మేడారం జంపన్నవాగుపై తిష్ఠ వేసిన సమస్యలు పరిష్కరించాలని భక్తులు స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details