ETV Bharat / state

Budget Sessions 2023-24: అధికారపక్షం అలా.. విపక్షాలు ఇలా

author img

By

Published : Feb 13, 2023, 7:32 AM IST

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని విపక్షాలు ఆరోపించాయి. అధికార పార్టీకి మందబలం ఉందని ప్రతిపక్షాలను విమర్శించే పనే పెట్టుకుందని నేతలు వాపోయారు. మరోవైపు బడ్జెట్‌ సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సమావేశాలు ఎన్నిరోజులు జరిగాయన్నది ముఖ్యం కాదని, ఎంత ప్రభావం చూపాయన్నదే ప్రధానమని పేర్కొన్నారు.

Opposition criticizes the ruling party
అధికార పార్టీపై విపక్షాలు విమర్శలు

అసెంబ్లీపై బీఆర్​ఎస్​కు గౌరవం లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. శాసనసభ సమావేశాలు తెలంగాణ పద్దుపై జరిగిందా లేక కేంద్ర బడ్జెట్‌పై జరిగిందా అనే అనుమానం కలుగుతోందని నేతలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే కేంద్రంపై నెపం వేశారని ఆరోపించారు. ఏడు రోజుల బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలన్నీ చర్చకు రాకపోవడం బాధాకరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీ వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో కాంగ్రెస్ సైతం వైఫల్యం చెందిందని విమర్శించడం బాధాకరమన్నారు.

నన్ను ఇబ్బంది పెట్టేందుకే: ప్రతిపక్షాలను అవమానించేలా బీఆర్​ఎస్ వ్యవహరించిందని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఈటల పేరును పలుమార్లు ప్రస్తావించడంపై స్పందించారు. అసెంబ్లీ వేదికగా తనను ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేసి ఉంటారని అన్నారు. తన సూచనలకు స్పందించినంత మాత్రాన ఈటల పార్టీ మారడని స్పష్టం చేశారు.

అర్థవంతంగా సమావేశాలు: బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. శాసనసభ ఏడు రోజుల్లో 56 గంటల 25 నిమిషాల పాటు, మండలి 5 రోజుల్లో 17 గంటల పాటు అర్ధవంతంగా జరిగాయని పేర్కొన్నారు.

విపక్ష సభ్యులు లేకపోవడం విచారకరం: పోడు భూములపై గిరిజన, ఆదివాసీలకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారని.. వాల్మీకి బోయలను, కాయస్త్ లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించుకున్నామని ప్రశాంత్​రెడ్డి తెలిపారు. ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యుల బలం తక్కువగా ఉన్నా.. ఎక్కడా బుల్డోజ్ చేయడానికి ప్రయత్నించలేదని మంత్రి అన్నారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పద్దులపై సమాధానం చెప్పే సమయంలో విపక్ష సభ్యులు లేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.

అధికార పార్టీపై విపక్షాలు విమర్శలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.