తెలంగాణ

telangana

రైతు కష్టం వర్షార్పణం - మిగ్‌జాం తుపాను బీభత్సానికి కర్షకులు కుదేలు

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 7:58 AM IST

Cyclone Michaung Effect In Telangana : మిగ్​జాం తుపాను అన్నదాతకు గుండెకోత మిగిల్చింది. ఇంటిల్లిపాది రెక్కలుముక్కలు చేసుకుని సాగు చేసుకున్న రైతు కష్టాన్ని తుపాను నిండా ముంచేసింది. మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్నదాతకు తీరని శోకం మిగిలిస్తోంది. చేతికొచ్చిన వరి, కోతకు సిద్ధమైన మిర్చి, ఆదాయం తెస్తుందనుకున్న పత్తి, మొక్కజొన్న పంటలు వర్షార్పణమై కర్షకులకు తీరని కష్టాన్ని మిగిలిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయిన హలదారు పీకల్లోకు కష్టాల్లో మునిగితేలుతున్నారు.

Huge Crops Loss To Farmers In Telangana
Cyclone Michaung Effect In Telangana

రైతు కష్టం వర్షార్పణం - మిగ్‌జాం తుపాను బీభత్సానికి కర్షకులు కుదేలు

Cyclone Michaung Effect In Telangana: మిగ్‌జాం తుపాను బీభత్సానికి కర్షకులు కుదేలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 4.72 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేయగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే సుమారుగా 95వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు గుర్తించారు. వర్షానికి బలమైన గాలుల తోడవడంతో చేతికొచ్చిన పత్తి, మిరప, వరి పంటలకు నష్టం వాటిల్లగా కల్లాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిసి అన్నదాతలు అల్లాడిపోతున్నారు. అంతేగాక పలు జిల్లాల్లో వరుణ ప్రతాపానికి రైతులు ఇప్పటికీ వణికిపోతున్నారు. పంట నష్టానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు, ఈదురు గాలులకు వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అన్నదాతలకు అపార నష్టం కలిగించిందని చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు పచ్చని పంటలతో కళకళలాడిన వ్యవసాయ క్షేత్రాలు తుపానుతో అన్నదాతలకు కన్నీటి శోకాన్ని మిగిల్చాయి. ప్రధానంగా వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు వేసిన రైతులు పూర్తిగా నష్టపోయారు.

Farmers Problems In Telangana : తుపాను ప్రభావంతో పంటలన్నీ పూర్తిగా వర్షపు నీటిలో నానిపోతున్నాయి. ముదిగొండ, మధిర, వేంసూరు, సత్తుపల్లి, దమ్మపేట, భద్రాచలం తదితర మండలాల్లో అనేక గ్రామాల్లో ప్రధాన ఆహార వరి సహా పత్తి, మిరప, మొక్కజొన్న, ఇతర కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు ఆయా పంటలు నీట మునిగి కుళ్లిపోతున్నాయి. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసుకున్న పంటలు. గంటల వ్యవధిలోనే దెబ్బతిన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

జలదిగ్బంధంలోనే చెన్నై- అనేక గంటలుగా పవర్​కట్​- ఆహారం లేక ప్రజలు విలవిల!

Huge Crops Loss To Farmers In Telangana : రాష్ట్రవ్యాప్తంగా 4.72లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేయగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే సుమారుగా 95 వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు గుర్తించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 53వేల 903 మంది రైతులు 59వేల307 ఎకరాల్లో వరి, 17వేల267 ఎకరాల్లో మిర్చి, 5వేల262 ఎకరాల్లో మొక్కజొన్న, 348 ఎకరాల్లో పత్తి పంట నష్టపోయినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 13వేల 608 ఎకరాల్లో 7వేల450 మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా 5వేల298 ఎకరాల్లో వరి, 2వేల475 ఎకరాల్లో మిర్చి, 585 ఎకరాల్లో మొక్కజొన్న, వేయి 602 ఎకరాల్లో వేరుశనగ పంటలను నష్టోపోయినట్లు గుర్తించారు.

భారీగా వర్షాలు, రైలు పట్టాలపై నీరు-మిగ్‌జాం తుపానుతో స్తంభించిన రవాణా వ్యవస్థ!

"తుపాను ప్రభావంతో పంటలన్నీ పూర్తిగా వర్షపు నీటిలో నానిపోతున్నాయి. కవర్లు ఏర్పాటు చేయడం వలన నష్టాన్ని కొంత మేరకు తగ్గించవచ్చు. వాతావరణ హెచ్చరికలు జారీ చేసినా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు కనీస ఏర్పాట్లు చేయలేదు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.'' - తీగల సాగర్, రైతుసంఘం ప్రధాన కార్యదర్శి

వరంగల్, హనుమకొండ, ములుగు, జనగామ, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో కోతలు కోసిన వరి పంటతోపాటు కల్లాల్లో ఆరిబోసిన ధాన్యం తడిసింది. పత్తి సైతం రంగు మారిపోతోంది. కొన్ని చోట్లైతే వరద నీరు చేరి ధాన్యం కొట్టుకుపోయింది. వాతావరణ హెచ్చరికలు జారీ చేసినా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు కనీస ఏర్పాట్లు చేయకపోగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. తుపాను పంటల దిగుబడి, నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపి ఈ సారి నష్టాల దిగుబడులు మూటగట్టుకోక తప్పదని కర్షకుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నారు.

మిగ్​జాం ఎంత పనిచేసింది - కోతకొచ్చిన పంటను నేలరాల్చింది - ధాన్యం కుప్పలను నీట ముంచింది

తీరం దాటిన మిగ్​జాం తుపాను - తీర ప్రాంతంలో ఈదురు గాలులు

ABOUT THE AUTHOR

...view details