తెలంగాణ

telangana

Khairatabad Ganesh: గంగ ఒడికి చేరనున్న ఖైరతాబాద్ మహాగణపతి.. ఏర్పాట్లు పూర్తి

By

Published : Sep 19, 2021, 5:23 AM IST

Updated : Sep 19, 2021, 6:30 AM IST

Khairatabad Ganesh: గంగ ఒడికి చేరనున్న ఖైరతాబాద్ మహాగణపతి.. ఏర్పాట్లు పూర్తి

ఖైరతాబాద్​ మహాగణపతి గంగ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. తొమ్మిది రోజులపాటు భక్తులకు కనువిందు చేసిన ఖైరతాబాద్ గణనాథుడు.. నేడు గంగ ప్రవేశం చేయనున్నాడు. తొమ్మిది రోజుల ఉత్సవాల అనంతరం గణనాథుడిని సాగనంపేందుకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఖైరతాబాద్ గణేషుడు సాగరాన్ని చేరే సమయం ఆసన్నమైంది. 60 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఖైరతాబాద్ గణనాథుడు.. ఈ ఏడాది శ్రీ పంచముఖ రుద్ర మహాగణాధిపతిగా కనువిందు చేశాడు. నిత్యం వందల సంఖ్యలో భక్తులు మహాకాయుడిని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో కొలుచుకున్నారు. ఇక తొమ్మిది రోజుల పాటు సాగిన ఉత్సవాలు నేడు నిమజ్జన కార్యక్రమంతో ముగియనున్నాయి. వెళ్లిరా గణపయ్య.. మళ్లీ రావయ్యా అంటూ భక్తులు గణపయ్యను ఏటా జయజయ ధ్వానాల మధ్య సాగనంపుతుంటారు. ఇందుకు తగినట్లే ఈ ఏడాదీ నిర్వాహకులు, ప్రభుత్వం సంయుక్తంగా భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.

శనివారం అర్ధరాత్రి నుంచే ఖైరతాబాద్ గణేషుడిని ట్రాలీ మీదకు ఎక్కించే పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం విజయవాడ నుంచి ట్రాలీ వచ్చింది. ముందుగా మహా గణపతి విగ్రహానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ విగ్రహాలను ట్రాలీలపైకి చేరుస్తారు. అనంతరం భారీ క్రేన్ సహాయంతో మహా గణపతిని ట్రాలీపైకి చేర్చి వెల్డింగ్ పనులను నిర్వహిస్తారు. ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఏడు గంటల తర్వాత ఖైరతాబాద్ నుంచి విగ్రహం టెలిఫోన్ భవన్ మీదుగా ట్యాంక్​బండ్​పైకి చేరుకుంటుంది. 4వ నెంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ గణపయ్యను గంగ ఒడికి చేర్చనున్నారు.

కొవిడ్ ఆంక్షలు ఉన్నప్పటికీ ఖైరతాబాద్ గణనాథుడిని సాగనంపేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

ఖైరతాబాద్​ గణపయ్య ఇలా మొదలయ్యాడు..

ఖైరతాబాద్​లో 1954లో తొలిసారిగా అప్పటి కౌన్సిలర్ సింగరి శంకరయ్య ఈ గణేశ్​ ఉత్సవాలను ప్రారంభించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఖైరతాబాద్​లో మొదట ఒక అడుగు విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి 60 ఏళ్ల పాటు ఏటా ఒక అడుగు చొప్పున విగ్రహం ఎత్తు పెంచుతూ వచ్చారు. 2014 నుంచి విగ్రహం ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. ఏటా ఒక్కో ఆకృతిలో కనువిందు చేయటం ఖైరతాబాద్ గణేషుడి విశిష్టత. ప్రముఖ శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలోని శిల్పుల బృందం ఏటా ఈ విగ్రహాన్ని తయారు చేస్తోంది. ఇక 2011 నుంచి ఏటా తాపేశ్వరం నుంచి ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణేషుడి ప్రసాదంగా లడ్డూ వస్తుంటుంది. ఈసారి నగరానికి చెందిన వారే లడ్డూ అందించగా.. తాపేశ్వరం నుంచి వచ్చిన వంద కేజీల లడ్డూ సహా మొత్తం ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితమే పూర్తి చేయటం విశేషం.

ఇదీ చూడండి: Ganesh Immersion: గణేశ్​ శోభాయాత్ర, నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధం... ఏర్పాట్లు పూర్తి

Last Updated :Sep 19, 2021, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details