తెలంగాణ

telangana

Saidabad Incident: రాజు కనిపించాడు.. 10 లక్షల రివార్డు నాకే ఇస్తారా..?

By

Published : Sep 17, 2021, 9:20 AM IST

Updated : Sep 17, 2021, 10:19 AM IST

Saidabad Incident
Saidabad Incident: రాజు కనిపించాడు.. రివార్డు నాకే ఇస్తారా..?

సైదాబాద్​ హత్యాచార ఘటన (Saidabad Incident) నిందితుడి ఆచూకీ చెబుతారని పోలీసులు నంబర్లు ప్రకటిస్తే... ఏకంగా 5 వేల కాల్స్‌ వచ్చాయి. వీటిలో దాదాపు అన్నీ ఉత్తుత్తివే కావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

  • గంజాయి కావాలి.. తెచ్చిస్తావా..?
  • సర్‌.. ఫలానా దగ్గర రాజు కనిపించాడు. అరెస్ట్‌ చేస్తారా..? రూ.10 లక్షల రివార్డు నాకే ఇస్తారా..?
  • సర్‌.. ఇప్పుడే చూశా.. పట్టుకునేలోపే మాయమయ్యాడు. ఆ డబ్బు ఇచ్చేస్తారా..?

సైదాబాద్​ హత్యాచార (Saidabad Incident)నిందితుడి ఆచూకీ చెబుతారని పోలీసులు నంబర్లు ప్రకటిస్తే.. వాటికి వచ్చిన ఫోన్‌కాల్స్‌ ఇలా ఉన్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 వేల కాల్స్‌ వచ్చాయి. వీటిలో దాదాపు అన్నీ ఉత్తుత్తివే కావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. రాజు గురించి సమాచారం తెలిస్తే 94906 16366, 94906 16627 నంబర్లకు కాల్‌ చేయాలని పోలీసులు సూచించారు. రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. కొందరు ఈ ఫోన్‌ నంబర్లు నిందితుడివే అనుకొని తిట్లదండకం అందుకున్నారు. మరికొందరేమో గంజాయి ఉందా అని అడిగారు. మొదట్లో ప్రతి కాల్‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. తర్వాత నమ్మదగిన సమాచారం అనిపిస్తేనే రంగంలోకి దిగారు.

సీసీ కెమెరాల పరిశీలన క్రమమిది..

రాజును పట్టుకొనేందుకు సుమారు 3 వేల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, 2 వేల మందిని విచారించారు. సంతోష్‌నగర్‌ లేబర్‌ అడ్డాకు వెళ్తాడన్న సమాచారంతో ఎల్బీనగర్‌, చాంద్రాయణగుట్ట, మిధాని, మలక్‌పేట్‌ మార్గాల్లో ప్రధాన రహదారులు, ప్రైవేటు ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

  • సంతోష్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వైపు, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, ఎల్బీనగర్‌లలోని వెయ్యికి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా రాజు, అతడితోపాటు మరో వ్యక్తి కనిపించాడు.
  • ఎల్బీనగర్‌ నుంచి వనస్థలిపురం, ఉప్పల్‌ వైపు ఉన్న 800 సీసీ కెమెరాల ఫుటేజీలను చూశారు. నాగోల్‌, ఉప్పల్‌ రహదారిపై తొమ్మిది కెమెరాల్లో కనిపించడంతో పరిశోధన ఉప్పల్‌ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.
  • బోడుప్పల్‌ వరకూ మరో 1200 కెమెరాలను పరిశీలించారు. ఒకట్రెండు చోట్ల నిందితుడి అస్పష్ట దృశ్యాలుండడంతో ఘట్‌కేసర్‌ వైపు దృష్టిసారించారు.

పారిపోయేందుకు ఆటో చోరీచేద్దామనుకున్నా..

నిందితుడు రాజు (raju) ఎల్బీనగర్‌లో ఓ ఆటోను దొంగిలించి అందులోనే పారిపోవాలని భావించాడు. టీ తాగేందుకు వెళ్లిన ఆటో యజమాని రావడంతో పథకం పారలేదని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈనెల 11న రాజు పోలికలతో ఉన్న ఓ వ్యక్తి ఆటోలో వెనుక భాగంలో కూర్చున్నట్లు గుర్తించారు. యజమాని లేకపోవడంతో ముందుకొచ్చి ఆటోను స్టార్ట్‌ చేసేందుకు యత్నించినట్లు కనిపించింది. అది చూసిన యజమాని అక్కడికొచ్చి ఏం చేస్తున్నావంటూ నిలదీసి రాజు దగ్గరున్న సంచిని పరిశీలించాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆటో యజమానిపై దాడి చేసేందుకు యత్నించగా పక్కనున్న ఆటోడ్రైవర్లు, స్థానికులు అడ్డుకున్నారు. ఇద్దర్నీ సముదాయించి పంపించేశారు. ఆ తర్వాత నిందితుడు ప్రధాన చౌరస్తాలోని ఓ హోటల్‌వైపు వెళ్లి అక్కడ బస్సు ఎక్కాడు. బండి నంబర్‌ ఆధారంగా ఆ ఆటో డ్రైవర్‌ను గుర్తించి.. మరిన్ని వివరాలు సేకరించారు. రాజు గురించి ఎవరికీ అవగాహన లేకపోవడంతో తప్పించుకున్నాడని, లేదంటే అదే రోజు చిక్కేవాడని పోలీసులు పేర్కొంటున్నారు. గతంలో నిందితుడిపై చైతన్యపురి ఠాణాలో ఆటో చోరీ కేసు నమోదైందన్నారు.

సంబంధిత కథనాలు...

Last Updated :Sep 17, 2021, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details