కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లన్నగుట్ట వద్ద లారీ కిందపడి ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. బాన్సువాడకు చెందిన అమ్మాయి సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియటం వల్ల ఇంట్లో తల్లిదండ్రులు మందలించారు. తీవ్ర మనస్తాపం చెందిన యువతి ప్రేమ సఫలం కాదేమోనని భయపడి ఆత్మహత్యకు యత్నించింది.
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం... కాపాడిన లారీ డ్రైవర్
తన ప్రేమ ఇంట్లో తెలిసి మందలించటం వల్ల తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ లారీ కింద పడి చనిపోయేందుకు ప్రయత్నించగా... చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ ఆమెకు అపాయం కలగకుండా ప్రాణాలతో కాపాడాడు.
లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవరించి లారీని అదుపుచేశాడు. ఈ ఘటనలో అమ్మాయి తలకి బలమైన గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న సదాశివనగర్ ఎస్సై గమనించి కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తన వాహనంలో తీసుకెళ్లారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.
హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండటం వల్లే అమ్మాయి ఇలా ఆత్మహత్యాయత్నం చేసిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యార్థులు హాస్టల్ నుంచి ఎటు వెళ్తున్నారో కూడా తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.