తెలంగాణ

telangana

'మేమందరం కావాలా ? ఒక్కరు కావాలా ? పార్టీ పెద్దలు తేల్చుకోవాలి'

By

Published : Feb 13, 2023, 12:50 PM IST

Councilors Demand for Muncipal Chairman Resignation: భద్రాద్రి జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీలో వారం రోజులుగా కొనసాగుతున్న విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. మున్సిపల్‌ ఛైర్మన్‌కు వ్యతిరేకంగా అజ్ఞాతంలోని అసమ్మతి కౌన్సిలర్లు మరోసారి విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఛైర్మన్ రాజీనామా చేస్తేనే అజ్ఞాతం నుంచి వస్తామని కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఈనెల 6న 15 మంది కౌన్సిలర్ల సంతకాలతో కలెక్టర్‌కు అసమ్మతి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Councilors
Councilors

Councilors Demand for Muncipal Chairman Resignation : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ పాలకవర్గంలో విభేదాలు తారస్థాయికి చేరాయి. మున్సిపల్‌ ఛైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై కలెక్టర్‌కు అసమ్మతి నోటీసు సమర్పించినప్పటి నుంచి తమపై వేదింపులు పెరిగాయని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్‌ సమావేశాల్లో తమను హేళన చేస్తున్నారని, వార్డు సమస్యలను విన్నవించినా... పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో తాము ఛైర్మన్‌పై అసమ్మతి తెలిపినట్టు చెప్పారు.

అసమ్మతి గళం వినిపిస్తున్న కౌన్సిలర్లు పార్టీకీ, ఎమ్మెల్యే హరిప్రియకు విధేయులమని తెలిపారు. కానీ తమ బాధంతా మున్సిపల్ ఛైర్మన్ తోనే అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తామందరం కావాలా...? ఒక్కరు కావాలో పార్టీ పెద్దలే తేల్చుకోవాలని సూచించారు. తమలో ఒక్కరిపై చర్యలు తీసుకున్న మూకుమ్మడిగా అందరం రాజీనామా చేస్తామని హెచ్చరించారు. భద్రాద్రి బీఆర్​ఎస్ అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎమ్మెల్యే హరిప్రియలను కూడా మున్సిపల్ ఛైర్మన్ పట్టించుకోవడం లేదని... ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ తాతామధుతో కలిసి కుల రాజకీయాలు చేస్తున్నారన్నారని ధ్వజమెత్తారు.

'ఛైర్మన్‌ వెంకటేశ్వరరావు వేధింపులు తాళ్లలేకే అసమ్మతి తెలిపాం. వార్డు సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదు. కౌన్సిల్‌ సమావేశాల్లో హేళన చేస్తున్నారు. పార్టీకీ, ఎమ్మెల్యే హరిప్రియకి విధేయులం. మేమందరం కావాలా? ఒక్కరు కావాలా ? పార్టీ పెద్దలు తేల్చుకోవాలి. మాలో ఒక్కరిపై చర్యలు తీసుకున్నా అందరం రాజీనామా చేస్తాం. ఎమ్మెల్యేను కూడా పట్టించుకోవడం లేదు.'- అసమ్మతి కౌన్సిలర్లు, ఇల్లెందు మున్సిపాలిటీ

ఆ ఎమ్మెల్సీ అన్నింట్లో జోక్యం చేసుకుంటున్నారు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్​ఎస్ అధ్యక్షుడిని కాదని ఖమ్మం బీఆర్​ఎస్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ తాతా మధు అన్నింట్లో జోక్యం చేసుకుంటున్నారని అసమ్మతి కౌన్సిలర్లు ఆరోపించారు. మూడేళ్ల సమయంలో వచ్చిన అవిశ్వాస తీర్మానం కోసమే తాము ప్రయత్నాలు చేస్తున్నామన్న వారు.. డబ్బుల కోసం వెళ్లారని కొందరు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సమయంలో తమను క్యాంపునకు తరలించినప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చారని కౌన్సిలర్లు ప్రశ్నించారు. 24 మంది పాలకవర్గంలో 16 మంది మహిళ కౌన్సిలర్లు, ఇల్లెందు ఎమ్మెల్యేగా మహిళా ప్రజాప్రతినిధి ఉన్న తమకు న్యాయం కావాలని అసమ్మతి కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం : రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మున్సిపల్ పాలకవర్గాల్లో విభేదాలు ఉన్నప్పటికీ... ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన భద్రాద్రి జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య ప్రకంపనలు కొనసాగుతుండగా... తాజాగా ఇల్లెందు మున్సిపల్ పాలకవర్గంలోని కౌన్సిలర్లు వారం రోజులుగా అజ్ఞాతంలో ఉంటూ పరస్పరం ఘాటైన విమర్శలు చేసుకోవడం.. మళ్లీ అందరూ బీఆర్​ఎస్​తోనే ఉన్నామని చెబుతున్న ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మేమందరం కావాలా ? ఒక్కరు కావాలా ? పార్టీ పెద్దలు తేల్చుకోవాలి : కౌన్సిలర్లు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details