రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి (Huzurabad by election campaign) మరో పదిరోజులే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ జోరు పెంచాయి. బతుకమ్మ, దసరా పండుగ రావడం వల్ల మూడు రోజులుగా ఎన్నికల ప్రచారానికి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు దూరంగా ఉన్నారు. 5 నెలలుగా తెరాస నాయకులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై నియోజకవర్గాన్ని హీటెక్కించారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలందరూ సొంతూళ్లకు వెళ్లిపోవడం వల్ల నియోజకవర్గం సైలెంట్గా మారింది.
ప్రచారంలో పెరిగిన వేగం...
పండుగ అనంతరం తిరిగి నియోజకవర్గానికి చేరుకున్న నాయకులు ప్రచారాన్ని (Huzurabad by election campaign) ముమ్మరం చేశారు. మండలాల వారీగా చేరుకున్న ఆయా పార్టీల ఇంఛార్జిలు ప్రచార వేగాన్ని పెంచారు. పోలింగ్కు మరో 13 రోజులే గడువు మిగిలి ఉండటం, 72 గంటల ముందే స్థానికేతరులు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం సూచిస్తుండటం వల్ల ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ఓటర్లను తిప్పుకొనేందుకు యత్నిస్తున్నారు. అయితే పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు స్థానికులైన ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, బీసీ కమిషన్ ఛైర్మన్ కృష్ణ మోహన్ రావు, తదితర స్థానిక తెరాస ప్రజాప్రతినిధులు తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్కు అండగా ఉండనున్నారు.
తెరాస, భాజపా హోరాహోరీ.. చక్కబెట్టుకొనేయత్నంలో కాంగ్రెస్
18 ఏళ్లుగా ఎమ్మెల్యే, మంత్రిగా పదవిలో ఉన్న భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూరి (Balmuri Venkat) స్థానికేతరుడు కావడం.. ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరిపోవడం కొంత మేర నష్టంగానే భావించాలి. 5 నెలల నుంచి నియోజకవర్గంలో మకాం వేసిన తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన స్థానికేతర ప్రచార తారలు ఈనెల 27న సాయంత్రం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లక తప్పదు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.