తెలంగాణ

telangana

Afghan Crisis: పెనం పై నుంచి పొయ్యిలోకి..

By

Published : Aug 30, 2021, 7:22 AM IST

తాలిబన్ల కబంధ హస్తాల పాలబడిన అఫ్గానిస్థాన్‌పై(Afghan Crisis) అతి త్వరలోనే ఆకలి రక్కసి(Hunger crisis in Afghanistan) విరుచుకుపడబోతోందని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది. దాదాపు నాలుగు కోట్ల అఫ్గాన్‌ జనాభాలో 1.4 కోట్ల మందికి ఆహార సాయం అత్యవసరమని ప్రకటించింది. మూడేళ్లలో రెండోసారి కరవు కోరల్లో చిక్కిన దేశంలో కొవిడ్‌తో పరిస్థితులు(Covid in afghan) మరింతగా విషమించాయి. పాశ్చాత్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు నిధులను బిగపట్టడం వల్ల ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం ప్రబలుతోంది.

hunger crisis in afghanistan
అఫ్గాన్​లో ఆహార సంక్షోభం

కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Kabul Airport) అసహాయుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. భవిష్యత్తుపై భరోసా లేని దుస్థితిలో దేశం దాటిపోవాలనుకొంటున్న అఫ్గానీల(Afghan Crisis) కలలు కల్లలవుతున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని, పిల్లాపాపలను భుజాలకెత్తుకొని అక్కడే పడిగాపులు పడుతున్న వారి వెతలతో మానవతావాదుల గుండెలు తరుక్కుపోతున్నాయి. తాలిబన్ల కబంధ హస్తాల పాలబడిన అఫ్గానిస్థాన్‌పై(Taliban Afghanistan) అతిత్వరలోనే ఆకలి రక్కసి(Hunger crisis in Afghanistan) విరుచుకుపడబోతోందని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది. దాదాపు నాలుగు కోట్ల అఫ్గాన్‌ జనాభాలో 1.4 కోట్ల మందికి ఆహార సాయం అత్యవసరమని ప్రకటించింది. మూడేళ్లలో రెండోసారి కరవు కోరల్లో చిక్కిన దేశంలో కొవిడ్‌తో పరిస్థితులు మరింతగా విషమించాయి.

దుర్భర దారిద్య్రం మూలంగా

అమెరికన్‌ దళాలు అర్ధాంతరంగా వెనుదిరగడంతో ముష్కర మూకలు అధికారాన్ని వేగంగా చేజిక్కించుకొన్నాయి. అవి మరింతగా పేట్రేగిపోకుండా పాశ్చాత్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు నిధులను బిగపట్టడంతో అఫ్గానిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ప్రబలుతోంది. గడచిన ఏడాదితో పోలిస్తే రెండు రెట్లకు పైగా ఎగబాకిన ద్రవ్యోల్బణంతో ధరలు కొండెక్కితే- బ్యాంకులు మూతపడి నగదు చలామణీ కోసుకుపోవడంతో జనావళి అల్లాడిపోతోంది. నిత్యావసరాల నుంచి ఔషధాల వరకు అన్నింటికీ అంగలార్చుతోంది. దశాబ్దాల యుద్ధం మిగిల్చిన అభద్రత, రాజకీయ అస్థిరత, అరకొర మౌలిక సదుపాయాలు, పట్టపగ్గాల్లేని అవినీతితో దేశీయంగా పారిశ్రామిక రంగం ఉనికి అంతంతమాత్రమే! వ్యవసాయంతో పాటు చిన్నాచితకా వృత్తులపై ఆధారపడిన అఫ్గానీల్లో అత్యధికుల రోజువారీ ఆదాయం రూ.150 కంటే తక్కువే! దుర్భర దారిద్య్రం మూలంగా అయిదేళ్ల లోపు చిన్నారుల్లో సగంమంది తీవ్రస్థాయి పోషకాహార లోపంతో బక్కచిక్కిపోతున్నారు. పోనుపోను పెచ్చరిల్లుతున్న నిరుద్యోగితతో యువతరం ఈసురోమంటుంటే- నెలల తరబడి జీతాలకు నోచుకోని ప్రభుత్వోద్యోగులు ప్రత్యక్ష నిరసనలకు దిగుతున్నారు. పౌరహక్కులను చెరపట్టడంలో తప్ప నిర్మాణాత్మక పాలనలో అనుభవం శూన్యమైన తాలిబన్‌ తండాల ఏలుబడిలో- అఫ్గానిస్థాన్‌ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి.

ఆ నిధులు స్తంభించిపోయే ప్రమాదం!

ప్రపంచ దేశాల దాతృత్వమే ప్రాణవాయువుగా అఫ్గానిస్థాన్‌లో(Afghan Crisis) మునుపటి పౌరప్రభుత్వం రాజ్యంచేసింది. 2016-20 మధ్య ఘనీ సర్కారుకు విదేశాల నుంచి లక్షా పదివేల కోట్ల రూపాయల మేరకు ఆర్థిక సాయం అందింది. దానికి కొనసాగింపుగా వచ్చే నాలుగేళ్లలో అఫ్గానిస్థాన్‌కు రూ.88వేల కోట్ల వరకు సమకూర్చడానికి నిరుడు జెనీవా సమావేశంలో అంతర్జాతీయ సమాజం అంగీకరించింది. అధికార పీఠంపైకి తాలిబన్ల పునరాగమనంతో(Taliban Afghanistan) ఈ నిధుల ప్రవాహం స్తంభించిపోయే ప్రమాదం నెలకొంది. రూ.51వేల కోట్ల విలువైన అఫ్గాన్‌ అంతర్జాతీయ వాణిజ్యంలో ఎగుమతుల వాటా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలే! వాటిలోనూ 47శాతానికి భారత విపణే ఆధారం. పాకిస్థాన్‌ ప్రత్యక్ష ప్రోద్బలం, చైనా పరోక్ష మద్దతుతో రాజ్యాధికారాన్ని సంపాదించిన తాలిబన్ల హయాములో ఇండియాతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే- అఫ్గాన్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కష్టం!

సమ్మిళిత ప్రభుత్వం కావాల్సిందే!

'బలప్రయోగంతో తాలిబన్లు దేశాన్ని వశం చేసుకొన్నారు కానీ, పాలన సాగించడం వారికి అంత సులభసాధ్యం కాబోదు' అన్న అఫ్గానిస్థాన్‌ సెంట్రల్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌ అజ్మల్‌ అహ్మదీ వ్యాఖ్యలు అక్షరసత్యాలు. రాబోయే గండాలను చైనా అండతో తప్పించుకోవాలని తాలిబన్‌ నేతలు తలపోస్తున్నారు. స్వప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించే బీజింగ్‌ పెద్దలు మాత్రం అఫ్గాన్‌ సహజ వనరులపైనే కన్నేశారు. ఎడతెగని హింసతో ఇన్నేళ్లుగా కష్టాలనే మూటగట్టుకొన్న సగటు అఫ్గానీల జీవితాల్లో వెలుగులు నిండాలంటే- దేశీయంగా సుస్థిర సమ్మిళిత ప్రభుత్వం పాదుకొనాల్సిందే. ప్రజాస్వామ్యం పొడగిట్టని ఛాందస ముఠాలతో అది గగన కుసుమంగా కనిపిస్తుండటమే అందరిలోనూ ఆందోళన కలిగిస్తోందిప్పుడు!

ఇదీ చూడండి:కాబుల్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. ముగ్గురు చిన్నారులు మృతి

ఇదీ చూడండి:అఫ్గాన్​ దాడిలో మృతిచెందిన సైనికులకు బైడెన్ నివాళి

ABOUT THE AUTHOR

...view details