తెలంగాణ

telangana

చిన్నస్వామిలో చెలరేగిన కోహ్లీ.. ముంబయిపై బెంగళూరు ఘన విజయం

By

Published : Apr 2, 2023, 11:05 PM IST

Updated : Apr 3, 2023, 7:24 AM IST

ముంబయితో మ్యాచ్​లో బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. కొండంత లక్ష్యాన్ని అలవోకగా కరిగించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ లక్ష్య ఛేదనలో విజృంభించారు.

ipl 2023
ipl 2023

కరోనా మహమ్మారి తర్వాత తొలిసారి సొంత మైదానంలో ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొట్టింది. 'ఆర్సీబీ... ఆర్సీబీ...' అంటూ నినాదాలతో స్టేడియాన్ని ఫ్యాన్స్ హోరెత్తించిన వేళ.. ముంబయిపై చెలరేగిపోయింది. బౌలింగ్​లో తిలక్ వర్మను మినహా.. మిగిలిన ముంబయి బ్యాటర్లను కట్టడి చేసిన ఆర్సీబీ.. బ్యాటింగ్​లో అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ(82 నాటౌట్‌; 49 బంతుల్లో 6×4, 5×6), కెప్టెన్ డుప్లెసిస్(73; 43 బంతుల్లో 5×4, 6×6) ధాటిగా ఆడారు. కోహ్లీ చూడముచ్చటైన షాట్లు కొట్టగా.. డుప్లెసిస్ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో తొలి నుంచీ విజయం దిశగా దూసుకెళ్లింది బెంగళూరు. ముంబయి బౌలర్లు ఏ దశలోనూ ఈ జోడీని ఇబ్బంది పెట్టలేకపోయారు. ఫలితంగా ముంబయి నిర్దేశించినా 172 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్​ డుప్లెసిస్​ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అందుకున్నాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి.. పరుగులు చేసేందుకు ఇబ్బంది పడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, వన్​డౌన్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్.. తీవ్రంగా నిరాశపర్చారు. స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ సైతం తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడు. అలా 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబయిని తిలక్‌ వర్మ (84 నాటౌట్‌; 46 బంతుల్లో 9×4, 4×6) తమ గొప్ప పోరాటంతో అద్భుతం చేసి ఆదుకున్నాడు. బాధ్యతాయుతంగా ఆడుతూనే.. విధ్వంసం సృష్టించాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరును సాధించి పెట్టాడు. దీంతో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీన్ని అలవోకగా ఛేదించింది ఆర్సీబీ.

కోహ్లీ రికార్డు.. ఈ ఐపీఎల్‌లో విరాట్​ కోహ్లీ.. రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు తరఫున అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్సీబీ ఓపెనర్‌గా 3 వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా ఈ ఐపీఎల్​లో ఇప్పటివరకు 224 మ్యాచ్‌లు ఆడిన అతడు 6,706 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో అతడు 50ప్లస్​ స్కోరు ఇది 50వ సారి. దీంతో ఈ ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు చేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ (60), కోహ్లీ (50), శిఖర్‌ ధావన్‌ (49), ఏబీ డివిలియర్స్‌(43) నాలుగో స్థానంలో, రోహిత్‌ శర్మ(41) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇదీ చూడండి:IPL 2023: RCB-Mumbai మ్యాచ్​కు వచ్చిన స్పెషల్ గెస్ట్​లు వీరే.. ఫొటోస్​ చూశారా?

Last Updated :Apr 3, 2023, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details